Ukraine Crisis: శాంతించని పుతిన్.. ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న రష్యా భీకర దాడులు.. అక్కడి తాజా పరిస్థితిపై న్యూస్ అప్‌డేట్స్

Russia Ukraine War News: ఉక్రెయిన్‌పై రష్యా దూకుడు మరింత పెంచింది. వైమానిక దాడులను పుతిన్ సేనలు మరింత ముమ్మరం చేశాయి. కీవ్‌, సుమి, లోవ్, జపోరోజి, మైకోలెవ్,చెక్సీతో పాటు కీలక ప్రాంతాల్లో..

Ukraine Crisis: శాంతించని పుతిన్.. ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న రష్యా భీకర దాడులు.. అక్కడి తాజా పరిస్థితిపై న్యూస్ అప్‌డేట్స్
Russia Ukraine War
Follow us

|

Updated on: Mar 16, 2022 | 11:43 AM

Russia Ukraine War News: ఉక్రెయిన్‌పై రష్యా దూకుడు మరింత పెంచింది. వైమానిక దాడులను పుతిన్ సేనలు మరింత ముమ్మరం చేశాయి. కీవ్‌, సుమి, లోవ్, జపోరోజి, మైకోలెవ్,చెక్సీతో పాటు కీలక ప్రాంతాల్లో రష్యా యుద్ధ విమానాలు భీకర దాడులు చేస్తున్నాయి. యుద్ధాన్ని ఆపేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా నో యూజ్‌..21 రోజులైనా ఇంకా పుతిన్‌ శాంతించడం లేదు. రష్యా అధ్యక్షుడు యుద్ధ నేరస్తుడని ఆరోపిస్తూ అమెరికా సెనేట్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. దీంతో పాటు ఉక్రెయిన్‌లో రష్యా దాడులకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ మీ కోసం..

  1. ఉక్రెయిన్‌లో రష్యా సైన్యం సూర్యోదయానికి ముందే రష్యా ఆర్మీ కీవ్‌లో విధ్వంసం సృష్టించాయి. 15 అంతస్తుల అపార్ట్‌మెంటుపై బాంబుల వర్షం కురిపించింది.ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, వందలాది మంది లోపలే చిక్కుకుపోయారు. పొడిల్‌స్కీలో మరో 10 అంతస్తుల అపార్ట్‌మెంటుపైనా ఇలాంటి దాడే జరిగింది.
  2. యుద్ధం మొదలైనప్పటి నుంచి 13వేల 500 మంది రష్యా సైనికులను చంపినట్లు ప్రకటించింది ఉక్రెయిన్. 404 ట్యాంకులు, 1279 సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. మరోవైపు కీవ్‌లో భీకరపోరు కొనసాగుతోంది. రష్యన్‌ క్షిపణులు జనావాసాలపై పడుతున్నాయి కీవ్‌లో కర్ఫ్యూ కొనసాగుతోంది
  3. ఉక్రెయిన్‌ రాజధాని నగరం కీవ్‌పై రష్యా బాంబుల దాడిని మరింత ఉద్ధృతం చేసింది.రష్యా బాంబు దాడులతో నగరంలోని ఓ 15 అంతస్తుల బిల్డింగ్‌తో పాటు పలు భవనాలు ధ్వంసమయ్యాయి. డజన్ల సంఖ్యలో మరణాలు సంభవించినట్టు సమాచారం. పలు ఇతర నగరాల్లో కూడా రష్యా బలగాలు దాడులు కొనసాగాయి.
  4. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 13వేల 500 మంది రష్యా సైనికులను చంపినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. వందల సంఖ్యలో సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. మరోవైపు, రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.ఈ పరిస్థితుల్లో ఐరోపా దేశాల అధినేతలు ఉక్రెయిన్ ​పర్యటన చేపట్టారు.
  5. రష్యా సేనలు దాడులు ఉద్ధృతం చేస్తున్న క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐరోపాకి చెందిన మూడు దేశాల నేతలు ఉక్రెయిన్‌ పర్యటనకు వెళ్లారు. పోలండ్‌, చెక్‌ రిపబ్లిక్‌, స్లొవేనియా దేశాల ప్రధానులు కీవ్‌లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ప్రధాని డెనిస్‌లను కలిశారు.ఆ ముగ్గురు జెలెన్‌స్కీతో సమావేశమైయ్యారు.
  6. ఒకవైపు దాడులు జరుగుతున్నవేళ, చర్చలపై అనుమానాలు వస్తున్నాయి. కానీ రష్యాతో చర్చలు కొనసాగుతాయని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. మరోవైపు ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు- పోలండ్‌ , చెక్‌ రిపబ్లిక్‌ , స్లోవేనియా ప్రధానులువస్తున్నారు. జెలెన్‌స్కీతో వీరు భేటీ అవుతారు. యూరోపియన్‌ దేశాల మద్దతు కోరేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.
  7. ఉక్రెయిన్‌ గగనతలం మీద నో-ఫ్లయ్‌ జోన్‌ అమలు చేసేందుకు విముఖత వ్యక్తం చేసిన నాటోపై అసంతృప్తి వ్యక్తం చేశారు జెలెన్‌స్కీ.కొందరు దేశాధినేతలు రష్యాకు హిప్నటైజ్‌ అయ్యారని వ్యాఖ్యానించారు. నాటో కూటమిలో చేరబోమని మరోసారి స్పష్టం చేశారు జెలెన్‌స్కీ.. ఈ వాస్తవాన్ని ప్రజలంతా అంగీకరించాలని కోరారు.
  8. ర‌ష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కి రివ‌ర్స్ ఝ‌ల‌క్ ఇచ్చారు.అమెరికా అధ్య‌క్షుడు బైడెన్‌, హిల్ల‌రీ క్లింట‌న్‌తో స‌హా మ‌రో 12 మంది ర‌ష్యాలోకి ప్ర‌వేశించ‌డానికి వీల్లేద‌ని పుతిన్ ఆదేశాలు జారీచేశారు. ఈ విష‌యాన్ని ర‌ష్యా విదేశాంగ శాఖ ప్ర‌క‌టించింది. ఇలా చేయ‌డం అమెరికాపై ప్రతీకారం తీర్చుకున్నట్లేన‌ని ప‌లువురు భావిస్తున్నారు.
  9. అమెరికా అధ్యక్షుడు బైడెన్ వచ్చేవారం యూరఫ్ దేశాల పర్యటనకు వెళ్తనున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులపై నాటో నేతలతో పాటు ఈయూ దేశాధినేతలతో బైడెన్ ముఖాముఖి సమావేశంకానున్నారు. ఈ నెల 24న బ్రసెల్స్‌లో జరిగే భేటీలో బైడెన్ పాల్గొంటారని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. 30 దేశాల నేతలు ఈ భేటీకి హాజరుకానున్నారు.
  10. రష్యా ఆగకుండా దాడులు చేస్తుండటంతో- ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో 36 గంటల కర్ఫ్యూను ప్రకటించారు. అంటగేలో ఈనెల 17 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. మరోవైపు దేశవ్యాప్తంగా దాడులు జరగొచ్చని చెర్నివ్‌ పరిపాలన విభాగం హెచ్చరించడంతో జనం బంకర్లలోకి వెళ్లిపోయారు.
  11. ఉక్రెయిన్‌లో మార్షల్‌ చట్టాన్ని ఏప్రిల్‌ 24 వరకు పొడిగించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రతిపాదించారు.ఈ బిల్లును పార్లమెంటు ఆమోదించింది.మేరియుపొల్‌లో సురక్షిత నడవా ద్వారా 2వేల వాహనాల్లో పౌరులు తరలి వెళ్లగలిగారు.ఈ నగరంలోనే 150 మంది రష్యా సైనికుల్ని హతమార్చి, రెండు ట్యాంకుల్ని ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్‌ సైన్యం తెలిపింది.
  12. రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధ నేరస్తుడని అమెరికా ఆరోపించింది. ఆ మేరకు అమెరికా సెనేట్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రహమ్ ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టగా.. సభ్యులెవరూ దీనికి అభ్యంతరం వ్యక్తంచేయలేదు. అటు రిపబ్లికన్లు, ఇటు డెమోక్రాట్లు ఈ తీర్మానానికి మద్ధతు తెలిపి ఆమోదించారు.
  13. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మద్దతు ప్రకటించారు. అండాదండా ఇస్తామన్నారు. మరోవైపు ముడిచమురు, సహజవాయువు దిగుమతులకు సంబంధించి- రష్యాపై ఆధారపడటం తగ్గించుకోవాలని యూరోపియన్‌ దేశాలను బ్రిటన్‌ ప్రధాని కోరారు.
  14. రష్యాపై బ్రిటన్ మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధించింది. రష్యా లగ్జరీ గూడ్స్‌ ఎగుమతులు నిలిపేయడంతో పాటు ఆ దేశం నుంచి వచ్చే వోడ్కా వంటి ఉత్పత్తులపై టారిఫ్‌లను విధించింది. మరో 17 మందికి పైగా రష్యా రాజకీయ నేతలు, వారి బంధువుల ఆస్తులను జపాన్‌ స్తంభింపజేసింది.
  15. ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో తమపై ఆంక్షలు విధించిన అమెరికా, తదితర దేశాలపై రష్యా ప్రతీకార చర్యలకు దిగింది. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌, పలువురు ప్రభుత్వ కీలక అధికారులపై ఆంక్షలు విధించింది. అలాగే కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోపై నిషేధం విధించింది.
  16. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఎల‌న్‌మ‌స్క్ మ‌రో స‌వాల్ విసిరారు. త‌న‌తో పోరాడేందుకు పుతిన్ త‌న సొంత ఎలుగుబంటిని కూడా తెచ్చుకోవ‌చ్చున‌న్నారు.దీనిపై ర‌ష్యా స్పేస్ సంస్థ అధిప‌తి డిమిట్రీ రొగోజిన్ రియాక్టయ్యారు.నువ్వో చిన్న ద‌య్యానివి ముందు నా త‌మ్ముడితో గెలువు అని ఎల‌న్‌మ‌స్క్‌ను అని ఎద్దేవా చేశారు.
  17. డిమిట్రీ రొగోజిన్ వ్యాఖ్యల‌పై ఎల‌న్‌మ‌స్క్ ప్రతి స్పందించారు.ఎలుగుబంటిపై రైడ్ చేస్తున్న ఫొటో, దాని ప‌క్కనే తాను మంట‌లు రేపుతున్న ఫొటో జ‌త చేసి పోస్ట్ చేశారు. అలా త‌న‌తో పోరాటానికి పుతిన్ ఆయ‌న సొంత ఎలుగుబంటిని తెచ్చుకోవ‌చ్చన్న సంకేతాలిచ్చారు..ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింల్లో చక్కర్లు కొడుతుంది.
  18. ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలపై రష్యా సేనలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి..రష్యా బలగాలు చుట్టుముట్టిన ప్రాంతాల నుంచి సామాన్య పౌరుల తరలింపునకు 9 మానవతా కారిడార్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఉక్రెయిన్ ఉప ప్రధాని ఇరినా వెరెష్ చుక్. మరియుపోల్ నగరానికి సహాయ సామగ్రి చేరవేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.
  19. రష్యాకు పూర్తిస్థాయి యుద్ధం చేసేందుకు ఆ దేశం దగ్గర మరో 10 నుంచి 14 రోజులే ఆయుధ సంపత్తి ఉందని యూకే రక్షణశాఖ వర్గాలు పేర్కొన్నాయి. రష్యా సైనిక శక్తి తగ్గిపోయిందని, త్వరలో రష్యా కంటే ఉక్రెయిన్‌ పైచేయి సాధించొచ్చని అంచనా వేశాయి.
  20. రష్యా వనరులన్నీ కరిగిపోతున్నందున తమతో సంధి మినహా మరో మార్గం లేదని ఉక్రెయిన్‌ ధీమాగా ఉంది. ‘మే తర్వాత యుద్ధం చేయడానికి రష్యా దగ్గర ఏమీ మిగలదని శాంతి ఒప్పందం కుదుర్చుకుంటుంది..దీన్ని రష్యా కొట్టిపారేస్తోంది. త్వరలో లక్ష్యాన్ని చేరుకుంటామని అధ్యక్షుడు పుతిన్‌ వ్యక్తిగత భద్రతా ఇన్‌చార్జి అన్నారు.
  21. వనరుల కొరతతో రష్యా సేనలు దాడులను విరమించుకునే పరిస్థితి రానుందని యునైటెడ్‌ స్టేట్స్‌ ఆర్మీ యూరప్‌ మాజీ కమాండింగ్‌ జనరల్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ బెన్‌ హోగ్స్‌ ఓ మీడియా సంస్థకు తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా యుద్ధం ఆపేందుకు నాటోతో కలిసేది లేదంటూ రష్యాతో కంప్రమైజ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.
  22. ర‌ష్యా టీవీ ఛాన‌ల్‌కు చెందిన ఓ మ‌హిళా ఎడిట‌ర్‌..ఆ టీవీ న్యూస్ షోలో త‌న నిర‌స‌న గళం వినిపించారు.ఛాన‌ల్ 1 న్యూస్ ప్రోగ్రామ్‌లో యాంక‌ర్ వార్తలు చ‌దువుతుండగా ఆ షోలో యుద్ధం వ‌ద్దు అంటూ ప్లకార్డు ప్రద‌ర్శించారు ఆ మ‌హిళా ఎడిట‌ర్.. యుద్ధానికి వ్యతిరేకంగా ఆందోళ‌న చేప‌ట్టాల‌ని ర‌ష్యా ప్రజ‌ల్ని ఆమె కోరారు.
  23. ఉక్రెయిన్‌లో యుద్ధ వార్తల కవరేజీకి వచ్చిన ఫాక్స్‌ న్యూస్‌ కెమెరామెన్‌ ప్రమాదవశాత్తు మరణించారు.. కెమెరా మెన్‌ పియరీ ప్రయాణిస్తున్న వాహనం అగ్ని ప్రమాదానికి గురైందని ఫాక్స్‌ మీడియా ప్రకటించింది. మరో ఉద్యోగి బెంజమిన్‌ హాల్‌ ప్రమాదంలో గాయపడ్డనట్లు తెలిపారు.
  24. రష్యా చేస్తున్న దాడుల కారణంగా ఉక్రెయిన్‌లో ప్రతి నిమిషానికి ఒకరు చొప్పున పిల్లలు శరణార్థులుగా మారుతున్నారని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటిదాకా ఉక్రెయిన్లో 596 మంది సామాన్యపౌరులు చనిపోయారని తెలిపింది. ఇప్పటిదాకా 28 లక్షలమంది ఉక్రెయిన్‌ వాసులు- పోలాండ్‌లోకి వచ్చారని ఐక్యరాజ్యసమితి చెబుతోంది.
  25. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైనప్పటినుంచి పొటాషియమ్‌ అయోడైడ్‌ ట్యాబ్లెట్ల డిమాండ్‌ 100 రెట్లు పెరిగింది. ఉక్రెయిన్‌లోని అణు ప్లాంట్లపై దాడులు జరిగి, రేడియో ధార్మికత విడుదలైతే, దాన్ని అధిగమించేందుకు పొటాషియమ్‌ అయోడైడ్‌ మాత్రలు వాడతారు. రేడియో ధార్మికతను థైరాయిడ్‌ గ్రంథి, ఊపిరితిత్తులు పీల్చుకోకుండా ఈ మాత్రలు పనిచేస్తాయి. 
  26. రష్యాపై ఆర్థిక, సైనిక ఒత్తిడి పెంచాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కెనడాను కోరారు. తమ దేశానికి అండగా నిలవాలని ఆయన కోరారు. ఉక్రెయిన్‌పై ‘నో-ఫ్లై’ జోన్‌ను ప్రకటించాలని కోరారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడ్‌ను ఉద్దేశించి జెలెన్‌స్కీ ఆ మేరకు వీడియో ద్వారా ప్రసంగించారు.
  27. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి వ్యతిరేకంగా బెర్లిన్‌లో వేలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. ఉక్రెయిన్‌ను పుతిన్‌ మింగేస్తున్న చిత్రాలతో ప్రదర్శన నిర్వహించారు. రష్యా తీరు ప్రపంచ శాంతికి విఘాతం కలిగించేలా ఉందని నినాదాలు చేశారు బెర్లిన్‌ పౌరులు.
  28. ఉక్రెయిన్‌పై యుద్ధం పట్ల రష్యాలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.మాస్కోలో నిరసనకారులపై ఉక్కుపాదం మోపుతున్నారు అక్కడి పోలీసులు. ఆందోళనల పేరుతో రోడ్ల పైకి వచ్చిన వారిని అరెస్టు చేసి, నిర్బంధిస్తున్నారు. ఈ విషయంలో జర్నలిస్టులపై ఆంక్షలు పెట్టారు పుతిన్.
  29. ఉక్రెయిన్ పై రష్యా దాడులపై సొంత దేశంలోనే జనం వ్యతిరేకిస్తున్నారు.ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించినా పట్టించుకోకుండా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. రష్యాలోని కొన్ని పట్టణాల్లోప్రజలు స్వచ్చందంగా రోడ్లపైకి వచ్చి ర్యాలీలు నిర్వహించారు. యుద్ధం ఆపాలంటూ నినాదాలు చేశారు. 
  30. ఉక్రెయిన్‌ నుంచి వచ్చేసిన భారతీయ మెడికల్‌ విద్యార్థులకు ఉపశమనం కలిగింది. ఇవానో-ఫ్రాంకివ్స్‌, విన్నిత్సియా, బోగోమోలెట్స్‌ నేషనల్‌ మెడికల్‌ వర్సిటీలతో పాటు పశ్చిమ ఉక్రెయిన్‌లోని పలు వర్సిటీలు విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభించాయి. అధ్యాపకులు ఇండ్ల నుంచే బోధిస్తున్నారు.

Also Read..

Jet Fuel Price Hiked: విమాన ప్రయాణం మరింత ప్రియం.. జెట్‌ ఇంధన ధరలు పెంపు..!

Air Conditioners: కొత్త ACని కొనాలని భావిస్తున్నారా..? ఈ విషయాలను తెలుసుకోండి..!