Modi Brics: పహల్గామ్ ఘటన మానవాళిపై జరిగిన దాడి… బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ వెల్లడి
ప్రధాని నరేంద్ర బ్రెజిల్లో పర్యటిస్తున్నారు. నాలుగు రోజుల పర్యటనలో ఆయన 17వ బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యారు. బ్రెజిల్తో వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం చర్చలు జరిపారు. వాణిజ్యం, రక్షణ, ఇంధనం, స్పేస్, టెక్నాలజీ, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో రెండుదేశాల మధ్య సహృద్భావ వాతవరణం నెలకొనాలని ఇరు దేశాదినేతలు...

ప్రధాని నరేంద్ర బ్రెజిల్లో పర్యటిస్తున్నారు. నాలుగు రోజుల పర్యటనలో ఆయన 17వ బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యారు. బ్రెజిల్తో వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం చర్చలు జరిపారు. వాణిజ్యం, రక్షణ, ఇంధనం, స్పేస్, టెక్నాలజీ, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో రెండుదేశాల మధ్య సహృద్భావ వాతవరణం నెలకొనాలని ఇరు దేశాదినేతలు చర్చించారు. ఆదివారం బ్రెజిల్లోని రియో డి జనైరో నగరంలో జరిగిన 17వ బ్రిక్స్ కూటమి సదస్సులో ప్రధాని మోదీ కీలకోపన్యాసం చేశారు. ఈ సదస్సుకు కీలక నేతలైన రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ హాజరు కాలేదు.
అభివృద్ధి చెందిన దేశాలు అనుసరిస్తున్న రెండు నాలుకల ధోరణి కారణంగా గ్లోబల్ సౌత్ దేశాలు అభివృద్ధి, వనరుల పంపిణీ, భద్రత వంటి విషయాల్లో వివక్షకు గురవుతున్నాయని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. 20వ శతాబ్దంలో ఏర్పాటయిన ప్రపంచస్థాయి సంస్థల్లో మూడింట రెండో వంతు మానవ జాతికి తగిన ప్రాతినిధ్యమే లేకుండా పోతోందని ప్రధాని ఆరోపించారు.
ఉగ్రవాదం పహల్గామ్ దాడి అంశాలనూ మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఉగ్రవాదం ప్రపంచమానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ అని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడిని నొక్కి చెబుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉగ్రవాద సమస్యను ప్రస్తావించారు. “మానవాళి ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాళ్లలో ఉగ్రవాదం ఒకటి. ఇటీవల, పహల్గామ్లో భారతదేశం అమానవీయమైన, పిరికితనంతో కూడిన ఉగ్రవాద దాడిని ఎదుర్కొంది. ఇది మొత్తం మానవాళిపై జరిగిన దాడి” అని ప్రధాని మోదీ అన్నారు.
ఉగ్రవాదంపై పోరుకు ప్రపంచ దేశాలు ఒక్కతాటిపై నిలవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. శాంతి, సోదరభావం పట్ల భారతదేశం నిబద్ధతను ప్రధాని మోదీ గట్టిగా పునరుద్ఘాటించారు. ఉగ్రవాదంపై పోరు విషయంలో “ద్వంద్వ ప్రమాణాలకు చోటు లేదన్నారు ప్రధాని మోదీ. ఏదైనా దేశం ఉగ్రవాదానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మద్దతు ఇస్తే, అది దానికి మూల్యం చెల్లించుకోవాలి. ఉగ్రవాదులపై ఆంక్షలు విధించడంలో ఎటువంటి సంకోచం ఉండకూడదు. ఉగ్రవాద బాధితులను, దాని మద్దతుదారులను ఒకే స్థాయిలో తూకం వేయలేము” అని మోదీ అన్నారు.
వ్యక్తిగత లేదా రాజకీయ లాభం కోసం అయినా, ఉగ్రవాదానికి నిశ్శబ్ద ఆమోదం లేదా మద్దతును సహించరాదని, అన్ని దేశాలు నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. మహాత్మా గాంధీ, గౌతమ బుద్ధుని బోధనల నుంచి ప్రేరణ పొంది, భారతదేశం శాంతి మార్గాన్ని కొనసాగిస్తుందని ఆయన అన్నారు. “ఎంత క్లిష్ట పరిస్థితులు ఎదురైనా, మానవాళి సంక్షేమానికి శాంతి ఉత్తమ మార్గం” అని ప్రధాని వ్యాఖ్యానించారు.
బ్రిక్స్ దేశాలు పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఆ ప్రకటన అన్ని ఉగ్రవాద చర్యలను “నేరపూరితమైనవి, అన్యాయమైనవి” అని ప్రకటించింది. ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో కూటమి ఏకీకృత నిబద్ధతను పునరుద్ఘాటించింది. “22 ఏప్రిల్ 2025న జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము, ఈ దాడిలో 26 మంది మరణించారు, అనేక మంది గాయపడ్డారు” అని బ్రిక్స్ ప్రకటనలో పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ద్వంద్వ ప్రమాణాలను తిరస్కరించాలని మేము కోరుతున్నాము.” అని బ్రిక్స్ దేశాలు ప్రకటనలో వెల్లడించాయి.