AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BM Container Depot: ప్రముఖ ఓడరేవు నగరంలో భారీ పేలుడు, 35 మంది మృతి, 450 మందికి పైగా క్షతగాత్రులు..

పేలుడు తర్వాత అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్టు అధికారులు తెలిపారు. కెమికల్స్‌ వల్లే భారీగా మంటలు వ్యాపించినట్టు భావిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.

BM Container Depot: ప్రముఖ ఓడరేవు నగరంలో భారీ పేలుడు, 35 మంది మృతి, 450 మందికి పైగా క్షతగాత్రులు..
Bangladesh
Jyothi Gadda
|

Updated on: Jun 05, 2022 | 1:48 PM

Share

బంగ్లాదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంలో 35మంది సజీవదహనమైనట్టు తెలిసింది. మరో 450మంది వరకు గాయపడ్డారు. బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో సీతకుంట సమీపంలోని ఓ ప్రైవేట్‌ కంటైనర్‌ డిపోలో ఆదివారం నాడు తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. పేలుడు తర్వాత అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్టు అధికారులు తెలిపారు. కెమికల్స్‌ వల్లే భారీగా మంటలు వ్యాపించినట్టు భావిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

బంగ్లాదేశ్‌లోని ప్రముఖ ఓడరేవు నగరమైన చిట్టగాంగ్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీతకుంట వద్ద ఆదివారం తెల్లవారుజామున కంటైనర్‌ సదుపాయంలో మంటలు చెలరేగాయి. శనివారం రాత్రి 9 గంటలకు మంటలు చెలరేగగా, అర్ధరాత్రి సమయంలో పేలుడు సంభవించిందని పోలీసు అధికారి తెలిపారు. పేలుడు అనంతరం మంటలు వేగంగా వ్యాపించాయి. మంటలు విస్తరించటంతో డిపోలో భారీ పేలుడు సంభవించింది. రసాయనాలు కలిగిన కంటైనర్లు పేలడంతో తీవ్రత పెరిగిందని అధికారులు చెబుతున్నారు. భారీ శబ్ధాలతో కంటైనర్లు వరుసగా పేలిపోయినట్టు తెలిసింది. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. 40 మంది ఫైర్ సిబ్బంది, 10 మంది పోలీసులు మంటలను అదుపు చేసే క్రమంలో గాయపడినట్లు చిట్టగాంగ్ ఉన్నతాధికారులు చెప్పారు. ఐదుగురు ఫైర్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని సమాచారం.

భారీ పేలుడు ధాటికి పరిసర ప్రాంతాలు వణికిపోయాయని, సమీపంలోని ఇళ్ల కిటికీల అద్దాలు పగిలిపోయాయని స్థానికులు భయపడుతూ చెబుతున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చిట్టగాంగ్ సివిల్ సర్జన్ మహ్మద్ ఇలియాస్ హుస్సేన్ తెలిపారు. గాయపడిన వారిలో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కూడా ఉన్నారని తెలిపారు. చిట్టగాంగ్ ఫైర్ సర్వీస్, సివిల్ డిఫెన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ Md ఫరూక్ హొస్సేన్ సిక్దర్ మాట్లాడుతూ: “సుమారు 19 అగ్నిమాపక యూనిట్లు మంటలను ఆర్పేందుకు పని చేస్తున్నట్టు చెప్పారు. ఆరు అంబులెన్స్‌లు కూడా అందుబాటులో ఉన్నట్టు చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఇకపోతే, కంటైనర్ డిపో మే 2011 నుండి పనిచేస్తోంది. ప్రమాదానికి గల కారణం ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్ కంటైనర్ నుండి ఉద్భవించిందని అందుకే మంటలు ఇతర కంటైనర్లకు త్వరగా వ్యాపించాయని అనుమానిస్తున్నట్టు చెప్పారు అగ్నిమాపక శాఖ అధికారులు. ఢాకాకు ఆగ్నేయంగా 242 కి.మీ దూరంలో ఈ ఘటన చోటు చేసుకొంది.