ఉపాధి హామి పనిలో భాగంగా మట్టి తవ్వుతుండగా ఏం బయటపడ్డాయో తెలుసా..?
వేల ఏళ్ల క్రితం మనిషి ఎలా జీవించాడు..? ఎక్కడ నివసించాడు..? వేట ఎలా సాగింది..? ప్రకృతిని ఎలా చిత్రించాడు..? అనే విషయాలను తెలుసుకోవడానికి మనం చరిత్ర పుస్తకాలను తిరగేస్తుంటాం. కానీ.. తెలంగాణ నేలపై వెలుగు చూస్తున్న పురాతన ఆనవాళ్లు.. చరిత్రను మన కళ్ల ముందే నిలబెడుతున్నాయి. జిల్లాలో బయట పడుతున్న కొండ గుహలు, రాతి పనిముట్లు, వర్ణచిత్రాలు, పురాతన ఆవాసాల ఆనవాళ్లు ఆసక్తి రేపుతున్నాయి.

యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాల నగరం విష్ణుకుండినుల తొలి రాజధానిగా ప్రసిద్ధి చెందింది. 10 వేల ఏళ్ల నాటి పురాతన మానవ జీవనానికి సంబంధించిన ఆవాసాల ఆనవాళ్లు, కొండ గుహలు, రాతి పనిముట్లు, వర్ణచిత్రాలు వెలుగు చూశాయి. ఇటీవల మట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరిశోధకులు రత్నాకర్ రెడ్డి, వినయ్ గోలి, అభిషేక్, సముద్రాల రాజు, సముద్రాల శ్రీనివాస్ బృందం పరిశోధనలు చేశారు. ఇంద్రపాల నగరంలోని శంకరం గుట్ట దిగువన, ఉపరితల భాగాల్లో క్రీ.పూ 10 వేల ఏళ్ల నాటి ఆది మానవుల గుహలతోపాటు రాతి పనిముట్లు, రాతి నిర్మాణ అవశేషాలు, ఇప్పటికీ ఎవరికీ తెలియని అరుదైన వర్ణ చిత్రాల ఆనవాళ్లు కనిపించాయి. ప్రాచీన మానవులు తమ చుట్టూ ఉన్న జీవన విధానం, వేట, జంతువులు తదితర అంశాలను రాతిపై చిత్రాల రూపంలో నమోదు చేసి ఉండొచ్చనే ఆసక్తి కలుగుతోంది. ముందస్తుగా డంగు సున్నం పొర అద్ది, దానిపై ఎరుపు చిత్రాలు వేశారు. ఎండ, వాన తగిలే చోట ఈ చిత్రాలు నిలిచి ఉండడం అసాధారణమని పరిశోధకులు చెబుతున్నారు.
ఉపాధి హామీ పనిలో భాగంగా తవ్విన పాటిగడ్డ మట్టిలో సూక్ష్మరాతి పనిముట్లు, నవీన శిలాయుగం నాటి రాతి గొడ్డళ్లు, బృహత్ శిలా యుగం నాటి రోళ్లు, మట్టి పాత్రల ముక్కలు లభించాయి. మూడు అడుగుల లోతు వరకు జరిపిన తవ్వకాల్లో నలుపు, ఎరుపు, బూడిద రంగు మృణ్మయ పాత్రలు లభించాయి. అప్పటి మనిషికి రాతి ఆయుధమే కాదు.. కళా భావన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కో రాయి.. ఒక్కో గుహ.. ఒక్కో వర్ణచిత్రం.. వేల ఏళ్ల చరిత్రను చెప్పే సాక్ష్యంగా మారే అవకాశం ఉంది. శంకరం గుట్ట దిగువన ఉన్న పంచేశ్వరాలయం రుద్రమదేవి కాలంలో నిర్మించబడింది. కనుక ఈ చిత్రాలూ కాకతీయుల కాలం నాటివై ఉంటాయని చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు. శంకరం గుట్టకు దక్షిణ దిశలో గల జైన తీర్థంకరుల శిల్పాలు, వాటికెదురుగా గల శిలపై మరో శాసనం బయట పడింది. స్థానికంగా ‘ఇంద్రపాల నగరం’ పేరుతో ప్రచారంలో ఉన్న ఈ ప్రాంతంలో మరిన్ని పురావస్తు ఆధారాలు బయటపడితే.. తెలంగాణ ప్రాచీన చరిత్రకు మరో ముఖ్యమైన అధ్యాయం జతయ్యే అవకాశం ఉంది.
పురాతన కాలం నాటి చరిత్ర కీలక ఆధారాలు ధ్వంసమవుతున్నాయని పరిశోధకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురావస్తు శాఖ తక్షణమే స్పందించి ఇంద్రపాలనగరంలో అధికారిక తవ్వకాలు జరపాలని, శంకరం గుట్టపై రెండు ముక్కలుగా ఉన్న శాసనాన్ని వేదికపై నిలబెట్టాలని డిమాండ్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
