Travel: ఆ దేశానికి వెళ్లేవారికి విమాన టికెట్లు ఉచితం.. పంపిణీ ఎప్పటినుంచి అంటే..
ఏవైనా ఇతర దేశాలకు వెళ్లాలంటే విమానంలోనే వెళ్లాల్సిన పరిస్థితి. విమాన టికెట్లు కొని ఇతర దేశాలకు వెళ్లడం చాలామందికి భారంగా ఉంటుంది. ఉన్నతవర్గాలకు చెందిన వారు, ధనవంతులు మాత్రమే విమానాల్లో షికార్లు చేసి..

ఏవైనా ఇతర దేశాలకు వెళ్లాలంటే విమానంలోనే వెళ్లాల్సిన పరిస్థితి. విమాన టికెట్లు కొని ఇతర దేశాలకు వెళ్లడం చాలామందికి భారంగా ఉంటుంది. ఉన్నతవర్గాలకు చెందిన వారు, ధనవంతులు మాత్రమే విమానాల్లో షికార్లు చేసి రాగలరు. మరోవైపు కరోనా తర్వాత టూర్లు వెళ్లడం చాలా వరకు తగ్గింది. గతంలో పర్యాటక ప్రాంతాలకు ఆరునెలలకో, ఏడాదికి ఒకసారైనా వెళ్లేవారు కూడా కరోనా తర్వాత టూర్లు వెళ్లడమే మానేశారు. దీంతో ప్రపంచంలో ప్రసిద్ధిగల పర్యాటక ప్రాంతాలు సైతం సందర్శకులు లేక వెలవెలబోతున్నాయి. దీంతో తమ దేశాలకు పర్యాటకులను ఆకర్షించేందుకు ఎన్నో ఆఫర్లను ఇస్తున్నారు. ఇటీవల ఇటలీలోని ఫ్రియులి వెనిజియా గియులియా ప్రాంతానికి చెందిన అధికారులు కూడా.. తమ ప్రాంతానికి పర్యాటకులను ఆకర్షించేందుకు అనేక ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. అతి తక్కువ మంది పర్యాటకులు సందర్శించిన ప్రాంతంగా ఇటలీలోని ఫ్రియులి వెనిజియా గియులియా నగరం నిలిచింది. దీంతో అక్కడి ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రబావితం కావడంతో పరిస్థితులను చక్కదిద్దేందుకు అక్కడి యంత్రాంగం పర్యాటకులకు అనేక ఆఫర్లను ప్రకటించింది. ఫ్రియులి వెనిజియా గియులియా నుంచి వెన్నిస్ మినహా.. ఇటలీలోని ఏ ప్రాంతానికైనా ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును కల్పించింది. రీజనల్, ఇంటర్సిటీ లైన్స్ నుంచి హై స్పీడ్ లైన్స్ వరకు..ఏ ట్రైన్లోనైనా ఉచితంగా ప్రయాణించవచ్చు అని పర్యాటకులకు ఆఫర్లు ప్రకటించింది. సందర్శకుల రైళ్ల ఖర్చులు తామే భరిస్తామని అధికారులు వెల్లడించారు. ఇప్పుడు ఇదే కోవలోకి వచ్చింది మరో దేశం హాంకాంగ్.
తమ దేశంలో పర్యాటక రంగం ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడానికి, పర్యాటకులను ఆకర్షించడానికి 5,00,000 విమాన టికెట్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు హాంకాంగ్ ప్రకటించింది. అలాగే కరోనా తర్వాత హాంకాంగ్ కు వచ్చే పర్యాటకులకు కఠిన నిబంధనలు అమలుచేస్తుండగా.. తాజాగా ఆ నిబంధనలను కూడా సడలించింది. కోవిడ్ తర్వాత హాకాంగ్ లో పర్యాటకం పూర్తిగా దెబ్బతింది. దీంతో తిరిగి పర్యాటక రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు హాంకాంగ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ దేశానికి వచ్చే పర్యాటకులకు 5,00,000 విమాన టికెట్లు ఉచితంగా ఇవ్వబోతున్నట్లు వెల్లడించింది. ఈ టిక్కెట్లను వచ్చే ఏడాది పంపిణీ చేస్తామని తెలిపింది ఈ ఉచిత టికెట్ల ధర సుమారు $ 254.8 మిలియన్లు ఉండొచ్చని పేర్కొంది. విమానయాన పరిశ్రమ కు సహాయం అందిచడానికి ఉచిత విమాన టిక్కెట్ల పథకానికి శ్రీకారం చుట్టారు.
ఉచిత విమాన టికెట్ల నిర్ణయంతో హాంకాంగ్ పర్యాటక రంగం ఆదాయాన్ని అర్జించడంతో పాటు పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని హాంకాంగ్ ఆశాభావంలో ఉంది. గతంలో కోవిడ్ నిబంధనల కారణంగా హాంకాంగ్ కు వచ్చేవారు తమ సొంత ఖర్చులతో హోటల్ గదిలో 21 రోజుల క్వారంటైన్ గడపాల్సి ఉండేది. ఆ తర్వాత ఈ వ్యవధిని 7 నుంచి 3 రోజులకు తగ్గించారు. తాజాగా సెప్టెంబర్ 26వ తేదీన ఈ విధానాన్ని కూడా రద్దు చేశారు. అయితే హాంకాంగ్ కు వచ్చే పర్యాటకులు విమాన ప్రయాణానికి ముందు వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్, కోవిడ్ నెగిటివ్ రిపోర్టు సమర్పించాలని పేర్కొంది.




మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..



