రీల్స్ పిచ్చితో లోకల్ రైలుపై రాళ్ల దాడి నాటకం.. సీన్ కట్చేస్తే రియల్ పోలీసుల ఎంట్రీ!
ప్రస్తుతం ప్రజల్లో రీల్స్ పిచ్చి పీక్స్కి చేరింది.. ఈ మోజులో పడిన చాలా మంది ప్రాణాలకు తెగించి విచిత్ర స్టంట్స్ చేస్తున్నారు. మరికొందరు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగిస్తున్నారు. సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం యువత ఏ స్థాయికి దిగజారుతుందో చెప్పడానికి మరో ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం ముంబై లోకల్ రైలుపైకి రాళ్లు రువ్వుతున్నట్లు నాటకమాడి ఒక యువకుడు చివరకు పోలీసుల చేతికి చిక్కి బోనులో నిలబడ్డాడు. చివరకు ఏం జరిగింది..?

సోషల్ మీడియాలో వైరల్ కావడానికి లేదా వ్యూస్, లైకుల పిచ్చితో కొందరు చేసే పనులు ప్రయాణికుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. తాజాగా నవీ ముంబై పరిధిలో లోకల్ రైలుపై రాళ్లు విసురుతూ, ప్రయాణికుల పట్ల అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించిన ఒక యువకుడి ఉదంతం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.
ఈ విజువల్స్ నెట్టింట వైరల్ కావడంతో థానే రైల్వే పోలీసులు, సన్పాడా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వెంటనే స్పందించారు. సదరు యువకుడిని దిఘా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించి, రైల్వే చట్టం కింద కేసు నమోదు చేశారు. రైళ్లపై రాళ్లు రువ్వడం తీవ్రమైన నేరమని, దీనివల్ల ప్రయాణికులకు ప్రాణాపాయం కలిగే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేయడంతో భయపడిన ఆ యువకుడు వెంటనే సోషల్ మీడియా వేదికగా ఒక క్షమాపణ వీడియోను షేర్ చేశాడు. రెండు చేతులు జోడించి వేడుకుంటూ..నన్ను క్షమించండి. నేను నిజంగా రైలుపైకి రాయి విసరలేదు, పక్కకు విసిరాను. కేవలం రీల్స్ కోసమే అలా విసిరినట్లు నటించాను. ఇకపై జీవితంలో ఇలాంటి తప్పు మళ్లీ చేయను అంటూ వేడుకున్నాడు.
వీడియో ఇక్కడ చూడండి..
🚨Shocking Visuals: Viral Video Shows Youth Pelting Stones at Moving Train in Digha Making Obscene Gestures
NAVI MUMBAI: Footage circulating on social media depicts an individual throwing stones at a moving local train and performing inappropriate gestures in the Digha area. pic.twitter.com/Empo0AxfOK
— Naam Mein Kya Hai (@MithilaWaaaaala) August 18, 2026
పోలీసులు, అధికారుల హెచ్చరిక:
రైల్వే ఆస్తులకు నష్టం కలిగించడం, రైళ్లపై రాళ్లు విసరడం లేదా ట్రాక్ల వద్ద ప్రమాదకరంగా ప్రవర్తించడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. రీల్స్ లేదా సోషల్ మీడియా ప్రచారం కోసం ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టే వారిపై ఊపేక్షించేది లేదని, కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.




