Telangana 10th Exams 2026: అధికారుల నిర్లక్ష్యం.. పదో తరగతి పరీక్షలు రాసేందుకు ఈ దివ్యాంగురాలి కష్టాలు చూశారా? వీడియో
రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 14 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు విద్యార్ధులు ఎంతో ఉత్సాహంగా హాజరవుతున్నారు. అయితే ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంకి చెందిన దివ్యాంగురాలు రేణుకకు మాత్రం పరీక్ష కేంద్రానికి చేరుకోవడమే అసలైన పరీక్షగా మారింది. అసలు సంగతి ఏమంటే..

కూసుమంచి, మార్చి 16: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం గ్రామానికి చెందిన జానయ్య, శారద దంపతుల కుమార్తె రేణుక దివ్యాంగురాలు. రెండున్నర అడుగుల ఎత్తు. కిలో బరువైనా ఎత్తలేని శారీరక బలహీనత. కనీసం వంద అడుగులైనా వేయలేని దైన్య స్థితి అమెది. అయినప్పటికీ చదువుపై ఇష్టంతో కష్టాలను భరిస్తూనే పదో తరగతికి వార్షిక పరీక్షకు హాజరవుతుంది. రేణుక తండ్రి కౌలు రైతు కాగా ఆమె తల్లి వ్యవసాయ కూలీ. కూసుమంచి హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న రేణుకను తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు నిత్యం పాఠశాలకు తీసుకొస్తున్నారు.
వైకల్యం బాధిస్తున్నా విషయ పరిజ్ఞానాన్ని పెంచుకున్న ఆమె ఆత్మవిశ్వాసంతో పది పరీక్షలకు హాజరవుతుంది. పరీక్ష కేంద్రాల్లో వీరికి నేల అంతస్తులో సీటింగ్ ఏర్పాటు చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ అధికారులు ఆ విషయాన్ని విస్మరించారు. రేణుక తల్లి పై అంతస్తులోని పరీక్ష హాలులోకి ఎత్తుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంగ వైకల్యం దేనికీ అడ్డురాకూడదని, మరుగుజ్జుత్వం ఒక వ్యాధి కాదని రేణుక పట్టుదల నిరూపిస్తుంది. సరైన మద్దతుతో పాటు అవకాశాలు కల్పిస్తే తాను సాధారణ జీవితాన్ని గడపగలనని రేణుక రుజువు చేస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




