AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించినది.. మా అభ్యంతరాలను పట్టించుకోండి.. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ ఘాటు లేఖ!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన లేఖ రాశారు. ఈ లేఖ రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. నియోజకవర్గాల పునర్విభజన, లోక్‌సభ స్థానాల పెంపు అంశాలపై దక్షిణాది రాష్ట్రాల గళాన్ని ఆయన బలంగా వినిపించారు. దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తును ప్రభావితం చేసే ఈ అంశంపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించినది.. మా అభ్యంతరాలను పట్టించుకోండి.. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ ఘాటు లేఖ!
Cm Revanth Reddy Writes Letter To Pm Modi
Prabhakar M
| Edited By: |

Updated on: Apr 14, 2026 | 7:47 PM

Share

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన లేఖ రాశారు. ఈ లేఖ రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. నియోజకవర్గాల పునర్విభజన, లోక్‌సభ స్థానాల పెంపు అంశాలపై దక్షిణాది రాష్ట్రాల గళాన్ని ఆయన బలంగా వినిపించారు. దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తును ప్రభావితం చేసే ఈ అంశంపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

లోక్‌సభ స్థానాలను జనాభా ప్రాతిపదికన పెంచితే, జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా బలహీనపడతాయని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న రాష్ట్రాలకు ఇది ఒక రకమైన శిక్షగా మారుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి వంటి దిగ్గజ నేతలు జాతీయ సమగ్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాలను వాయిదా వేశారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

మహిళా రిజర్వేషన్, డిలిమిటేషన్, సీట్ల పెంపు అనేవి మూడు భిన్నమైన అంశాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వీటిని కలిపి చర్చించడం వల్ల ప్రజల్లో గందరగోళం ఏర్పడుతోందని అభిప్రాయపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు సీఎం రేవంత్. ప్రస్తుతం ఉన్న 543 సీట్లలోనే 33 శాతం రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, డిలిమిటేషన్ బిల్లుపై రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం నియోజకవర్గాల సరిహద్దులను మార్చే ప్రక్రియకు తమ అభ్యంతరం లేదని, కానీ సీట్ల పెంపు విషయంలోనే అసలు చిక్కు ఉందని పేర్కొన్నారు.

ఆర్థికంగా దేశానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు కేంద్ర నిధుల పంపిణీలో ఇప్పటికే వివక్ష ఎదురవుతోందని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ వాటా వెళ్తుండగా, దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ అందుతోందని ఉదాహరణలతో వివరించారు. ఇప్పుడు రాజకీయంగా కూడా ప్రాతినిధ్యం తగ్గితే, దేశ ఫెడరల్ వ్యవస్థ సమతుల్యత దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చిక్కుముడిని విప్పడానికి ముఖ్యమంత్రి ఒక సృజనాత్మక పరిష్కారాన్ని సూచించారు. అదే ‘హైబ్రిడ్ మోడల్’. కొత్తగా పెంచే సీట్లలో సగభాగాన్ని జనాభా ప్రాతిపదికన కేటాయించాలన్నారు. మిగిలిన సగభాగాన్ని రాష్ట్రాల ఆర్థిక భాగస్వామ్యం, జీడీపీ వాటా, అభివృద్ధి ప్రమాణాల ఆధారంగా కేటాయించాలని సూచించారు. ఇలా చేయడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతున్న రాష్ట్రాలకు తగిన గుర్తింపు లభిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు.

“భిన్నత్వంలో ఏకత్వమే భారత బలం. జనాభా నియంత్రణలో విజయం సాధించిన రాష్ట్రాలను గౌరవించడం దేశ బాధ్యత. స్వామి వివేకానంద చెప్పినట్లుగా, కొత్త మార్గాలను అన్వేషించినప్పుడే అందరికీ న్యాయం జరుగుతుంది.” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

ఇదిలావుంటే, రేవంత్ రెడ్డి లేఖ కేవలం ఒక రాజకీయ లేఖ మాత్రమే కాదు, ఇది దక్షిణాది రాష్ట్రాల ఉనికికి సంబంధించిన ప్రశ్న. అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్రాలతో విస్తృత చర్చలు జరిపి, ఏకాభిప్రాయం సాధించిన తర్వాతే కేంద్రం ముందడుగు వేయాలని ఆయన కోరారు. ఈ లేఖ ఇప్పుడు జాతీయ స్థాయిలో డిలిమిటేషన్ అంశంపై కొత్త చర్చకు తెరలేపింది. ఇక ప్రధానమంత్రితో పాటు దక్షిణాది ముఖ్యమంత్రులకు సైతం సీఎం రేవంత్ రెడ్డి లేఖలు రాశారు. దక్షిణాది రాష్ట్రాల ఉనికి ప్రమాదంలో పడబోతుందంటూ.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. నియోజవర్గాల పునర్విభజనపై కలిసి పోరాడుదామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాసిన లేఖ CM Revanth Open Letter to Hon’ble PM MODI

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us