భార్యకు అశ్లీల ఫొటోలు పంపిన గుర్తుతెలియని వ్యక్తి.. టెక్నాలజీతోనే దెబ్బకొట్టిన భర్త. ఏం చేశాడంటే..
ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగిన ఈ రోజుల్లో నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా మహిళలను వేధించే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. సోషల్ మీడియా సైట్స్ను ఉపయోగించుకొని ఆడవారిని వేధిస్తున్నారు. దీంతో చాలా మంది మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని ఎవరికీ చెప్పుకోలేక తమలో తాము కుంగిపోతున్నారు...

ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగిన ఈ రోజుల్లో నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా మహిళలను వేధించే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. సోషల్ మీడియా సైట్స్ను ఉపయోగించుకొని ఆడవారిని వేధిస్తున్నారు. దీంతో చాలా మంది మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని ఎవరికీ చెప్పుకోలేక తమలో తాము కుంగిపోతున్నారు. తాజాగా తన భార్యను వేధించిన ఓ అపరిచితుడికి తగిన బుద్ధి చెప్పాడు ఓ భర్త. ఇందుకోసం అతను ఎంచుకున్న మార్గం ఔరా అనిపిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేటకు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి భార్యకు వాట్సాప్లో అశ్లీల ఫొటోలను పంపాడు ఓ ప్రబుద్ధుడు. దీంతో ఆమె ఆ విషయాన్ని భర్తతో పంచుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త, ఆ అపరిచితుడిని ఎలాగైనా పట్టుకోవాలని డిసైడ్ అయ్యాడు. అనుకున్నదే తడువుగా గూగుల్ ప్లేస్టోర్ ఓ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాడు. ఆ యాప్ సహాయంతో సదరు వ్యక్తి ఫోన్ నెంబర్ను ఎవరెవరు ఎన్ని రకాలు సేవ్ చేసుకున్నారో గుర్తించాడు. టెక్నాలజీ సహాయంతో సదరు అపరిచితుడు మెదక్ సమీపంలో ఉన్న ఓ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించాడు.
వెంటనే స్నేహితుల సహాయంతో ఆ గ్రామానికి వెళ్లాడు. సోషల్ మీడియా సైట్స్ నుంచి సేకరించిన ఆ అగంతకుడి ఫొటోలను గ్రామస్తులకు చూపించి అతడి బంధువు ఫోన్ నెంబర్ తెలుసుకున్నాడు. అప్పు తీసుకొని ఇవ్వడం లేదని, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నామని హెచ్చరించాడు. దీంతో బంధువు తమ వాడు మంచోడని.. అతన్ని వెంట పెట్టుకొని మేమే పోలీస్ స్టేషన్ వస్తున్నట్లు ఫోన్లో తెలిపాడు. తీరా పోలీస్ స్టేషన్కు రాగానే అప్పటికే అన్ని ఆధారాలతో సిద్ధంగా ఉన్న బాధితురాలి భర్త పోలీసులకు వాటిని చూపించి కంప్లైట్ చేశాడు. దీంతో ఆధారాలు పరిశీలించి, అతడిపై కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
