Jogulamba Gadwal: గద్వాల జిల్లాలో కొత్త అవతారపురుషుడు.. క్యూ కట్టిన భక్తులు.. కట్ చేస్తే..
జనాలకు లాజిక్కులు అక్కర్లేదు. మ్యాజిక్కులు చేస్తే చాలు ఇట్టే నమ్మేస్తారు. కానీ ఈ అవతారపురుషుడు ఏ మ్యాజిక్ చేయకుండానే.. కేవలం మాటలతో జనాల్ని మాయచేశాడు.

జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ అవతారపురుషుడు ప్రత్యక్షమైయ్యాడు. సాక్షాత్తు కళియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడు.. శ్రీమహావిష్ణువు అవతారంలో ప్రజలందరికీ దర్శనమిస్తున్నాడు. నేనే దేవుణ్ణి.. మీ కష్టాలన్ని కడతేరుస్తా అంటూ ప్రజలకు భరోసానిస్తున్నాడు. భక్తుల కోర్కెలు తీర్చి.. కష్టాలను తొలగించే కలియుగ దైవమే ఇలపైకి.. అదీ మనిషి రూపంలో వస్తే ఇంకేమైనా ఉందా..? ఆ అవతార పురుషుడిని దర్శించుకునేందుకు భక్తులు ఎగబడ్డారు. ఇంకేముంది స్థానికంగా ఉన్న ప్రజలంతా ఆ అవతార పురుషుడి దర్శనానికి బారులు తీరారు.
తమిళనాడుకు చెందిన సురేష్ అనే వ్యక్తికి కలలో ప్రత్యక్షమైన దేవుడు.. శ్రీకృష్ణుడువి నీవే, విష్ణుమూర్తివి నీవే అని ఉపదేశం చేశాడట. తెలంగాణకు వెళ్లి భక్తుల పూజలందుకోమని కూడా చెప్పాడట. ఇక ఆ కలను నిజం చేయడానికి తమిళనాడు నుంచి తెలంగాణకు వచ్చిన సురేష్ అచ్చం విష్ణుమూర్తి అవతారంలో శేషతల్పంపై శయనిస్తున్నట్టుగా జోగులాంబ గద్వాల జిల్లా కేటి దొడ్డి మండలంలొ జనానికి దర్శనమిచ్చాడు.
తమిళనాడు స్వామి సురేష్కు లక్కీగా ఇద్దరు భార్యలుండడంతో.. వారితో పాదసేవ చేయించుకుంటూ తానే వెంకటేశ్వరుడిని అన్నట్టు సీన్ క్రియేట్ చేశాడు. తనకు ఈ ప్రాంతంలో ఉండడానికి కొంత స్థలం కావాలని కోరిన స్వామిజీకి కేటిదొడ్టి మండలం పాగుంఠ వెంకటేశ్వరస్వామి కమాన్ దగ్గరున్న పొలంలో ఏర్పాట్లు కూడా చేశారు. ఇక అక్కడే దకాణం పెట్టిన తమిళనాడు స్వామికి భక్తులు హారతులు పట్టారు.
అయితే ఆదివారం మట్టి ఎద్దుల అమావాస్య కావడంతో పాగుంట వేంకటేశ్వర స్వామి ఆలయంకు వెళ్లే భక్తులు తమిళనాడు స్వామిని చూడ్డానికి ఎగబడ్డారు. దీంతో గద్వాల రాయచూరు రోడ్డు దగ్గర ట్రాఫిక్ జామ్ సీన్ కనిపించింది. సమాచారం అందుకున్న కెటిదోడ్డి పోలీసులు నేనే సర్వాంతర్యామిని.. నేనే భగవంతుడిని.. అంటున్న స్వామీజీని స్టేషన్కు లాక్కెళ్లి లాకప్ లో వేశారు. అయితే అతడికి గతంలోనే కౌన్సిలింగ్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.
