Telangana: ముఖ్యమంత్రి సహాయనిధి స్కామ్‌లో వెలుగులోకి సంచలనాలు.. ఇద్దరు అరెస్ట్..!

ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) స్కామ్‌లో ప్రభుత్వ నిధులను స్వాహా చేసేందుకు నకిలీ మెడికల్ బిల్లులు సమర్పించిన ఇద్దరు వ్యక్తులను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు.

Telangana: ముఖ్యమంత్రి సహాయనిధి స్కామ్‌లో వెలుగులోకి సంచలనాలు.. ఇద్దరు అరెస్ట్..!
Cmrf Scam
Follow us

|

Updated on: Sep 04, 2024 | 9:59 AM

ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) స్కామ్‌లో ప్రభుత్వ నిధులను స్వాహా చేసేందుకు నకిలీ మెడికల్ బిల్లులు సమర్పించిన ఇద్దరు వ్యక్తులను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల నుంచి సీఎంఆర్‌ఎఫ్‌ దరఖాస్తుల్లో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు అందాయి. దీంతో ఆగస్టు 23న ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

నిరుపేద రోగుల వైద్యం కోసం ఉద్దేశించిన CMRF నుండి నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై తెలంగాణలోని 27 ఆసుపత్రులపై CID విచారణ జరుగుతోంది. ఈ ఆసుపత్రులపై ఆరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు దర్యాప్తు ప్రారంభించింది సీఐడీ. విచారణలో భాగంగా నల్గొండ జిల్లాకు చెందిన నిందితులు గొట్టి గిరి(46), ఆసుపత్రి సూపర్‌వైజర్‌ లెకిరెడ్డి సైదిరెడ్డి(40)లను పోలీసులు అరెస్ట్ చేశారు.

మిర్యాల్‌గూడలో స్థానిక ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఈ వ్యవహారం నడిచినట్లు పోలీసులు గుర్తించారు. డెస్క్‌టాప్ కంప్యూటర్లతో నకిలీ సీఎంఆర్‌ఎఫ్ బిల్లులు సృష్టించి వైద్యులు, ఆసుపత్రుల రబ్బరు స్టాంపులను తయారు చేశారు. నిందితులు ఒక్కో దరఖాస్తుకు రూ.4,000 చొప్పున వసూలు చేసి, నల్గొండలోని అమ్మ హాస్పిటల్, మిర్యాలగూడలోని నవీనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేర్లతో అవసరమైన రోగులకు సహాయం చేయడానికి 19 నకిలీ క్లెయిమ్‌లను సమర్పించారు.

నల్గొండలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిఐడి) ఆగస్టు 30న ఇద్దరిని అరెస్టు చేసింది. నిందితుల నుంచి నకిలీ మెడికల్ బిల్లులు, రబ్బరు స్టాంపులు, నకిలీ లెటర్ హెడ్‌ల సాఫ్ట్ కాపీలతో కూడిన కంప్యూటర్ హార్డ్ డిస్క్‌తో సహా కీలకమైన సాక్ష్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టు ముందు హాజరుపరచగా, వారిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. స్కామ్‌లో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తులను గుర్తించి అరెస్టు చేసేందుకు తదుపరి విచారణ కొనసాగుతోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..