Watch Video: రూ.కోటి ఇన్సూరెన్స్ కోసం మర్డర్ స్కెచ్.. స్నేహం ముసుగులో దారుణం! వీడియో వైరల్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో దారుణం చోటు చేసుకుంది..ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మర్డర్ ప్లాన్ చేశారు. స్నేహం ముసుగులో ఓ యువకుడ్ని చంపేందుకు కుట్ర చేశారు ఇద్దరు యువకులు. హత్యా యత్నాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్ అయ్యారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు..

భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 17: బూర్గం పాడు మండలం మోతే అటవీ ప్రాంతంలో ఈ నెల 14న జరిగిన రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనీ అల్లూరి సీతారామరాజు జిల్లా యటపాక మండలం గన్నవరానికి చెందిన కట్ట యశ్వంత్ గతంలో ఐటిసి కర్మాగారంలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేసేవాడు. కొన్ని కారణాలవల్ల ఉద్యోగం పోవడంతో ఖాళీగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన కట్ట సాయి దీపక్, భద్రాచలానికి చెందిన కొండ భాను ప్రకాశ్ లు పరిచయం అవడంతో ముగ్గురు స్నేహితులుగా మారిపోయారు. కట్ట యశ్వంత్, కట్టా సాయి దీపక్ ఇద్దరు ఒకే గ్రామానికి చెందిన వారవడంతో వారి మధ్య స్నేహం ఎక్కువగా ఉండేది. ఈ క్రమంలో సాయి దీపక్ కుటుంబం నిర్వహించే ఫెర్టిలైజర్ షాపులో పనిచేస్తూ వారికి చేదోడువాదోడుగా ఉండేవాడు.
ఈ నేపథ్యంలోనే సాయి దీపక్ అతని స్నేహితుడు భాను ప్రకాష్ మాస్టర్ ప్లాన్ వేశారు. ఈజీగా కోట్లు కొట్టేసేందుకు రంగం సిద్ధం చేశారు. కట్ట యశ్వంత్, కట్టా సాయి దీపక్ కులాలు వేరైనా ఇంటిపేర్లు ఒకటే కావడంతో యశ్వంత్ పేరు మీద బజాజ్ ఇన్సూరెన్స్ కంపెనీలో నవంబర్ 2025లో కోటి రూపాయలకు ఇన్సూరెన్స్ చేపించాడు సాయి దీపక్. అన్న గా తన పేరును నామినీగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఈనెల 14వ తారీకు రాత్రి వీరు ముగ్గురు కలిసి బూర్గంపాడు మండలం మోతె అటవీ ప్రాంతంలో పార్టీ చేసుకున్నారు. అనంతరం యశ్వంత్ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలయ్యాడని సాయి దీపక్, భాను ప్రకాష్ లు అతనిని భద్రాచలం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.
భద్రాచలం ప్రభుత్వ హాస్పిటల్లో యశ్వంత్ చికిత్స పొందుతున్నాడనే విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు జరిగిన ఘటనపై అనుమానం వ్యక్తం చేశారు. సాయి దీపక్ యశ్వంత్ పేరు మీద కోటి రూపాయలకు ఇన్సూరెన్స్ చేపించారని అందులో తన పేరును నామినేగా పెట్టుకున్నారు అంటూ సాయి దీపక్, భాను ప్రకాష్లపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులకు దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. కోటి రూపాయల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సాయి దీపక్, భాను ప్రకాష్ లు యశ్వంత్ ను హత్య చేసేందుకు ప్లాన్ ప్రకారం కుట్ర చేశారని, అందులో భాగంగానే హత్య యత్నం చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారనే నిజం బయటపడింది. హత్యాయత్నానికి పాల్పడిన సాయి దీపక్, భాను ప్రకాష్ లను పోలీసుల అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఘటనలో తీవ్ర గాయాల పాలైన యశ్వంత్ ఖమ్మం లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని బంధువులు, డాక్టర్లు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




