AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JEE Main 2026: జేఈఈ మెయిన్‌ తొలి విడతలో 15 తప్పిదాలు.. తీరు మార్చుకోని ఎన్టీయే! ఏటా ఇదే తంతు

జేఈఈ మెయిన్‌ ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఇష్టారీతిగా వ్యవహరిస్తోంది. పరీక్షల నిర్వహణ నుంచి కీ, తుది ఫలితాల విడుతల వరకు విద్యార్థులను ముప్పుతిప్పలు పెడుతోంది. ప్రశ్నలు కఠినంగా ఇవ్వాలనే ప్రయత్నంలో తప్పుల తడకగా పరీక్ష నిర్వహిస్తోంది. ప్రశ్నాపత్రంలో తరచూ తప్పిదాలు చోటు చేసుకోవడమే అందుకు కారణం. పరీక్ష అనంతరం చివరికి..

JEE Main 2026: జేఈఈ మెయిన్‌ తొలి విడతలో 15 తప్పిదాలు.. తీరు మార్చుకోని ఎన్టీయే! ఏటా ఇదే తంతు
15 errors in JEE Main final answer keys
Srilakshmi C
|

Updated on: Feb 17, 2026 | 2:32 PM

Share

హైదరాబాద్‌, ఫిబ్రవరి 17: ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షల్లో ఒకటైన జేఈఈ మెయిన్‌ ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఇష్టారీతిగా వ్యవహరిస్తోంది. పరీక్షల నిర్వహణ నుంచి కీ, తుది ఫలితాల విడుతల వరకు విద్యార్థులను ముప్పుతిప్పలు పెడుతోంది. ప్రశ్నలు కఠినంగా ఇవ్వాలనే ప్రయత్నంలో తప్పుల తడకగా పరీక్ష నిర్వహిస్తోంది. ప్రశ్నాపత్రంలో తరచూ తప్పిదాలు చోటు చేసుకోవడమే అందుకు కారణం. పరీక్ష అనంతరం చివరికి ఎన్ని ప్రశ్నలను తొలగిస్తుందో, ఏ ప్రశ్నకు జవాబులు మారుస్తుందో యేటా ఎవరికీ తెలియని పరిస్థితి దాపురిస్తుంది. ఈ ఏడాది నిర్వహించిన జేఈఈ మెయిన్‌ 2026 మొదటి విడత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నాపత్రాల్లో ఏకంగా తొమ్మిది ప్రశ్నలను తొలగించింది. ఇందులో అధిక ప్రశ్నలు ఫిజిక్స్‌లో ఉండటం గమనార్హం. మరో 6 ప్రశ్నలకు జవాబులను మార్చింది. ఇలా ప్రతి సంవత్సరం తప్పిదాలు చోటుచేసుకుంటున్నా ఎన్టీయే తీరు మార్చుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.

జేఈఈ మెయిన్‌లో జనవరి 22వ తేదీ ఉదయం, జనవరి 23వ తేదీ ఉదయం విడతల్లో ఫిజిక్స్లో ఒక్కో ప్రశ్నను తొలగించినట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. 23వ తేదీ మధ్యాహ్నం విడత జరిగిన పరీక్షలో ఫిజిక్స్‌లోనూ ఒక ప్రశ్నకు మూడు సరైన జవాబులు వచ్చాయని, దీనికి విద్యార్ధులందరికీ ఒక్కో మార్కు చొప్పున కలిపినట్లు ఎన్టీయే తెలిపింది. అయితే ఫైనల్‌ ‘కీ’లో అదనంగా మరో 9 ప్రశ్నలను తొలగించడంతోపాటు మరో 5 ప్రశ్నలకు జవాబులు మార్చింది. మొత్తంగా జేఈఈ మెయిన్‌లో ఏకంగా 15 తప్పులు దొర్లినట్లైంది. గతేడాది 10 ప్రశ్నల్లో తప్పులు దొర్లాయి. ఇలా యేటా ప్రశ్నలను తప్పుగా ఇవ్వడం ఆన్సర్‌ ‘కీ’, తుది ‘కీ’లో మార్పులు చేయడం తంతుగా మారుతుంది. దీంతో పరీక్షలు రాస్తున్న లక్షలాది మంది విద్యార్ధులు ఫైనల్‌ కీ వచ్చేంత వరకూ ఎన్నెన్ని మార్పులు చేస్తారో అన్న ఉత్కంఠ ప్రహసనంగా సాగుతోంది.

ఒక్క మార్కు అటూఇటూ అయితే విద్యార్దుల ర్యాంకులు తారుమారవుతాయి. అయినా ఎన్‌టీఏ నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.ఎన్టీయేని ప్రశ్నించేవారే లేరా? అంటూ అవేదన వ్యక్తం చేస్తున్నారు. 2017లో ఎన్‌టీఏ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఏళ్లు గడుస్తున్నా ఎన్‌టీఏ పనితీరు మెరుగుపడటం లేదనేది అనేక ఉదాహరణలు స్పష్టం చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us