TSRTC Ticket Price: ఆర్టీసీలో మరోసారి ఛార్జీల ‘మోత’.. ఈ నెల 22 నుంచి అమలు..
TSRTC Luggage Charges: తాజాగా లగేజీ చార్జీల పేరుతో మరోసారి మోత మోగించేందుకు రెడీ అవుతోంది. 50 కిలోల వరకు ఉచిత లగేజీకి అవకాశం ఇస్తున్నా.. అదనపు లగేజీ మరింత భారంగా మారనుంది. అదనంగా ఒక కిలో పెరిగినా.. పాతిక కేజీల వరకు..
మరోసారి బాదుడుకు టీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. ఇప్పటికే సెస్ల రూపంలో టికెట్ ధరలను భారీగా పెంచగా.. తాజాగా లగేజీ చార్జీల పేరుతో మరోసారి మోత మోగించేందుకు రెడీ అవుతోంది. 50 కిలోల వరకు ఉచిత లగేజీకి అవకాశం ఇస్తున్నా.. అదనపు లగేజీ మరింత భారంగా మారనుంది. అదనంగా ఒక కిలో పెరిగినా.. పాతిక కేజీల వరకు ఒక యూనిట్గా పరిగణించి.. పూర్తి చార్జీని వసూలు చేయనున్నారు. పెయిడ్ లగేజీలో 25 కిలోలు దాటితే మరో యూనిట్గా ఛార్జి వసూలు చేస్తారు. గతంలో ప్రతి యూనిట్కు ఇప్పటి వరకు పల్లెవెలుగు బస్సుల్లో 25 కిలోమీటర్ల దూరం వరకు రూ. 1 వసూలు చేసేవారు. అయితే ఈ నెల 22 నుంచి ఆ ఛార్జీని రూ. 1 నుంచి ఏకంగా రూ. 20కి పెంచనున్నారు.
అదే 26-50 కిలోమీటర్ల మధ్య లగేజీ ఛార్జి ప్రతి యూనిట్కు ఇంతకు ముందు రూ. 2గా ఉండగా.. అది కాస్తా రూ.38 పెంచి.. రూ. 40కి తీసుకెళ్లారు. 51-75 కి.మీ. మధ్య రూ. 3కు గాను రూ. 60గా.. 76-100 కి.మీ మధ్య రూ. 4కు గాను రూ. 70గా చార్జీలను సవరించారు.
ఇలా కిలోమీటర్ల వారీగా లగేజీ ఛార్జీలపేరుతో భారీ మోత మోగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది ఆర్టీసీ. డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో లగేజీ చార్జీల పెంపు అనివార్యంగా మారిందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. 2002లో లగేజీ ఛార్జీలను సవరించారని.. ఆ తర్వాత 20 ఏళ్లకు ఇప్పుడే సవరణ జరిగిందని అంటున్నారు.
ఇదిలావుంటే ఒక్కో ప్రయాణికుడికి కేవలం 100 కిలోల వరకు మాత్రమే లగేజీ అనుమతి ఉంటుందని.. 50 కిలోల వరకు లగేజీ చార్జీలు ఉండవని.. ఆపైన బరువుకే ఛార్జీలు వసులు చేస్తున్నట్లుగా వెల్లడించారు. 100 కిలోలకు పైబడే లగేజీని ఆర్టీసీ కార్గో ద్వారా తరలించాలని ప్రయాణికులకు సూచించారు.