AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆమె వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని దర్యాప్తు చేయాలి.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..

తెలంగాణ రాజకీయాలు మాటల యుద్ధంతో వేడెక్కుతున్నాయి. టీఆర్‌ఎస్, బీజేపీ ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకుంటుంటే.. మధ్య కాంగ్రెస్ కూడా బీజేపీ, టీఆర్‌ఎస్ పై ఫైర్ అవుతోంది. ఈ క్రమంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..

Telangana: ఆమె వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని దర్యాప్తు చేయాలి.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
TPCC President Revanth Reddy
Amarnadh Daneti
|

Updated on: Nov 18, 2022 | 7:55 PM

Share

తెలంగాణ రాజకీయాలు మాటల యుద్ధంతో వేడెక్కుతున్నాయి. టీఆర్‌ఎస్, బీజేపీ ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకుంటుంటే.. మధ్య కాంగ్రెస్ కూడా బీజేపీ, టీఆర్‌ఎస్ పై ఫైర్ అవుతోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్‌లు కలుషిత వాతావరణం సృష్టిస్తున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. వాటాల్లో తేడాలతోనే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య కొట్లాట జరుగుతోందన్నారు. దీనికోసమే బీజేపీ ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ, ఎస్జీఎస్టీ, పోలీసులతో దాడులు పాల్పడుతోందని ఆరోపించారు. వివాదాల ముసుగులో 8 ఏళ్ల తప్పిదాలను తప్పిచుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో కేసీఆర్ వైఖరి హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేల మాటలు విని సీఎం కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలోకి ఎలా వచ్చారో ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. ఒకసారి పార్టీ మారిన వాళ్లు మరోసారి మారరా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీకి సంబంధం లేకపోతే కోర్టుకు ఎందుకు వెళ్లిందన్నారు. స్టే కోసం ఎందుకు ప్రయత్నించిందని ప్రశ్నించారు. తనను బీజేపీలోకి రావాలని అడిగారని ఎమ్మెల్సీ కవిత ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. అంగీకరించారని, ఈ ఘటనలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత స్టేట్మెంట్లను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నమోదు చేసుకోవాలన్నారు. కవితను పార్టీ ఫిరాయింపుల కోసం సంప్రదించింది ఎవరో తేల్చాలన్నారు. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని దర్యాప్తు చేయాలన్నారు. విచారణను కేవలం నలుగురు ఎమ్మెల్యేలకే పరిమితం చేస్తే కోర్టు ముందు సిట్ కూడా దోషిగా నిలబడాల్సి వస్తుందన్నారు.

కేంద్రంలోని ఈడీ, సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వంలోని ఏసీబీ, ఎస్జీఎస్టీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్రంలో ఎవ్వరూ కూడా స్వేచ్చగా నిద్రపోలేని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. 2004-14 మధ్య కాంగ్రెస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు వ్యాపారులను, వ్యాపార సంస్థలను వేధించలేదన్నారు. పార్టీలు మారిన నేతలను కూడా వేధించలేదని, నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాప్రతినిధుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నాయన్నారు. కీలకమైన రైతు రుణమాఫీ, వడ్ల కొనుగోలు, పోడు భూములు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఫీజు రీయింబర్స్ మెంట్, నిరుద్యోగ భృతి, మల్లన్న సాగర్, మిడ్ మానేరు ముంపు బాధితులు, డిండి ప్రాజెక్టు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వంటి వాటిపై చర్చ జరగడం లేదని అవేదన వ్యక్తం చేశారు. కేవలం ఈడీ, సీబీఐ, ఏసీబీ, ఎస్జీఎస్టీ, పోలీసుల దాడులు, పార్టీ ఫిరాయింపులు, ఢిల్లీ లిక్కర్ స్కాం, ఎమ్మెల్యేల కొనుగోలు వంటి అనవసర అంశాల చూట్టూ చర్చ జరుగుతుందన్నారు.

ప్రజా సమస్యలపై కొట్లాడాలని కాంగ్రెస్ నిర్ణయించిందన్నారు. జూమ్ మీటింగ్ ద్వారా నాయకులందరితో చర్చించి త్వరలోనే కాంగ్రెస్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. ముందుగా రైతు సమస్యలపై పోరాటం చేయాలనుకుంటున్నామని తెలిపారు. డిసెంబర్ 7 నుంచి మొదలయ్యే పార్లమెంటు సమావేశాల్లో బలహీన వర్గాల పక్షాన..బీసీ జనాభా లెక్కలు, వారికి దక్కాల్సిన నిధులు తదితర సమావేశాలపై పోరాటం చేస్తామన్నారు.

ఇవి కూడా చదవండి

కవితను పార్టీలోకి రావాలని బీజేపీ ఆహ్వానించిందే తప్ప..కాంగ్రెస్ కాదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశాన్ని లేవనెత్తిన ధర్మపురి అరవింద్ సమాధానం చెప్పాలన్నారు. విమర్శలకు విమర్శలతోనే సమాధానం చెప్పాలి కాని, ప్రజాస్వామ్యంలో దాడులు సరికాదన్నారు. రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు కాబట్టే టీఆర్ఎస్ నేతలు దాడులకు తెగబడుతున్నారని, ఇటువంటి దాడులకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమన్నారు. దాడులు ఎవరూ చేసినా తప్పే అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..