AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karimnagar: బండి వర్సెస్ గంగుల మధ్యలో కాంగ్రెస్.. అందరి చూపు కరీంనగర్ వైపే.. జోరుగా బెట్టింగ్‌‌లు..

తెలంగాణ ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలు ఆదివారం వెలుడవనున్నాయి. ఈ క్రమంలో ఇటు అభ్యర్థుల్లో, అటు ఆయా పార్టీల నేతల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే, రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న నియోజకవర్గాల్లో కరీంనగర్ ఒకటి. ఇక్కడి నుంచి మంత్రి గంగుల కమలాకర్, బండి సంజయ్ పోటీ చేస్తుండడంతో రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల వారు కూడా కరీంనగర్ గురించి ప్రత్యేకంగా చర్చిస్తున్నారు.

Karimnagar: బండి వర్సెస్ గంగుల మధ్యలో కాంగ్రెస్.. అందరి చూపు కరీంనగర్ వైపే.. జోరుగా బెట్టింగ్‌‌లు..
Bandi Sanjay vs Gangula Kamalakar
G Sampath Kumar
| Edited By: |

Updated on: Dec 01, 2023 | 11:20 AM

Share

తెలంగాణ ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలు ఆదివారం వెలుడవనున్నాయి. ఈ క్రమంలో ఇటు అభ్యర్థుల్లో, అటు ఆయా పార్టీల నేతల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే, రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న నియోజకవర్గాల్లో కరీంనగర్ ఒకటి. ఇక్కడి నుంచి మంత్రి గంగుల కమలాకర్, బండి సంజయ్ పోటీ చేస్తుండడంతో రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల వారు కూడా కరీంనగర్ గురించి ప్రత్యేకంగా చర్చిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బండి సంజయ్ దూకుడుగా వ్యవహరించి ఓ క్రేజ్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజయ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రమోట్ కావడం, మూడో సారి కూడా కరీంనగర్ నుండి పోటీ చేస్తుండడంతో ఆయన గెలుపు ఓటముల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 2014, 2018 ఎన్నికల్లో రెండో స్థానానికే పరిమితమయిన బండి సంజయ్ 2019 లోకసభ ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తరువాత బీజేపీ స్టేట్ చీఫ్ గా కొనసాగిన సంజయ్ రాష్ట్రంలోని వివిధ వర్గాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో మూడోసారి కూడా కరీంనగర్ నుండి పోటీ చేసిన సంజయ్ గెలుస్తారా లేదా అన్న అంశమే హాట్ టాపిక్ గా మారింది.

రెండు సార్లు కూడా..

2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్ల బండి సంజయ్ గెలుపు అంచుల వరకు చేరుకున్నారు. 2018 ఎన్నికల్లో అయితే సంజయ్ గెలుపు దాదాపు ఖాయమని భావించినప్పటికీ కరీంనగర్ ఓటర్లలో మెజార్టీ వర్గం గంగుల కమలాకర్ కు అనుకూలంగా మారడంతో ఓడిపోయారు. ప్రధానంగా కరీంనగర్ లో మైనార్టీ ఓట్లు కీలకంగా మారడంతో హిందుత్వ నినాదాన్ని అత్యంత బలంగా వినిపించే బండి సంజయ్ కి సానుకూలత లేకుండా పోయింది. దీంతో బండి సంజయ్ గత రెండు ఎన్నికల్లో ఓటమి చవి చూసినా.. వెంటనే జరిగిన లోకసభ ఎన్నికల్లో గెలిచి సంచలనం సృష్టించారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో కరీంనగర్ ఓటరు తీర్పు ఎటువైపు ఇస్తారోనన్నదే అంతు చిక్కకుండా ఉంది. ఈ సారి కరీంనగర్ లో త్రిముఖ పోరు జరగడం.. కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు వీయడంతో గెలుపు ఎవరిదోనన్న ఉత్కంఠ నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి గంగుల కమలాకర్ బలమైన ప్రత్యర్థి కావడంతో ఈ సారి బండి సంజయ్ కి ఎలా లాభం ఉంటుందా.. నష్టం జరుగుతోందా అన్న అంశం చుట్టే చర్చలు సాగుతున్నాయి.

అనూహ్యంగా..

పోలింగ్ తేది నాటికి గంగుల కమలాకర్ వ్యూహాలకు పదునుపెట్టి అనూహ్యంగా టఫ్ ఫైట్ తీసుకొచ్చారు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్ గురించి చర్చ జరగగా నవంబర్ 26 నుండి గంగుల కమలాకర్ ఓటర్లను తనవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. దీంతో కరీనంగర్ ట్రయాంగిల్ ఫైట్ జరిగినప్పటికీ చివరి నిమిషంలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగానే సాగింది. అయితే ఈ సారి దాదాపు 60 వేల పైచిలుకు ఓట్లు ఉన్న మైనార్టీలు ఎటువైపు మద్దతు ఇచ్చారోనన్నదే అంతుచిక్కకుండా పోతోంది. మైనార్టీల ఓట్లు రెండుగా చీలిపోయి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు పడితే బండి సంజయ్ గెలుపు ఖాయంగా భావిస్తున్నారు. ఒక బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే పడితే మాత్రం బండి సంజయ్ కి అనుకూలత ఉండే అవకాశాలే లేవని అంటున్నారు. కానీ మైనార్టీలలో మెజార్టీ ఓట్లు కాంగ్రెస్ పార్టీ చీల్చుకునే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాలే ఎక్కువగా వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మైనార్టీలు మారడం, కరీంనగర్ లో మైనార్టీ వర్గాలకు జరిగిన అన్యాయం తదితర అంశాలు తీవ్రమైన ప్రభావం చూపాయని అంటున్నారు. ఇలా జరిగినట్టయితే మాత్రం బండి సంజయ్ గెలుపు నల్లేరు మీద నడకేనన్న అభిప్రాయాలే ఎక్కువగా వ్యక్తం అవుతున్నాయి. అర్బన్ ఏరియాతో పాటు రూరల్ ఏరియాలోని ఓటర్లను బండి సంజయ్ తనకు అనుకూలంగా మల్చుకోవడంలో సక్సెస్ అయ్యారని దీంతో చాలా వర్గాలు కూడా బీజేపీ వైపు మొగ్గు చూపారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే ఏబీసీడీ వర్గీకరణ అంశం కలిసి రావడంతో పాటు మెజార్టీ ఓట్లున్న మున్నూరు కాపు, ఆర్యవైశ్య వంటి సామాజిక వర్గాలు కూడా సంజయ్ కి అనుకూలంగా వ్యవహరించారన్న అంచనాలు కూడా తెరపైకి వస్తున్నాయి.

ఎవరి అంచనాల్లో వారు..

కరీంనగర్ నుండి తన గెలుపు ఖాయం అయిపోయిందని, కరీంనగర్ ప్రజలు తనకు బంపర్ మెజార్టీ అందించబోతున్నారని బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రకటించారు. గెలుపునకు సంబంధించిన గణాంకాలపై బీజేపీ నాయకులు అంచనాలు వేసుకుని గెపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ అర్బన్ తో పాటు మునిసిపాలిటీ, మేజర్ పంచాయితీలలో కూడా బీజేపీ ఓట్లను షేర్ చేసుకోవడంతో తమకు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే మంత్రి గంగుల కమలాకర్ గెలిచి తీరుతారన్న ధీమా బీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. చివరి వారం రోజుల్లో గంగుల కమలాకర్ పై వచ్చిన సానుకూల వాతావరణమే ఇందుకు నిదర్శనమన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అర్బన్ ఏరియాలో కూడా ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి పడ్డాయని గ్రామీణ ప్రాంతాల్లో కూడా మెజార్టీ ఓట్లను షేర్ చేసుకున్నామని, మైనార్టీ వర్గాల ఓట్లు కూడా తమకు లాభించాయని అంచనా వేస్తున్నారు. వీటన్నింటిని బేరీజు వేసుకున్నట్టయితే తమ గెలుపు ఖాయమని బీఆర్ఎస్ పార్టీ అంచనా వేస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా గెలుపుపై ఆశలు సజీవంగానే ఉంచుకున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణంతో పురుమల్ల శ్రీనివాస్ కు మైనార్టీ వర్గాల్లో ఉన్న పట్టు లాభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇలా కరీంనగర్ సీట్ తెలుగు రాష్ట్రాల్లో హీట్ పుట్టిస్తోంది. ఇప్పటికే.. ఫలనా అభ్యర్థి గెలుస్తాడంటూ జోరుగా బెట్టింగులు కూడా సాగుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us