Schools Reopen : విద్యార్థులు మీరు రెడీనా..! తెలంగాణలో సోమవారం నుంచి తెరుచుకోనున్న విద్యాసంస్థలు..
తెలంగాణలో విద్యాసంస్థలు సోమవారం నుంచి తెరుచుకోనున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ స్కూల్లు, కాలేజీల్లో తరగతులు నిర్వహించనున్నారు. తల్లిదండ్రుల అనుమతితో...
Schools Reopen : తెలంగాణలో విద్యాసంస్థలు సోమవారం నుంచి తెరుచుకోనున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ స్కూల్లు, కాలేజీల్లో తరగతులు నిర్వహించనున్నారు. తల్లిదండ్రుల అనుమతితో విద్యార్థులు స్కూళ్లకు వెళ్లాల్సి ఉంటుంది. అటు తరగతులకు విద్యార్థుల హాజరు తప్పనిసరి కాదని రాష్ట్ర విద్యాశాఖ తెలిపింది.
తెలంగాణలో సోమవారం నుంచి స్కూళ్లు, కాలేజీలు పునప్రారంభమవుతాయని మంత్రి సబితారెడ్డి ప్రకటించారు. ఆదివారం కొల్లాపూర్లోని ప్రభుత్వ స్కూళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ.. పాఠశాలలకు విద్యార్థులను ఎలాంటి భయం లేకుండా తల్లిదండ్రులు పంపిచవచ్చని విద్యాసంస్థల్లో అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. తరగతి గదుల్లో కరోనా నిబంధనలు పాటిస్తున్నామని వెల్లడించారు.
ఒక గదికి 20 మంది విద్యార్థులకు మించకుండా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించిన సంగతిని మంత్రి గుర్తు చేశారు. విద్యార్థుల మధ్య ఆరు ఫీట్ల దూరం ఉండేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. శానిటైజేషన్, మంచినీటి ట్యాంకులు శుభ్రం చేయిస్తామన్నారు. ప్రతి పాఠశాలలో ఒక ఐసోలేషన్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. తొమ్మిది, పదోతరగతుల నిర్వాహణ పరిశీలించిన తర్వాత.. కిందస్థాయి తరగతులపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యతో పాటు విద్యార్థుల సంరక్షణ ముఖ్యమేనని మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు.