తెలంగాణలో పెట్రోల్ కొరత ఉందా.. డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన
పెట్రోల్ కొరత వస్తుందనే వదంతులతో ప్రజలు ఆందోళన చెందుతుండగా… తెలంగాణలో ఇంధన కొరత లేదని స్పష్టంచేసింది తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్. తప్పుడు ప్రచారాల కారణంగా బంకుల వద్ద రద్దీ పెరిగి విక్రయాలు 3 రెట్లు పెరిగాయని… దీంతో కొన్ని చోట్ల తాత్కాలికంగా నిల్వలు తగ్గుతున్నాయే తప్ప అసలు కొరత లేదని తెలిపింది.

పెట్రోల్ కొరత రాబోతుంది అంటూ ప్రచారం.. బంకుల దగ్గర వాహనాల రద్దీ పెరగడంపై తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలో ఇంధన కొరత లేదని స్పష్టం చేసింది తప్పుడు వార్తలతో ప్రజలు ఆందోళనతో బంకులకు వస్తున్నారని.. దీనివల్ల విక్రయాలు సాధారణం కంటే 2.5 నుంచి 3 రెట్లు పెరిగినట్లు తెలిపింది. విపరీతమైన రద్దీ వల్ల కొన్ని చోట్ల తాత్కాలికంగా నిల్వలు అయిపోతున్నాయని.. వాస్తవంగా ఎలాంటి ఇంధన కొరత లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు ప్రజలకు కొన్ని సూచనలు చేసింది ఆందోళనతో ఫుల్ ట్యాంక్ చేయించకుండా.. అవసరాలకు తగ్గట్టుగానే పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయమని సూచించింది. క్యాన్లు, డ్రమ్ముల్లో పెట్రోల్, డీజిల్ కొని స్టాక్ పెట్టుకోవద్దని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కోరింది.
మరోవైపు బుధవారం మధ్యాహ్నం అధికారులతో సీఎం రేవంత్ పెట్రోల్, గ్యాస్, యూరియా నిల్వలపై కీలకమైన సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మ.2గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో ఈ మీటింగ్ జరగనుంది. ఇంధన సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేందుకు.. తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.
