AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రేషన్ కార్డు ఉన్నవాళ్లకు తెలంగాణ సర్కార్ సూపర్ గుడ్ న్యూస్.. ఆగస్టు నుంచే కోటి కుటుంబాలకు పంపిణీ..

రేషన్ కార్డుదారులకు రేవంత్ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.05 కోట్లకు పైగా కుటుంబాలకు క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సర్వం సిద్ధమైంది. అంతేకాకుండా ఈ కేవైసీకి సంబంధించి అధికారులు బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Telangana: రేషన్ కార్డు ఉన్నవాళ్లకు తెలంగాణ సర్కార్ సూపర్ గుడ్ న్యూస్.. ఆగస్టు నుంచే కోటి కుటుంబాలకు పంపిణీ..
Smart Ration Cards Distribution In August
Krishna S
|

Updated on: Jul 26, 2026 | 8:51 AM

Share

తెలంగాణ రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డుదారులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించడానికి సిద్ధమైంది. రాష్ట్రంలోని దాదాపు 1.05 కోట్లకు పైగా రేషన్ కార్డుదారుల కుటుంబాలకు క్రెడిట్, డెబిట్ కార్డుల పరిమాణంలో ఉండే అత్యంత ఆధునిక కాంప్యాక్ట్ స్మార్ట్ రేషన్ కార్డులను అందజేసేందుకు పౌరసరఫరాల శాఖ శరవేగంగా ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ స్మార్ట్ రేషన్ కార్డులలో QR కోడ్‌‌ను కూడా అనుసంధానించారు. ఇప్పటికే కార్డుల ప్రింటింగ్ పూర్తికాగా, వాటిని రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు రవాణా చేయడం జరిగింది.

ఆగస్టు మొదటి వారంలో లేదా ఆగస్టు 15న పంపిణీ..

ఈ నూతన స్మార్ట్ కార్డుల పంపిణీ ముహూర్తంపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాజధాని హైదరాబాద్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ పంపిణీ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. అదే సమయంలో ఆయా జిల్లాల్లో మంత్రులు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఈ కార్డులను లబ్ధిదారులకు అందజేస్తారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు మొదటి వారంలో గానీ లేదా ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా ఈ స్మార్ట్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలను ముద్రించారు.

జూలై 31 నాటికి 100శాతం ఈ కేవైసీ

స్మార్ట్ కార్డుల పంపిణీకి ముందు పౌరసరఫరాల శాఖ మరొక కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ సరుకులు అందించేందుకు జూలై 31 నాటికి 100 శాతం ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ దాదాపు 5 లక్షల మంది లబ్ధిదారులు ఈ కేవైసీ పూర్తి చేయాల్సి ఉందని అధికారులు గుర్తించారు. ఈ కేవైసీ పూర్తి చేయని లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతున్నారు. ప్రతి సర్కిల్‌ను సెక్టార్లు, సబ్ సెక్టార్లుగా విభజించి చెకింగ్ ఇన్‌స్పెక్టర్లకు బాధ్యతలు అప్పగించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థలు, అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల సహకారంతో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నారు.

అనర్హుల ఏరివేత.. వేళల పొడిగింపు..

ఈ కేవైసీ ప్రక్రియ ద్వారా మరణించిన వారు లేదా శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి వివరాలను సేకరించి, వారి పేర్లను రేషన్ కార్డుల జాబితా నుంచి తొలగించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. కాగా ప్రజల సౌకర్యార్థం రేషన్ షాపుల పని వేళలను కూడా పొడిగించేందుకు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటివరకు ఈ కేవైసీ పూర్తి చేయని లబ్ధిదారులు వెంటనే తమ సమీపంలోని రేషన్ షాపునకు వెళ్లి, ఈ నెలాఖరులోగా బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Follow Us