IT Raids: మంత్రి మల్లారెడ్డి సమీప బంధువు ఇంట్లో సోదాలు.. రూ. రెండు కోట్ల నగదు సీజ్ చేసిన ఐటీ అధికారులు
మల్లారెడ్డి నివాసం, కాలేజీల్లో నాన్స్టాప్గా తనిఖీలు జరుగుతున్నాయి. ప్రధానంగా విద్యాసంస్థల లావాదేవీలపై ఐటీ నజర్ వేసింది. మెడికల్ సీట్ల కేటాయింపుల్లో ప్రైవేట్ వ్యక్తులకు సీట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు ..
మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థలు.. ఆయన కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లల్లో జరుగుతున్న ఐటీ దాడుల్లో కొత్త విషయాలతో పాటు నోట్ల కట్టలు కూడా వెలుగులోకొస్తున్నాయి. కీలక డాక్యుమెంట్లు.. కళ్లు చెదిరే కోట్ల కొద్ది నోట్లకట్టలు అధికారులు సీజ్ చేస్తున్నారు. మల్లారెడ్డి.. ఆయన తనయులు మహేందర్రెడ్డి, భద్రారెడ్డి, అల్లుడు రాజశేఖర్రెడ్డిల నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. 50వాహనాల్లో 175మంది అధికారులొచ్చారు. 50 టీమ్స్గా విడిపోయి 50చోట్ల మెరుపు దాడులు మొదలెట్టారు. ముందుగా బోయిన్పల్లిలోని మంత్రి మల్లారెడ్డి నివాసంలో సోదాలు చేశారు. ఆ తర్వాత మహేందర్రెడ్డి, భద్రారెడ్డి, రాజశేఖర్ నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
మంత్రి మల్లారెడ్డి సమీప బంధువు ఇంట్లో రూ. రెండు కోట్లు..
అయితే తాజాగా సుచిత్రలోని మంత్రి మల్లారెడ్డి సమీప బంధువు త్రిశూల్ రెడ్డి ఇంట్లో ఈ ఉదయం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. త్రిశూల్ రెడ్డి ఇంట్లో రూ. రెండు కోట్ల నగదు సీజ్ చేశారు. నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ డైరెక్టర్గా తృశూల్ రెడ్డి ఉన్నారు. ఆ కాలేజీని ఆయనే నిర్వహిస్తున్నారు.
పన్ను ఎగవేతకు సంబంధించి పూర్తి స్థాయిలో తనిఖీలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. బాలానగర్ రాజుకాలనీలో క్రాంతి బ్యాంక్ చైర్మన్ రాజేశ్వర్ రావు ఇంట్లో ఐటి శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. క్రాంతి బ్యాంక్లో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ లావాదేవీలు గుర్తించారు అధికారులు.
మెడికల్ సీట్లు అమ్ముకున్నారనే..
మెడికల్ కాలేజీలో మెనేజ్మెంట్ కోటా సీట్లను కోట్ల రూపాయలకు అమ్ముకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఐటీ లెక్కలపై అధికారులు ఆరాతీస్తున్నారు.
ఐటీ ఎటాక్స్లో కోట్ల రూపాయలు..
ఐటీ ఎటాక్స్లో కోట్ల రూపాయలు దొరకడం కలకలం రేపుతోంది. మల్లారెడ్డి సమీప బంధువు త్రిశూల్ ఇంట్లో రెండు కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మల్లారెడ్డి తనయుడు మహేందర్రెడ్డి సన్నిహితుడు రఘునాథ్రెడ్డి ఇంట్లో 2కోట్ల 80వేల రూపాయలు సీజ్ చేశారు.
గంగుల కమలాకర్ టార్గెట్గా..
అంతకుముందు మంత్రి గంగుల కమలాకర్ టార్గెట్గా ఆయన ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో ఐటీ, ఈడీ సోదాలు జరిపింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై మెరుపు దాడులు చేశారు. గ్రానైట్ ఎగుమతుల్లో భాగంగా ఆయా సంస్థలు అక్రమాలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలతో 8 సంస్థలకు నోటీసులు జారీ చేశాయి. ఆ తర్వాత ఎటాక్ చేశాయి. మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన వెంటనే దాడులు జరగడం పెద్ద చర్చకు దారితీసింది.
తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులపై..
మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు, ఆయన పీఏను ఈడీ విచారణకు పిలిచింది. చికోటి ప్రవీణ్ క్యాసినో కేసుకి సంబంధించి వారికి నోటీసులు జారీ చేసి విచారించింది. క్యాసినో ఆడేందుకు వెళ్లిన సమయంలో మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఈడీ ఆరాతీసింది. అలాగే నగదు డిపాజిట్లకు సంబంధించిన విషయాలపైనా పలు ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం