Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌కు షాకుల మీద షాకులు.. తీరు మారకపోతే ముప్పు తప్పదంటున్న విశ్లేషకులు.. మర్రి తర్వాత ఎవరు?

రాహుల్ గాంధీ వచ్చి వెళ్ళిన తర్వాత వరంగల్ డిక్లరేషన్‌తో ప్రజల్లోకి చొచ్చుకువెళుతుందనుకున్న పార్టీలో వారం, పది రోజుల హడావిడి తప్ప ఏమీ కనిపించలేదు. తమ సిట్టింగ్ సీటు మునుగోడుకు ఉప ఎన్నిక జరుగుతున్న తరుణంలో సత్తా చాటుతుందనుకుంటే...

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌కు షాకుల మీద షాకులు.. తీరు మారకపోతే ముప్పు తప్పదంటున్న విశ్లేషకులు.. మర్రి తర్వాత ఎవరు?
Telangana Congress
Follow us

|

Updated on: Nov 22, 2022 | 7:38 PM

తెలంగాణలో కాంగ్రెస్‌ కథలో మార్పు రావడం లేదు. మే నెలలో రాహుల్ గాంధీ వచ్చి వెళ్ళిన తర్వాత వరంగల్ డిక్లరేషన్‌తో ప్రజల్లోకి చొచ్చుకువెళుతుందనుకున్న పార్టీలో వారం, పది రోజుల హడావిడి తప్ప ఏమీ కనిపించలేదు. తమ సిట్టింగ్ సీటు మునుగోడుకు ఉప ఎన్నిక జరుగుతున్న తరుణంలో సత్తా చాటుతుందనుకుంటే ముక్కి మూలిగి డిపాజిట్ దక్కించుకోగలిగింది. ఇక అగ్రనేత రాహుల్ గాంధీ ఏకంగా పన్నెండు రోజుల పాటు తెలంగాణలో పాదయాత్ర చేస్తే ఆ సందర్భంలో కనిపించిన కాసింత ఉత్సాహం.. ఆ వెంటనే చల్లారిపోయింది. షరామామూలుగా కాంగ్రెస్ నేతల వలస కొనసాగుతూనే వుంది. దాంతో హస్తం హస్తవాసిలో ఏమాత్రం మార్పు లేదని రాజకీయ విశ్లేషులు అభిప్రాయపడుతున్నారు. సీమాంధ్రలోని పదమూడు జిల్లాల్లో పార్టీని చంపుకుని మరీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేరిస్తే ఇక్కడా అధికారంలోకి ఇప్పుడప్పుడే వచ్చే పరిస్థితి లేకపోవడం కాంగ్రెస్ పార్టీ దుస్థితిని చాటుతోంది. తెలంగాణ ఇచ్చామన్న నినాదంతో, తమ పట్ల కనీసం ఓ విడతనైనా కృతఙ్ఞత చూపాలన్న ప్రచారంతో ప్రజల వద్దకు వెళ్ళలేకపోవడం తెలంగాణ కాంగ్రెస్ నేతల చారిత్రాత్మక తప్పిదమని చెప్పకతప్పదు.

కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపుల మయం. పార్టీ నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు కనిపిస్తుంది. పైకి ఐక్యంగా కనిపిస్తూనే ఎవరికి తోచిన విధంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి కాలంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి బలమైన నాయకుని హయాంలో పార్టీలో అసమ్మతి నేతలున్నా నోరు మెదపకుండా చేశారు. పి. జనార్దన్ రెడ్డి, వి.హనుమంతరావు, జెసీ దివాకర్ రెడ్డి లాంటి నేతలు లోలోపల అసంతృప్తి, అసమ్మతితో రగిలిపోయినా ఏనాడు నోరు తెరిచి బాహాటంగా వ్యాఖ్యలు చేయలేని పరిస్థితిని వైఎస్ఆర్ ఆనాడు కల్పించారు. పార్టీని దాదాపు తన కనుసన్నల్లో పెట్టుకున్నారు. సోనియా లాంటి అధినేత్రి ఒకానొక సందర్బంలో తెలంగాణ ఇద్దామంటే తన వ్యూహాలతో అడ్డుకున్నారు. 2004లో ఇచ్చిన కమిట్‌మెంటును సోనియా వాయిదా వేయడానికి కారణం వైఎస్ఆర్ అన్నది జగమెరిగిన సత్యం. కానీ ఆయన హఠాన్మరణం ఏపీ రాజకీయాలను ఒక్కసారి మార్చి వేసింది. తర్వాత సీఎంగా పగ్గాలు చేపట్టిన కొణిజేటి రోశయ్యకు పెద్దగా పట్టు లేకపోవడం, వీక్ సీఎంగా ఆయన్ను గమనించిన కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదిపి, తెలంగాణ ఉద్యమాన్ని మరో మలుపు తిప్పడంతో పరిస్థితులు మారిపోయాయి.

2010 తర్వాత మారిన పరిణామాలు

రోశయ్య తర్వాత లక్కీగా సీఎం అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్‌లో తనదైన శైలిలో పని చేసినా.. తెలంగాణ ఉద్యమాన్ని నియంత్రించలేకపోయారు. దరిమిలా రాష్ట్ర విభజనకు అడుగులు పడ్డాయి. ఓవైపు రాష్ట్ర విభజన అనివార్యమైన పరిస్థితిలో కిరణ్ కుమార్ రెడ్డి వేసిన అడుగులు ఆశ్చర్యాన్ని రేకెత్తించాయి. కాంగ్రెస్ పార్టీ అటు ఏపీలోను, ఇటీ తెలంగాణలోను హీన స్థితికి పడిపోవడానికి కారణమయ్యాయి. ఇదంతా గతం. 2014 తర్వాత కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్ లాగేసుకుంటున్నా పార్టీ రాష్ట్ర నాయకత్వంగానీ, హైకమాండ్ గానీ ఏమీ చేయలేకపోయింది. చివరికి పార్టీలో సీనియర్లు ఎందరో వున్నా పట్టుమని రెండు దశాబ్దాల రాజకీయ అనుభవం లేని, తెలంగాణలో కుదేలైపోయిన తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని రాష్ట్ర నాయకత్వ బాధ్యతలను అప్పగించింది. ఈ చర్య సహజంగానే సీనియర్ నేతలకు నచ్చకపోయినా కొందరు సర్దుకుపోయారు.. మరికొందరు అడపాదడపా అసంతృప్తి వెళ్ళగక్కుతూనే వున్నారు.

జోరుగా రాజీనామాలపర్వం

ఇవన్ని కాంగ్రెస్ పార్టీలో షరామామూలే. కాంగ్రెస్‌లో ఎవరి ఎజెండా వారిదే. అసలే గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం తక్కువేమీ కాదు. శతాబ్ధానికిపైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా బయటి శత్రువులు అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఆ పార్టీ నేతలు. అందులో గ్రూపు రాజకీయాలే చాలన్న సామెతను నిజం చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. నాయకుల్లో ఎవరికి వారే యమునాతీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మరో వైపు తెలంగాణ కాంగ్రెస్‌లో రాజీనామాల పర్వం కొనసాగుతుంది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన మర్రి శశిధర్‌రెడ్డి ఆ పార్టీకి రాంరాం చెప్పారు. పార్టీలో పరిస్థితి దిగజారిపోతోందంటూ, రేవంత్‌రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీలు వేణుగోపాల్‌, మాణిక్యం ఠాగూర్‌పైనా మండిపడ్డారు. వారిద్దరూ హైకమాండ్‌కు ద్రోహం చేశారని విమర్శించారు మర్రి. తాను త్వరలోనే బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని మర్రి శశిధర్ రెడ్డి విమర్శించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షులు అయినప్పటి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ అన్ని ఎన్నికలు ఓడిపోతూ వచ్చిందన్నారు.

రేవంత్‌పై సీరియస్ ఆరోపణలు

తెలంగాణలో పీసీసీ అధ్యక్షులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. పీసీసీ అధ్యక్షుడి పదవి కావాలంటే దాదాపు 25 కోట్లు ఖర్చు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సోనియాగాంధీ పట్ల సానుకూలత వ్యక్తం చేసినప్పటికి మిగిలిన నాయకులపై విమర్శలు గుప్పించారు మర్రి శశిధర్ రెడ్డి. చాలా బాధతో తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పార్టీ అధ్యక్షుడికి లేఖ రాస్తున్నానని, సోనియా గాంధీకి కూడా లేఖ రాశానన్నారు. పార్టీలో ప్రస్తుత పరిస్థితులను గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. పార్టీలో పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల కోసం పని చేయడంలో కాంగ్రెస్‌ ఫెయిలైందని విమర్శించారు.

గళమెత్తుతున్న అసమ్మతి నేతలు

గతంలో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఏఐసీసీ నోటీసులు ఇచ్చింది. 10 రోజుల్లో సమాధానం చెప్పాలని షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసింది. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేయాలంటూ వెంకట్ రెడ్డి మాట్లాడిన ఆడియో కాల్ లీకైంది. అయితే ఇప్పటి వరకు వెంకట రెడ్డి వివరణ ఇచ్చారా లేదా అన్నది ఇదమిత్తంగా తేలని పరిస్థితి. తెలంగాణ కాంగ్రెస్‌కు కష్టాలు పెరుగుతున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ తీరుకు వ్యతిరేకంగా అనేక మంది నేతలు గళమెత్తుతున్నారు. ఇంకొందరు పార్టీని వీడుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్బంగా పలువురు పార్టీలు మారితే ఏతావాతా నష్టపోయింది కాంగ్రెస్ పార్టీనే. గతంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ అంశంపై పార్టీ నాయకత్వానికి వివరించేందుకు సోనియా, రాహుల్ అపాయింట్‌మెంట్ కూడా అడిగారు. మరోసారి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీపీసీసీపై సంచలన కామెంట్స్‌ చేశారు. గాంధీభవన్‌లో మీటింగ్‌ పెట్టాల్సిందిపోయి ఇళ్లల్లో కూర్చుని జూమ్‌ మీటింగ్‌ ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. జూమ్‌ మీటింగ్‌ పెట్టడానికి ఇదేమైనా కంపెనీనా అని ప్రశ్నించారు. నేతలు పార్టీ మారకుండా చూడాల్సిన బాధ్యత పీసీసీకి లేదా?. అందరూ పార్టీ నుంచి వెళ్లిపోయాక గాంధీభవన్‌లో ఏం చేస్తారని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

జనం ఎజెండా.. ఐకమత్య పోరు

వరుస ఓటములతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన పార్టీ.. అవి ప్రత్యేక ఎన్నికలు అని సర్దిచెప్పుకుంది. తాజాగా జరిగిన మునుగోడు ఉపఎన్నికల్లో సిట్టింగ్ స్థానం ఎలాగైనా గెలవాలి అని కసరత్తు చేసినా చచ్చిచెడి డిపాజిట్ మాత్రం దక్కించుకుంది. నిజానికి మునుగోడు ఉపఎన్నికలపై అందరికంటే ముందే కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయినా ఫలితం ప్రతికూలంగానే వచ్చింది. పార్టీ వరుస ఓటముల నుంచి కోలుకునేందుకు పార్టీ ఛీఫ్ వరుస రివ్యూలు చేస్తున్నారు. ఇప్పటి నుండి ఏం చేయాలి అనే దానిపై తాజాగా మరో ఫోకస్ పెట్టింది. ప్రజా సమస్యలను ఎజెండాగా తీసుకొని ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎజెండాగా మలుచుకుని ప్రత్యక్ష పోరాటాలను చేయాలని కాంగ్రెస్‌ నేతలు నిర్ణయించారు. మరో పది నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే బీజేపీలో లేకపోతే టీఆర్ఎస్ పార్టీలో చేరే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందుకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ తాజాగా చేసిన వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. తగులుతున్న ఎదురు దెబ్బలతో, జరుగుతున్న పరిణామాలతో, ఎదురవుతున్న షాకులతోనైనా టీపీసీసీ విధాన నిర్ణయాల్లో మార్పు రాకపోతే పార్టీ విజయాల బాట పట్టడం కష్టమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో