ప్రాణ వాయువు కొరత తీర్చేందుకు తెలంగాణ సర్కార్ ప్రయత్నాలు.. దేశంలోనే తొలిసారిగా యుద్ధ విమానాల్లో రాష్ట్రానికి ఆక్సిజన్
రాష్ట్రం మందులు అందుబాటులో లేక ఆక్సిజన్ కరువై ప్రాణాలను కోల్పోతున్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ తెప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది.
Telangana faces oxygen shortage: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. మందులు అందుబాటులో లేక ఆక్సిజన్ కరువై ప్రాణాలను కోల్పోతున్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ తెప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా ఆక్సిజన్ సరఫరా కోసం తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం యుద్ధ విమానాలను ఉపయోగిస్తోంది. ఆక్సిజన్ ట్యాంకర్లతో కూడిన యుద్ధ విమానాలు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్కు ఈ ఉదయం బయల్దేరాయి. 8 ట్యాంకుల ద్వారా 14.5 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను భువనేశ్వర్ నుంచి హైదరాబాద్కు యుద్ధ విమానాలు తీసుకురానున్నాయి.
ఈ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించిన వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు అభినందించారు. సత్వరమే ఆక్సిజన్ను రాష్ర్టానికి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా యుద్ధ విమానాలను ఉపయోగిస్తోంది. మూడు రోజుల సమయంతో పాటు, ఎంతో మంది విలువైన ప్రాణాలను కాపాడేందుకు ఈ ప్రయత్నం దోహదపడుతుందని కేటీఆర్ ట్వీట్ చేశారు.
My compliments to both Health Minister @Eatala_Rajender Garu & @TelanganaCS Somesh Kumar Garu who are supervising Oxygen tankers airlifting from Hyderabad to Orissa to bring back oxygen faster to Telangana – saving 3 days & many valuable lives. First time in India#NeedOfTheHour pic.twitter.com/gAIjpeAOas
— KTR (@KTRTRS) April 23, 2021
మూడునాలుగు రోజులుగా రాష్ట్రంలో 260 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను వినియోగిస్తున్నారు. రోజు రోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో ఆక్సిజన్ సరిపోవడంలేదు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఙప్తిమేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి 360 మెట్రిక్టన్నుల ఆక్సిజన్ను కేటాయించింది. కేంద్రం కేటాయిస్తామని చెప్పిన దాంట్లో 70 టన్నుల వరకు మన రాష్ట్రంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న చిన్నచిన్న ఆక్సిజన్ ప్లాంట్ల నుంచి ఉన్నాయి. మిగిలిన ఆక్సిజన్ను బళ్లారి, భిలాయ్, అంగుల్ (ఒడిశా), పెరంబుదూర్ నుంచి తీసుకోవాలని సూచించింది. బళ్లారి స్టీల్ప్లాంట్ నుంచి తెలంగాణకు 20 మెట్రిక్ టన్నులు కేటాయించింది. వైజాగ్నుంచి దాదాపు ఇంతే కేటాయించారు. భిలాయ్, పెరంబుదూర్, అంగుల్ నుంచి ఆక్సిజన్ తెచ్చుకునేందుకు అవకాశమిచ్చింది. ఆయా ప్రాంతాలనుంచి ఆక్సిజన్ త్వరితగతిన రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు విమాన సేవలను వినియోగించుకుంటుంది తెలంగాణ రాష్ట్రం.