Rythu Bharosa: తెలంగాణలో వీరికి రైతు భరోసా కట్.. ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్.. ఈ పనిచేస్తేనే అకౌంట్లోకి..
రైతు భరోసా జమకాని రైతులకు రేవంత్ ప్రభుత్వం అలర్ట్ జారీ చేశారు. బ్యాంక్ ఖాతాల్లో సాంకేతిక సమస్య వల్ల కొంతమంది రైతులకు రైతు భరోసా జమ కాలేదు. దీంతో సమస్యను పరిష్కరించుకోవాలని రైతులకు ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు మంత్రి తుమ్మల ప్రకటన చేశారు.

రైతు భరోసా లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 22వ తేదీన సిద్దిపేటలోని నర్మెట్టలో జరిగిన బహిరంగ సభలో రైతు భరోసా తొలి విడత నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. 68.89 లక్షల మంది రైతులకు రూ.3,446 కోట్లు జమ చేశారు. లబ్దిదారులందరికీ తొలి ఎకరానికి రూ.6 వేలు విడుదల చేశారు. ఆదివారం బ్యాంకులకు సెలవు రోజు రావడంతో.. సోమవారం ఇవి రైతులకు జమ అయ్యాయి. అయితే కొంతమంది రైతులకు సొమ్ము పడటకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీరికి అలర్ట్ జారీ చేశారు.
బ్యాంక్ అకౌంట్ల రెన్యూవల్
రైతు భరోసా డబ్బులు పడనివారు తమ బ్యాంక్ అకౌంట్లను రెన్యూవల్ చేసుకోవాలని మంత్రి తుమ్మల తెలిపారు. బ్యాంకులకు వెళ్లి ఈ పని చేయించుకుంటే వెంటనే సొమ్ము అందుతుందని సూచించారు. కొంతమంది రైతులు తమ అకౌంట్లను రెన్యూవల్ చేసుకోలేదని, వీరికి నిధులను అధికారులు నిలిపివేసినట్లు తెలిపారు. బ్లాక్ అయిన అకౌంట్లను రైతులు వెంటనే రెన్యూవల్ చేయించుకోవాలన్నారు. బ్యాంకులు ముందుగానే రైతులకు సమాచారం అందించాలని, బ్యాంకులు ఇన్పర్మేషన్ ఇవ్వకపోవడంపై తుమ్మల ఫైర్ అయ్యారు. వారి బ్యాంక్ ఖాతాలను వెంటనే పునరుద్దరించి పెట్టుబడి సాయం జమ చేయాలని బ్యాంక్ అధికారులను ఆదేశించారు. రైతులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉందని, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిధులు ఆపేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ రైతుల నిధులకు బ్రేక్
రాష్ట్రంలో దాదాపు 4,405 మంది రైతులకు అందాల్సిన రూ.2,18,96,556 సాయానికి బ్రేక్ పడింది. రైతు భరోసా అందకపోవడంతో రైతులు వెళ్లి వ్యవసాయ అధికారులను సంప్రదించారు. దీంతో బ్యాంక్ అకౌంట్లు రెన్యూవల్ చేసుకోకపోవడం వల్లనే నిధులు జమ కాలేదని చెప్పారు. దీంతో తుమ్మల స్పందించి.. ఈ రైతులకు వెంటనే సాయం జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బ్యాంకులు ముందుగానే రైతులకు సమాచారం అందించి రెన్యూవల్ చేయించుకోనేలా చేయాలని సూచించారు. కాగా యాసంగి సీజన్కు సంబంధించి తొలి విడత నిధులను తెలంగాణ ప్రభుత్వం జమ చేసింది. మొత్తం మూడు విడతలుగా వీటిని అందించాలని నిర్ణయించింది. తొలి విడతలో ఎకరం భూమికి అందించగా.. రెండో విడతలో మూడు ఎకరాలకు ఇవ్వనుంది. ఇక చివరి విడతలో అన్ని ఎకరాలకు జమ చేయనుది. మొత్తం 45 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు.
