AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Job Opportunities: నెలకు రూ.2లక్షల జీతంతో ఉద్యోగాలు.. వారికి తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త!

యువతలో నైపుణ్యాలు పెంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ వేగంగా ముందుకు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) భవన నిర్మాణానికి మంత్రి వివేక్ వెంకటస్వామి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన యువతకు నైపుణ్య శిక్షణతో పాటు దేశ, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

Job Opportunities: నెలకు రూ.2లక్షల జీతంతో ఉద్యోగాలు.. వారికి తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త!
Telangana Skill Development
Prabhakar M
| Edited By: |

Updated on: Aug 04, 2026 | 3:30 PM

Share

రాష్ట్రంలోని విద్యార్థులు, యువతకు అండగా నలిచేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుటుంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఐటీఐలను ఏటీసీలు మార్చే ప్రక్రియలను సాగిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో కొత్త వాటిని కూడా నిర్మిస్తుంది. ఈ క్రమంలో తాజాగా మరో కొత్త భవణానికి మంత్రి వివేక్ వెంటక స్వామి భూవి పూజ చేశారు. ఈ ఏటీసీల్లో విద్యార్థులకు నైపుణ్య ఇవ్వడమే కాకుండా.. శిక్షణ పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం యువత తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదని, శిక్షణ నుంచి ఉద్యోగంలో చేరే వరకు ప్రభుత్వమే అండగా నిలిచే విధానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇచ్చి, నేరుగా ఉపాధికి అనుసంధానం చేసే వ్యవస్థను రూపొందిస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో మొత్తం 120 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కృత్రిమ మేధ (AI), ఎలక్ట్రిక్ వాహనాలు, డ్రోన్లు వంటి భవిష్యత్ సాంకేతిక రంగాల్లో యువతకు ప్రత్యేక శిక్షణ అందించి ప్రపంచ స్థాయి అవకాశాలకు సిద్ధం చేయడమే లక్ష్యమన్నారు. వ్యవసాయ రంగంలోనూ సాంకేతిక పరిజ్ఞానం వేగంగా విస్తరిస్తోందని పేర్కొన్న మంత్రి, రుద్రంగి ఏటీసీలో వ్యవసాయ ఆధారిత ఆధునిక కోర్సులు ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. పరిశోధనా సంస్థల సహకారంతో స్థానిక అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందించాలని సూచించారు.

ఆర్థిక ఇబ్బందుల కారణంగా విద్యార్థులు శిక్షణకు దూరం కాకుండా ఏటీసీలు, ఐటీఐల్లో చదివే వారికి నెలకు రూ.2 వేల స్టైపెండ్ అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. నైపుణ్య శిక్షణ ఇవ్వడమే కాకుండా ఉద్యోగం వచ్చే వరకు ప్రభుత్వ సహకారం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ యువతకు విదేశీ ఉద్యోగాలు కల్పించేందుకు టామ్‌కామ్ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో నర్సులు, ఎలక్ట్రీషియన్లు, కేర్‌గివర్లకు భారీగా అవకాశాలు ఉన్నాయని, సరైన నైపుణ్యం, భాషా పరిజ్ఞానం ఉంటే నెలకు రూ.2 లక్షలకు పైగా వేతనంతో ఉద్యోగాలు పొందే అవకాశం ఉందన్నారు.

రుద్రంగి ప్రాంతం నుంచి 100 మంది యువతను ఎంపిక చేస్తే వారికి జర్మన్ భాష శిక్షణ కోసం ప్రత్యేక ట్రైనర్‌ను పంపిస్తామని మంత్రి ప్రకటించారు. శిక్షణ పూర్తయ్యాక టామ్‌కామ్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటుందని వెల్లడించారు. విదేశీ ఉపాధిపై అవగాహన కార్యక్రమాలను త్వరలో నిర్వహించనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఐటీఐలను నిర్లక్ష్యం చేశారని మంత్రి విమర్శించారు. అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆధునిక పరికరాలపై తగిన దృష్టి పెట్టలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఏటీసీలుగా అభివృద్ధి చేసి ఆధునిక నైపుణ్యాలకు కేంద్రాలుగా మారుస్తోందని చెప్పారు.

తెలంగాణ యువత జర్మన్ భాష నేర్చుకుని విదేశాల్లో ఉద్యోగాలు సాధించాలనే ప్రయత్నాలను ఎగతాళి చేయడం సరికాదని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు భాషా నైపుణ్యం కూడా అవసరమేనని, విదేశాల్లో మంచి వేతనాలతో స్థిరపడే అవకాశాలను ప్రోత్సహించాల్సిందేనని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా గత ప్రభుత్వ విధానాలను మంత్రి విమర్శించారు. భారీ ఎత్తిపోతల వ్యవస్థ కారణంగా నిర్మాణ వ్యయంతో పాటు విద్యుత్ భారం కూడా రాష్ట్రంపై పెరిగిందని, ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడిందన్నారు.

వేములవాడ నియోజకవర్గంలో సుమారు రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతో పాటు సంక్షేమ పథకాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను మరింత విస్తరిస్తూ తెలంగాణ యువతకు దేశ, విదేశాల్లో మెరుగైన భవిష్యత్ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us