Telangana: ఆటో, క్యాబ్ కార్మికుల సమ్మెకు బ్రేక్.. యథావిధిగా సేవలు..
ప్రజలకు ఊరట కలిగింది. ఆటో, క్యాబ్ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సమ్మెను విరమించుకోనున్నారు. ఈ మేరకు ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మెకు బ్రేక్ పడింది. దీంతో సోమవారం నుంచి యథావిధిగా ఆటోలు, క్యాబ్లు తిరగనున్నాయి. తమ డిమాండ్ల కోసం ఆటో, క్యాబ్ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి.

తెలంగాణవ్యాప్తంగా ఆటో, క్యాబ్ సంఘాలు పిలుపునిచ్చిన సమ్మెకు బ్రేక్ పడింది. ప్రభుత్వంతో చర్చలు అనంతరం సమ్మెను విరమించుకుంటున్నట్లు ఆటో, క్యాబ్ సంఘాలు ప్రకటించాయి. తమ డిమాండ్ల సాధనపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆగస్ట్ 23 అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగాలని ఆటో, క్యాబ్ యూనియన్లు నిర్ణయం తీసుకున్నాయి. ఈ సమ్మెకు స్కూల్ డ్రైవర్ల అసోషియేషన్ కూడా మద్దతు పలకగా.. సోమవారం నుంచి సమ్మె ప్రారంభం కావాల్సి ఉంది. ఈ సమ్మె వల్ల సాధారణ ప్రజలతో పాటు స్కూల్ విద్యార్థులకు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉండటంతో ప్రభుత్వం స్పందించింది. ఆటో, క్యాబ్ సంఘాలతో చర్చలు జరిపింది. ఆటో, క్యాబ్ కార్మికులతో ప్రభుత్వ చర్చలు ఫలించింది.
ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో నేటి అర్ధరాత్రి నుండి చేపట్టనున్న సమ్మెను విరమించుకొనున్నట్లు ఆటో, క్యాబ్ కార్మికులు ప్రకటించారు. కార్మికులతో ఖైరతాబాద్ ఆర్టిఓ కార్యాలయంలోప్రభుత్వ అధికారులు సమావేశమయ్యారు. కార్మిక సంఘాల డిమాండ్లపై అధికారులు సానుకూలంగా స్పందించారు. జూమ్ ద్వారా సమావేశంలో పాల్గొని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించారు. మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ప్రభుత్వ అధికారులు సానుకూలంగా స్పందించడంతో సమ్మెను విరమించుకోనున్న ఆటో కార్మిక సంఘాలు ప్రకటన చేశాయి. తమ డిమాండ్లపై త్వరలో జీవో విడుదల చేయాలని కార్మిక నాయకులు కోరాయి.
“ఆటో డ్రైవర్లకు 12వేల సాయంపై కేబినెట్లో చర్చిస్తాం. RTC ద్వారా ఈవీ ఆటోల ప్రచారం అవాస్తవం. ఆటో చార్జీల సవరణకు కమిటీ ఏర్పాటు. 15 రోజుల్లో ఆటో చార్జీలపై కమిటీ నివేదిక. ఆటోల కోసం యాప్ తెచ్చేందుకు ఐటీశాఖతో చర్చలు జరుపుతాం. ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ సంక్షేమబోర్డుపై కసరత్తు చేస్తాం. సెప్టెంబర్ మొదటి వారంలో మంత్రుల సంయుక్త సమావేశం నిర్వహిస్తాం. అనంతరం అసెంబ్లీ సమావేశాల్లో చర్చ నిర్వహిస్తాం” అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
