అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు!
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని స్పీకర్ సస్పెండ్ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ నేతలు నెక్లెస్ రోడ్డులో నిరసన తెలిపారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.

ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై అసెంబ్లీ స్పీకర్ సస్పెన్షన్ విధించడంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు నెక్లెస్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని, తెలంగాణ భవన్కు తరలించారు. ఈ క్రమంలో రేపు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. కాగా, ఈ రోజు సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. జగదీష్ రెడ్డి మాట్లాడుతుండగా.. సభా సంప్రదాయాలను పాటించడం లేదన్నారు స్పీకర్. దీంతో ఏ సంప్రదాయాలు పాటించడం లేదని జగదీష్ రెడ్డి తిరిగి ప్రశ్నించారు. అసలు స్పీకర్ స్థానాన్ని ప్రశ్నించడమే సంప్రదాయలకు విరుద్ధమన్నారు గడ్డం ప్రసాద్ కుమార్.
ఈ వ్యాఖ్యలతో విభేదించిన జగదీష్ రెడ్డి.. స్పీకర్ కూడా సభ్యులందరితో సమానమే అని అన్నారు. సభ స్పీకర్ సొంతమేమి కాదన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు సభలో జరిగిన వివాదాన్ని ఢిల్లీలో ఉన్న సీఎంకు వివరించారు మంత్రి శ్రీధర్ బాబు. జగదీష్రెడ్డిపై చర్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయడంతో.. ఆ వ్యాఖ్యలను అఖిలపక్షం ముందు ఉంచాలని బీఆర్ఎస్ కోరింది. తప్పు అనిపిస్తే క్షమాపణ చెబుతామని చెప్పింది. మరోవైపు స్పీకర్ చాంబర్కి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేలు 3 గంటలైనా సభ పున:ప్రారంభం కాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత సభ ప్రారంభమైన తర్వాత ఈ సెషన్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారు స్పీకర్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.