పూరిగుడిసెలోకి చొరబడిన విషసర్పం..గాఢ నిద్రలో ఉన్న తల్లి, కూతురిపై దాడి..!
రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటే గానీ గడవని ఆ నిరుపేద కుటుంబంలో రాత్రి ప్రశాంతంగా నిద్రిస్తుండగా పాము రూపంలో మృత్యువు చొరబడింది. విషసర్పం కాటుకు మూడో తరగతి చదువుతున్న ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోగా, తల్లి ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం మల్లుపల్లి గ్రామంలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఆ ఇల్లే ఒక పూరిగుడిసె.. అందులోనీ వాళ్ళు కూలి పనులు చేసుకుంటేనే గాని ఆ కుటుంబానికి గడవదు..రోజంతా కష్టపడి రాత్రి వేళ ప్రశాంతంగా నిద్రిస్తున్న ఆ కుటుంబంలో పాము రూపంలో మృత్యువు చొరబడింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లుపల్లి గ్రామానికి చెందిన పొన్నబోయిన నాగరాజు కూలి పనులు చేసుకుంటూ బతుకులీడుస్తున్నాడు. అతనికి సొంత ఇల్లు కూడా లేకపోవడంతో ఓ చిన్న పూరిగుడిసెలో భార్య లావణ్య, కుమార్తె హారికతో కలిసి నివసిస్తున్నాడు. ఎప్పటిలాగే రాత్రి వేళ కుటుంబ సభ్యులంతా గుడిసెలో నిద్రిస్తున్న సమయంలో ఒక విషసర్పం ఇంట్లోకి చొరబడింది. గాఢ నిద్రలో ఉన్న తల్లి లావణ్యను, పక్కనే ఉన్న కుమార్తె హారికను ఆ పాము కాటేసింది.
అయితే, రాత్రి వేళ కావడంతో పాము కాటు వేసిన విషయాన్ని కుటుంబ సభ్యులు తొలుత పూర్తిగా గుర్తించలేకపోయారు. కొద్దిసేపటికి తల్లి లావణ్యకు తీవ్రంగా రక్తస్రావం కావడంతో గమనించిన భర్త నాగరాజు, ఆమెను వెంటనే నర్సింగ్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో కుమార్తె హారికను కూడా ఆసుపత్రికి తీసుకురావాలని తండ్రి చెప్పినప్పటికీ, చిన్నారి సమీప బంధువుల వద్దే ఉండిపోవడంతో ఆసుపత్రికి తీసుకురావడం ఆలస్యమైంది. అప్పటికే విషం ఒళ్లంతా పాకడంతో చిన్నారి హారిక స్పృహ తప్పిపడిపోయింది. ఆందోళనతో కుటుంబ సభ్యులు హారికను ఆసుపత్రికి తరలించేలోపే ఆ చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
మల్లుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న చిన్నారి హారిక అకాల మృతితో ఆ నిరుపేద కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. కూలి పనులు చేసుకుంటూ, కనీసం సొంత ఇల్లు కూడా లేని నాగరాజు కుటుంబానికి జరిగిన అన్యాయంపై గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పూరిగుడిసెలో నివసిస్తూ సర్వస్వం కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి ప్రభుత్వమే సాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి లావణ్యకు మెరుగైన ఉచిత వైద్యం అందించడంతో పాటు, కుమార్తెను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న నాగరాజు కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు, స్థానిక నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.




