NEET కొత్త పరీక్ష విధానంపై ఇంకా తుది నిర్ణయం కాలేదు.. ఇంకా చర్చలే! సుప్రీంకోర్టుకు కేంద్రం క్లారిటీ
NEET UG 2027 పరీక్షను కంప్యూటర్ ఆధారిత విధానం (CBT)లో నిర్వహించాలా లేదా..? అనే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ఈ అంశాన్ని నందన్ నీలేకని నేతృత్వంలోని నిపుణుల కమిటీ పరిశీలిస్తోందని, కమిటీ సిఫార్సుల ఆధారంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది..

హైదరాబాద్, ఆగస్ట్ 6: NEET UG 2027 నుంచి పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహిస్తారన్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం కీలక స్పష్టీకరణ ఇచ్చింది. ఈ అంశంపై ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్లో వెల్లడించింది. NEET UG 2026 ప్రశ్నాపత్రం లీక్ ఘటన, పరీక్షా సంస్కరణలకు సంబంధించిన పిటిషన్ల విచారణకు ముందు కేంద్రం తన వైఖరిని కోర్టుకు వివరించింది. పరీక్ష విధానంలో మార్పులు చేయాలా వద్దా అనే అంశాన్ని ప్రస్తుతం అన్ని వర్గాలతో చర్చిస్తున్నట్లు తెలిపింది. కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలోని ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ పరీక్షా విధానంలో చేపట్టాల్సిన సంస్కరణలను పరిశీలిస్తోంది. కమిటీ సిఫార్సుల ఆధారంగానే NEET UGను కంప్యూటర్ ఆధారిత పరీక్షగా నిర్వహించాలా లేదా అనే విషయంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.
ప్రస్తుతం రెండు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. ఒకటి ఒకే దశలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (Single-stage CBT) నిర్వహించడం కాగా, మరొకటి JEE తరహాలో రెండు దశల పరీక్ష విధానం అమలు చేయడం. ఇందులో ముందుగా మొదటి దశ పరీక్ష, ఆ తర్వాత అర్హత సాధించిన వారికి రెండో దశ పరీక్ష నిర్వహించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. కేంద్రం అఫిడవిట్లో NEET UG 2027 నుంచి CBT విధానం తప్పనిసరిగా అమల్లోకి వస్తుందనే ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. నిపుణుల కమిటీ నివేదిక సమర్పించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఈ అఫిడవిట్ను ఆగస్టు 6న సుప్రీంకోర్టులో జరగనున్న విచారణకు ముందు దాఖలు చేశారు. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్, యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ తదితర సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టు విచారణ జరపనుంది. 2026 NEET ప్రశ్నాపత్రం లీక్ ఘటన తర్వాత పరీక్షల్లో పారదర్శకత, భద్రత, నిష్పాక్షికత పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది.
గతంలో కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ NEET UGను భవిష్యత్తులో కంప్యూటర్ ఆధారిత పరీక్షగా నిర్వహించే ఆలోచన ఉందని ప్రకటించినప్పటికీ, తాజా అఫిడవిట్ ప్రకారం ఇప్పటికీ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. అందువల్ల NEET అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్లను మాత్రమే విశ్వసించాలని, సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దని కేంద్రం పరోక్షంగా సూచించింది.




