Home Remedies: మందులు అవసరం లేదు..ఈ రసం తిన్నారంటే జలుబు, దగ్గు ఇట్టే మాయం..!
వాతావరణం మారినప్పుడు లేదా వర్షాల సీజన్లో ప్రజలు ఎక్కువగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం బారిన పడుతుంటారు. ఇలాంటి సమయంలో ఇంగ్లీష్ మందుల కంటే ఇంటి నివారణలు, సాంప్రదాయ ఆహారాలు వేగంగా ఉపశమనాన్ని ఇస్తాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పీతల రసం ఒక అద్భుతమైన ఔషధంగా పరిగణించబడుతుంది. పీతల రసం తాగడం వల్ల శరీరానికి ఎలాంటి మేలు జరుగుతుందో డాక్టర్ పద్మిని ఇంటర్నెట్ వేధికంగా వివరంగా పంచుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

వర్షాకాలం లేదా వాతావరణ మార్పుల వల్ల వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలకు పీతల రసం ఒక అద్భుతమైన సాంప్రదాయ నివారణిగా పనిచేస్తుంది. డాక్టర్ పద్మిని ప్రకారం, పీతలలో శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పీతల మాంసంలో లీన్ ప్రోటీన్, జింక్, సెలీనియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఇన్ఫెక్షన్లతో పోరాడే తెల్ల రక్తకణాల ఉత్పత్తిని పెంచుతాయి. రసంలో పీతలను ఉడికించినప్పుడు, వాటిలోని పోషకాలన్నీ రసంలోకి చేరి, శరీరం సులభంగా గ్రహించేలా మారుతాయి.
శ్వాసకోశ సమస్యలకు తక్షణ నివారణ:
పీతల రసం తయారు చేసేటప్పుడు మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, పసుపు వంటి ఘాటైన దినుసులను సమృద్ధిగా ఉపయోగిస్తారు. డాక్టర్ పద్మిని ప్రకారం, ఈ దినుసులు పీతలలోని పోషకాలతో కలిసినప్పుడు ఛాతీలో పేరుకుపోయిన గట్టి కఫాన్ని కరిగించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఇది ముక్కు దిబ్బడ, గొంతు గరగర, పొడి దగ్గు నుండి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.
రోగనిరోధక శక్తి పెంపుదల:
పీతలలో ఉండే జింక్, సెలీనియం రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వైరల్ జ్వరాలు లేదా ఫ్లూ సోకినప్పుడు శరీరం చాలా బలహీనపడుతుంది. ఈ సమయంలో వేడివేడి పీతల రసం తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధీకరించబడి, జ్వరం తీవ్రత తగ్గుతుంది. ఇది శరీరానికి అవసరమైన తక్షణ శక్తిని ఇచ్చి, నీరసాన్ని దూరం చేస్తుంది.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది:
జ్వరం లేదా జలుబు ఉన్నప్పుడు నోటికి రుచి తెలియదు, ఆకలి మందగిస్తుంది. పీతల రసంలోని ఘాటైన రుచి నాలుకకు రుచిని తిరిగి తెప్పిస్తుంది. అలాగే, ఇందులోని జీలకర్ర, వెల్లుల్లి జీర్ణ రసాల ఉత్పత్తిని ప్రేరేపించి జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి.
ఎలా తీసుకోవాలి?:
తాజా పీతలను శుభ్రం చేసి, ఆయుర్వేద మసాలాలతో చేసిన ఈ రసాన్ని వారానికి ఒకటి లేదా రెండుసార్లు వేడివేడిగా సూప్లా తాగవచ్చు లేదా అన్నంలో కలుపుకుని తినవచ్చు. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇది సురక్షితమైనది. ఎంతో ఆరోగ్యకరమైనది.




