SLBC@50 days: 50 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్.. ఇంకా దొరకని ఆరుగురి ఆచూకీ..!
రోజులు గడుస్తున్నాయి.. వారాలు మారుతున్నాయి.. నెలలు పూర్తవుతున్నాయి.. SLBC రెస్క్యూ ఆపరేషన్ మాత్రం కొలిక్కిరావడం లేదు. ఘటన జరిగి 50 రోజులు పూర్తయినా.. ఇంకా ఆరుగురి ఆచూకీ మాత్రం లభించలేదు. మరోవైపు సహాయక బృందాలు అలుపెరగకుండా శ్రమిస్తూనే ఉన్నాయి. మరోవైపు తమ వారి జాడ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాయి బాధిత కుటుంబాలు.

రోజులు గడుస్తున్నాయి.. వారాలు మారుతున్నాయి.. నెలలు పూర్తవుతున్నాయి.. SLBC రెస్క్యూ ఆపరేషన్ మాత్రం కొలిక్కిరావడం లేదు. ఘటన జరిగి 50 రోజులు పూర్తయినా.. ఇంకా ఆరుగురి ఆచూకీ మాత్రం లభించలేదు. మరోవైపు సహాయక బృందాలు అలుపెరగకుండా శ్రమిస్తూనే ఉన్నాయి. మరోవైపు తమ వారి జాడ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాయి బాధిత కుటుంబాలు.
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(SLBC) టన్నెల్లో ఫిబ్రవరి 22న జరిగిన ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. టన్నెల్లో విధులు నిర్వహించడానికి కార్మికులు, ఇంజినీర్లు, మిషన్ ఆపరేటర్లు 50 మంది లోపలికి వెళ్లగా ప్రమాదం జరిగిన వెంటనే అతి కష్టం మీద 42 మంది ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన ఎనిమిది మంది లోపల చిక్కుకుపోయారు. ఘటన జరిగిన గంటల వ్యవధిలోని సహాయక చర్యలు మొదలయ్యాయి. మార్చి 9న పంజాబ్కు చెందిన మిషన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్, మార్చి 25న యూపీకి చెందిన కంపెనీ ఇంజినీర్ మనోజ్ కుమార్ మృతదేహాలను వెలికి తీశారు. మిగిలిన ఆరుగురి కోసం కేంద్ర, రాష్ట్రాలకు చెందిన 12 సంస్థల రెస్క్యూ సిబ్బంది నిరంతరం అన్వేషణ చేస్తున్నారు. 50 రోజులుగా అక్కడే ఉంటూ మృతదేహాలను వెలికి తీయడమే లక్ష్యంగా రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నారు. కానీ ఆరుగురి మృతదేహాల జాడమాత్రం తెలియడం లేదు.
ప్రతి రోజూ మూడు షిఫ్టుల్లో సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రమాదం జరిగిన రోజు నుంచి ఇప్పటివరకు సుమారు 173 మీటర్ల మేర శిథిలాలను తొలగించారు. ఇక మిగిలిన 80 మీటర్ల దూరం ప్రస్తుతం కీలకంగా మారింది. ఈ ప్రాంతంలో ఆరుగురి ఆచూకీ లభించే అవకాశం ఉందని సహాయక బృందాలు అంచనా వేస్తున్నాయి. టన్నెల్లో ప్రమాదం జరిగిన ఫేస్ భాగం నుంచి 43 మీటర్ల దూరంలో డీ1 పాయింట్గా.. అక్కడి నుంచి 20 మీటర్ల దూరంలో డీ2 పాయింట్గా నిర్ధారించారు. అక్కడ ఏర్పాటు చేసిన సిమెంట్ సెగ్మెంట్లలో ఒకటి ఊడి కిందపడగా..మరొకటి వంగిపోయింది. దాంతో అక్కడ పైనుంచి నీటి ఊట వస్తోంది. సిమెంట్ సెగ్మెంట్ లేని ప్రాంతంలో మట్టి, రాళ్లు ఊడిపడే ప్రమాదం ఉండడంతో దానిని నో ఆపరేషన్ జోన్గా ప్రకటించారు. ఆ ప్రాంతం మినహా మిగిలిన ప్రాంతంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి.మరోవైపు టన్నెల్లో కన్వేయర్ బెల్ట్ విస్తరణకు కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ SLBC రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. SLBC సహాయక చర్యలపై ఇటీవల సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి.. ఆచూకీ దొరికే వరకు సహాయక చర్యలు కొనసాగాలన్నారు. నిపుణుల కమిటీ సూచనలతో ఎప్పటికప్పుడు ముందుకు వెళ్లాలని సూచించారు. రెస్క్యూ ఆపరేషన్స్ పర్యవేక్షణ కోసం ఐఏఎస్ శివశంకర్ను ప్రత్యేకాధికారిగా ప్రభుత్వం నియమించింది. మరోవైపు ఈ ప్రమాదంతో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల కొనసాగింపు కూడా సందిగ్ధంలో పడింది.నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ఎస్ఎల్బీసీ టన్నెల్పై ముందుకు వెళ్లాలని భావిస్తోంది ప్రభుత్వం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..