Vikarabad: శిరీష హత్య కేసులో వీడిన మిస్టరీ.. చంపింది ఎవరో చెప్పేసిన ఎస్పీ
Telangana: నర్సింగ్ స్టూడెంట్ శిరీష అనుమానస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. నిజం తేలింది. నిందితుడికి ముసుగు పడింది. వాడి నక్క జిత్తులన్నీ దర్యాప్తులో బయటపడ్డాయి.ఆ నక్క మరెవరో కాదు. శిరీష అక్క భర్త. బాగుకోరాల్సిన బంధువై వుండి .. నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాడు. వాడి కన్నింగ్ స్కెచ్ ఖాకీలను షేక్ చేసింది.

వికారాబాద్ జిల్లా పరిగి మండలం కడ్లాపూర్లో మోకాలి లోతు లేని నీటి కుంటలో శిరీష శవం. ఒంటిపై గాయాలు…కళ్లు పీకేసిన ఆనవాళ్లు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ఆ గ్రామం అంతా ఉలిక్కిపడింది. ఆత్మహత్య కాదు ముమ్మాటికీ హత్యేననే ఆందోళనకు దిగారు కడ్లాపూర్ వాసులు. ఓ దశలో ఆమె కుటుంబసభ్యులపై దాడికి దిగారు. స్థానికుల అనుమానాలే నిజమయ్యాయి. నర్సింగ్ స్టూడెంట్ శిరీష అనుమానాస్పద మరణం వెనుక నిజం తేలింది. గ్రామం గెలిచింది. బావ అనిలే శిరీషను హత్య చేసినట్టు నిర్దారించారు పోలీసులు. నిందితుడు అనిల్ను అరెస్ట్ చేశారు.
సంచలనం రేపిన ఈ కేసును పోలీసులు చాలెంజింగ్గా తీసుకున్నారు. వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి స్వయంగా మానిటర్ చేశారు. స్పాట్ను విజిట్ చేశారు. పక్కా టెక్నికల్ ఎవిడెన్స్తో మిస్టరీ చేధించారు. అక్క భర్త.. సొంత బావ.. శిరీషపై కన్నేశాడు. తన మాట వినలేదని ప్రాణం తీశాడు. ఇంట్లో జరుగుతున్న గొడవలను తనకు అనువుగా మలుచుకున్నాడు.ఆ క్రమంలో శిరీష- అనిల్కు వాగ్వావాదం జరిగింది.ఆ మె ఆత్మహత్యయత్నం చేసింది. ఇంట్లోవాళ్లు అడ్డుకున్నారు. కానీ మనస్థాపం చెందిన శిరీష అదే రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. వెతికే మిషతో శిరీషను వేటాడిన అనిల్ రాక్షసత్వం దర్యాప్తులో వెలుగుచూసింది.
చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు నటించాడు.కానీ పక్కా ఎవిడెన్స్తో నిందితుడు అనిల్ ఆటకట్టించి కటకటాల బాటపట్టించారు పోలీసులు. కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు.
