Adilabad: ఆధునిక యుగంలోనూ ఆదివాసీ గ్రామాల్లో మూఢనమ్మకాలు.. కీడు జరుగుతుందని ఊర్లను ఖాళీ చేస్తోన్న గిరిజనులు

ఆదునిక యుగంలోనూ ఆ ఆదివాసీ గిరిగూడాల్లో మూడనమ్మకాలు కోరలు చాస్తున్నాయి. అపనమ్మకాల దెబ్బకు అక్కడి వారి బంగారు భవిష్యత్తు అర్థాంతరంగా ఆగిపోతోంది. దెయ్యాలు , భూతాలు , ఆత్మలు , ప్రేతాత్మలంటూ విద్యార్థులను బడులకు దూరం చేస్తున్నారు అక్కడి జనాలు‌.

Adilabad: ఆధునిక యుగంలోనూ ఆదివాసీ గ్రామాల్లో మూఢనమ్మకాలు.. కీడు జరుగుతుందని ఊర్లను ఖాళీ చేస్తోన్న గిరిజనులు
Kidney Failure In Adilabad
Follow us

|

Updated on: Nov 05, 2022 | 12:09 PM

చుట్టూ పచ్చని ప్రకృతి.. దట్టమైన అటవి ప్రాంతం.. వందల ఎకరాల సాగు భూమి.. పుష్కలమైన పాడిపంటలు.. ఏ మాయ మర్మం తెలియని గిరిజనం. నిన్నమొన్నటి వరకు ఇదే ప్రకృతి నడుమ కన్నతల్లి లాంటి ఉన్న ఊరిలో హాయిగా బ్రతికేశారు అక్కడి జనం. కానీ సడన్ గా ఏమైందో తెలియదు కానీ ఇప్పుడా ఊరు వరుస మరణాలతో ఉక్కిరి బిక్కిరవుతోంది. తెల్లవారిదంటే చాలు ఏదో ఒక ఇంట్లో చావు కేక. ఇక్కడే ఉంటే మా ప్రాణాలు కూడా పోతాయని భయాందోళనలతో బతుకు జీవుడా అంటూ వలస వెళ్లిపోతోంది అక్కడి గిరిజనం. ఇంతకీ ఆ గిరిజన గ్రామంలో ఏం జరుగుతోంది. అక్కడ వరుస మరణాలకు కారణం ఏంటి. శ్మశాన వైరాగ్యం లా మారుతున్న ఆ ఆదివాసీ గ్రామం వెనుకున్న అసలు నిజమేంటనేది తెలుసుకునే ప్రయత్నం చేసింది టీవీ 9.

ఏదో తెలియని భయం ఆ ఊరిని పట్టి పీడిస్తోంది‌. రాత్రయిందంటే చాలు ఊరు ఊరంతా వింత శబ్దాలు.. తెల్లవారిదంటే చాలు ఏదో ఒక ఇంట్లో అనారోగ్యంతో మంచాన పడుతున్న ఇంటి పెద్దలు. వైద్యం అందే లోపే మృత్యు ఒడిలోకి.. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇంటికొక్కరుగా రెండేళ్ల కాలంలో 12 మంది మృతి.. ఆరునెలల వ్యవదిలో ఆరుగురు మృతి.. ఇది ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం కమట్వాడ గ్రామపంచాయితీ పరిదిలోని గోవిందాపూర్ ఏజేన్సీ గ్రామ పరిస్థితి. మూడేళ్ల క్రితం వరకు ఈ గ్రామంలో అంతా బాగానే ఉంది.. కానీ‌సడన్ గా వరుస మరణాలు గోవిందపూర్ గ్రామాన్ని వెంటాడాయి.. అలా మూడేళ్ల నుండి ప్రారంభమైన చావు కేక గోవింద్ పూర్ లో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. అసలింతకీ ఆ చావుల వెనుకున్న కారణం ఏంటి.

గోవిందాపూర్ ఐదు దశాబ్దాల క్రితం ఏర్పడిన గ్రామం.. ఇక్కడ పాడిపంటలకు కొరత లేదు. కరువన్నది ఈ గ్రామం చూడలేదు. సాగుకు యోగ్యమైన భూములు.. అంత ప్రశాంత వాతవరణంలో జీవనం సాగించే గిరిజనులను మరణం వెంటాడింది. ఆ మరణానికి కారణం కిడ్నీ భూతమని ఆలస్యంగా తెలిసింది. కానీ అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. వరుస మరణాలకు కారణం దెయ్యాలు , భూతాలని.. ఊరికి కీడు చేసిందని ఊరు లో ఉంటే ప్రాణాలు మిగలవనే భయంతో పెట్టా బేడా సర్దేసుకుని పక్క గ్రామాలకు వలస బాట పట్టింది గోవిందా పూర్. కానీ ఈ వరుస మరణాలకు కారణం తాగునీళ్లే అని కొందరు ఆరోపించినా ఇక్కడే ఉండేదుకు ఊరు జనం మాత్రం ఒప్పుకోలేదు. ఈ ఊర్లో చనిపోయిన వారంతా కిడ్నీ సమస్యతోనే అనారోగ్యానికి గురై అకాల మృత్యువాత పడ్డారని తెలుస్తోంది. ఇంటికొకరుగా కిడ్నీ సమస్యతో చనిపోగా ప్రస్తుతం మరప వినోద్ అనే వ్యక్తి కిడ్నీ సమస్యతో కొట్టుమిట్టాడుతుండగా.. ఈ కిడ్నీ సమస్యలకు ఇక్కడి తాగు నీళ్లే కారణం అంటున్నారు గోవిందాపూర్ వాసులు.

ఇవి కూడా చదవండి

ఇప్పటి వరకు 25 కుటుంబాలు ప్రాణభయంతో పక్కనే ఉన్న అటవి ప్రాంతంలోని జెండా గూడాకు వలస వెళ్లిపోయాయి. తాజాగా మరప వినోద్ అనే వ్యక్తి కిడ్నీ వ్యాధి బారీన పడగా.. అతనిని కాపాడుకునేందుకు తన తల్లి పూలబాయి అష్టకష్టాలు పడుతోంది. ఇప్పటికే ఇదే ఇంట్లో కిడ్నీ వ్యాదితో ఓ మరణం చోటు చేసుకోగా ఇప్పుడు కొడుకు వినోద్ అయినా దక్కుతాడో లేడో అని ఆందోళన చెందుతోంది. ఈ కిడ్నీ సమస్యలకు ఇక్కడి నీరే కారణం అని బావిస్తున్నారు కొందరు గ్రామస్తులు. అయితే నీటిలో ఎలాంటి సమస్య లేదని అదికారులు తెలుపడంతో అసలు సమస్య ఏంటో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. గోవింద పూర్ వాసుల్లో జెన్యూపరంగా, వారసత్వంగా కిడ్నీ వ్యాధి వచ్చి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే కిడ్నీ సమస్యకు అసలు కారణం తెలియక పోవడంతో గిరిజన మూడనమ్మకాలకు మరింత బలం చేకూరినట్టవుతోంది. గతంలో ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం అంబుగావ్ గ్రామపంచాయితీ పరిదిలోని మారుమూల గిరిజన గ్రామం బేతాల్ గూడలో కూడా ఇలాంటి పరిస్థితే కనిపించింది.

ఏదో తెలియని మాయదారి భూతం తమని మింగేస్తుందనే మూడనమ్మకంతో.. కేవలం మగవాళ్లు మాత్రమే చనిపోతుండటంతో.. ఊరుకి ఏదో కీడు జరుగుతుందన్న భయంతో గతంలో బేతాల్ గూడ గిరిజనులు గ్రామాన్ని వదిలి వెళ్లారు. సీన్ కట్ చేస్తే ప్రస్తుతం గోవిందా పూర్ లోను సేమ్ సీన్. బేతాల్ గూడాలో చావుల వెనుక జన్యు లోపం కారణమని అదికారులు తేల్చి మెరుగైన వైద్య చికిత్సలు అందించడంతో అక్కడి ప్రజలు వెనక్కి వచ్చినా.. గోవింద్ పూర్ గ్రామస్తులు మాత్రం ఈ ఊర్లో ఉండలేమంటూ ఖరాఖండిగా చెపుతున్నారు. గోవిందా పూర్ లో 42 కుటుంబాలు నివసిస్తుండగా.. ఇప్పుడు ప్రాణభయంతో వలస వెళ్లిన కుటుంబాలను వదిలేస్తే కేవలం 12 కుటుంబాలు మాత్రమే ఊర్లో మిగిలాయి. ఆ 12 కుటుంబాల్లో మూడు కుటుంబాలే ఊరిలో రాత్రి వేళ ఉంటున్నాయి.

ఆదునిక యుగంలోనూ ఆ ఆదివాసీ గిరిగూడాల్లో మూడనమ్మకాలు కోరలు చాస్తున్నాయి. అపనమ్మకాల దెబ్బకు అక్కడి వారి బంగారు భవిష్యత్తు అర్థాంతరంగా ఆగిపోతోంది. దెయ్యాలు , భూతాలు , ఆత్మలు , ప్రేతాత్మలంటూ విద్యార్థులను బడులకు దూరం చేస్తున్నారు అక్కడి జనాలు‌. వరుస మరణాలకు కారణం వెతక్కుండా ఊరికి శని పట్టిందని.. ఏదో కీడు చేసిందనే అనుమానంతో పచ్చని పొలాలు.. కన్నతల్లి లాంటి ఊరిని వదిలేసి వలస వెళ్లిపోతోంది ఆదివాసీ జనం.

దేవుడు ఉన్నాడన్నది ఎంత నిజమో దెయ్యం ఉందన్నది కూడా అంతే నిజమంటూ వేదాలు వల్లిస్తున్నాయి ఆదిలాబాద్ లో కొన్ని ఆదివాసీ గ్రామాలు‌. ఆత్మలు ప్రేతాత్మలు అంటూ పిల్లలను బడులకు దూరం చేస్తున్నాయి. తాజాగా జరిగిన ఘటనలే అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి‌. బెబ్బులి ఎదురు పడ్డా జంకని గిరి జనం.. చిన్న అలికిడికే ఇప్పుడు గజగజావణికిపోతోంది. చిమ్మ చీకట్లోను ఒంటరిగా మైళ్ల దూరం నడిచే ఆ జనం చీమ చిటుక్కుమన్న భయంతో హడలెత్తిపోతోంది. కారణం మరణ భయం. గోవిందాపూర్ లో వరుస మరణాలతో గ్రామాన్ని వదిలి వెళ్లిపోతున్న విషయం తెలుసుకున్న అదికారులు హుటాహుటిన గ్రామాన్ని సందర్శించారు. తాగినీటి కారణంగానే కిడ్నీ వ్యాది వ్యాపిస్తుందని గ్రామస్తులు తెలుపడంతో ఆర్‌డబ్ల్యుఎస్‌ ఏఈ చంద్రశేఖర్‌ బోర్లలో నీటి షాంపుల్‌ను సేకరించారు. వైద్యాధకారి డా.విజయసారథి కిడ్నీ వ్యాధి సమస్యలకు మేనరికాలు, పెయిన్‌కిల్లర్‌ వాడకం కూడా ఓ కారణమని.. అందరికి మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. మూఢ నమ్మకాలకు దూరంగా ఉండాలని ఊరును వదిలి వెళ్లవద్దని కోరారు. అదికారులు ఎంత అవగాహన కల్పించినా మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని , మెరుగైన వైద్యం అందిస్తామని అభయం ఇస్తున్నా గోవిందాపూర్ గ్రామస్తులు మాత్రం ససేమిరా అంటున్నారు. కారణం మరణం.. మరణ భయాన్ని మించిన భయం మరొక్కటుంటుందా. రోగాల భారీన పడి సరైన చికిత్స అందక పోతే ఏ ఊరికి వెళ్లినా చావు తప్పదు అన్నది అదికారుల మాట. ఇక్కడి నీటిని టెస్టులకు పంపా త్వరలోనే పూర్తి రిపోర్ట్ వస్తాయని‌ అంత వరకైనా ఓపిక పట్టండి అని విజ్ఞప్తి‌ చేస్తున్నారు అదికారులు.

Reporter: Naresh, TV9 Telugu

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..