Warangal: ప్రభుత్వాసుపత్రిలో నాగు పాము ప్రత్యక్షం.. పరుగులు పెట్టిన పేషేంట్స్.. ప్రక్షాళన చేపట్టిన సిబ్బంది

ఎంజీఎం సూపరింటెండెంట్ ఆస్పత్రి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు.. వైద్యులు, సిబ్బంది అంతా కలిసి ఎంజీఎం పరిసరాలను శుభ్రం చేశారు..ఎలుకలు, పాములకు పాములకు ఆవాసంగా ఉన్న పుట్టలు, వేస్టేజ్ తొలగించారు.. కానీ పాముల నుంచి మాత్రం విముక్తి లభించలేదు..

Warangal: ప్రభుత్వాసుపత్రిలో నాగు పాము ప్రత్యక్షం.. పరుగులు పెట్టిన పేషేంట్స్.. ప్రక్షాళన చేపట్టిన సిబ్బంది
Snakes In Mgm Hospital
Follow us

|

Updated on: Oct 24, 2022 | 6:52 AM

పేదల పెద్దాసుపత్రి వరంగల్ లోని ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని విషసర్పాలు పగ పట్టాయి..ఏకంగా వార్డుల్లోకి ప్రవేశించి రోగులను పరుగులు పెట్టిస్తున్నాయి.. పది రోజుల వ్యవధిలో రెండుసార్లు తాచు పాములు ప్రత్యక్షమవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఆసుపత్రి సూపరింటెండెంట్ తో సహా, వైద్యులు, సిబ్బంది అంతా కలిసి విష పురుగుల ప్రక్షాళనకు నడుం బిగించినా ఎలుకలు, పాముల నుంచి మాత్రం విముక్తి లభించక పోవడం కలవర పెడుతోంది.

వరంగల్‌ ఎంజీఎంలో పాములు, రోగులను కలవరపెడుతున్నాయి. ఒకే నెలలో రెండుసార్లు పాములు ప్రత్యక్షం కావడంతో రోగులతో పాటు వారి బంధువులు కూడా హడలిపోతున్నారు. దీంతో ఆసుపత్రిలో వైద్యులు, అధికారులు సహా ఇప్పుడు అంతా విష పురుగుల ప్రక్షాళన మొదలు పెట్టారు.

అక్టోబర్ 13వ తేదీన ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు.. ఫీవర్ వార్డులోని టాయిలెట్స్ లో తాచు పాము ప్రత్యక్షమైంది. ఈ పామును చూసి హడలెత్తిపోయిన రోగులు, వారి బంధువులు పరుగులు తీశారు.. ఆస్పత్రి సిబ్బందికి సమాచారం ఇచ్చారు.. ఈ క్రమంలో వెంటనే స్పందించిన ఆస్పత్రి సిబ్బంది పాములు పట్టే వ్యక్తిని రంగంలోకి దింపి ఆ పామును ప్రాణాలతో పట్టుకున్నారు.. దీంతో రోగులు, వారి బంధువులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు..

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత సీరియస్ గా స్పందించిన ఎంజీఎం సూపరింటెండెంట్ ఆస్పత్రి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు.. వైద్యులు, సిబ్బంది అంతా కలిసి ఎంజీఎం పరిసరాలను శుభ్రం చేశారు..ఎలుకలు, పాములకు పాములకు ఆవాసంగా ఉన్న పుట్టలు, వేస్టేజ్ తొలగించారు.. కానీ పాముల నుంచి మాత్రం విముక్తి లభించలేదు..

ఆదివారం సాయంత్రం మరో పాము ప్రత్యక్షమైంది.. న్యూరో వార్డులో ఓ తాచుపాము ప్రత్యక్షమైంది.. బెడ్ కింద పామును గుర్తించిన రోగి బంధువులు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న ఆస్పత్రి సిబ్బంది మరోసారి పాములు పట్టె వ్యక్తిని రంగంలోకి దించారు.. వెంటనే ఆ పామును పట్టి అడవిలో వదిలేశారు.

గతంలో ఎలుకలు హల్ చల్ చేశాయి.. ఎలుకల నివారణకు ఎంజీఎం సూపరింటెండెంట్ శాశ్వత నివారణ చర్యలు చేపట్టారు.. ఎలుకల నుండి విముక్తి లభించిందని అంతా ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ఇప్పుడు పాములు పరేషాన్ చేస్తున్నాయి.

ఎలుకలు, పాముల కలకలంపై ఆస్పత్రి పరిపాలన విభాగంలో తీవ్ర చర్చ మొదలైంది. అతి పురాతన భవనాలు.. చుట్టూ చెత్త.. పక్కనే మున్సిపాలిటీ మురికి కాలువ.. అటు పక్కనే మార్చురీ.. మరోవైపు పేషేంట్స్ అటెండెంట్స్ విచ్చలవిడిగా వదిలేసే ఆహారపు వ్యర్థాలే విష పురుగుల స్వైరవిహారానికి కారణమని భావిస్తున్నారు. ఎంజీఎం ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నప్పటికీ ఇలాంటి విష పురుగుల అప్రతిష్ట పాలు చేస్తున్నాయి.. అయితే ఆసుపత్రిలో విష పురుగుల ప్రక్షాళనకు నడుం బిగించిన అధికారులు ఎలాంటి నష్ట నివారణ చర్యలు చేపడతారో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..