AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క కాల్… ఐదు నిమిషాల స్పందన… ఓ కుటుంబంలో మళ్లీ వెలుగు..!

అత్యవసర పరిస్థితుల్లో ప్రతి సెకను విలువైనదే. ఆ క్షణాలను సరిగ్గా సమయస్ఫూర్తితో వినియోగించుకుంటే ప్రాణాలు నిలుస్తాయి. ఐదు నిమిషాల ఆలస్యం జరిగి ఉంటే... ఒక కుటుంబం శాశ్వతంగా చీకటిలో మిగిలిపోయేది. ఒక్క డయల్-100 కాల్... ఆ వెంటనే మెరుపు వేగంతో స్పందించడం, సమయ స్ఫూర్తితో తీసుకున్న నిర్ణయం... చివరకు ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది. డయల్-100 కేవలం ఒక నంబర్ కాదని... అత్యవసర సమయంలో ప్రాణాలకు భరోసా అని పోలీసులు చాటి చెప్పిన ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఏ స్టోరీ చదవాల్సిందే.

ఒక్క కాల్... ఐదు నిమిషాల స్పందన... ఓ కుటుంబంలో మళ్లీ వెలుగు..!
Adimulam Srinivas
M Revan Reddy
| Edited By: |

Updated on: Aug 03, 2026 | 3:16 PM

Share

ఒక అత్యవసర ఫోన్ కాల్.. కేవలం ఐదు నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు.. క్షణం కూడా ఆలస్యం చేయకుండా తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లడం.. ఉరివేసుకున్న వ్యక్తిని గుర్తించి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడడం.. నల్లగొండ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఓ పోలీసు సమయస్ఫూర్తి ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని తప్పించింది. హెడ్ కానిస్టేబుల్ చూపిన ధైర్యం, వేగవంతమైన స్పందన ఇప్పుడు స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది.

నల్లగొండ జిల్లా చండూరు మండలం ఉడతలపల్లి గ్రామంలో భార్యాభర్తల మధ్య తీవ్ర గొడవ జరుగుతోందంటూ డయల్-100కు అత్యవసర సమాచారం అందింది. ఆ సమయంలో చండూరు పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ ఆదిమూలం శ్రీనివాస్ విధుల్లో ఉన్నారు. కాల్ తీవ్రతను అర్థం చేసుకున్న ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి బయలుదేరారు.

సుమారు ఐదు నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్న శ్రీనివాస్ ఇంటి పరిస్థితిని పరిశీలించారు. ఇంటి తలుపులు మూసి ఉండటంతో పాటు లోపల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుమానం వ్యక్తం చేశారు. పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారిందని భావించిన ఆయన వెంటనే తలుపులను బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించారు.

లోపలికి వెళ్లి చూడగా ఓ వ్యక్తి ఉరివేసుకుని అపస్మారక స్థితిలో కనిపించాడు. ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా వెంటనే ఉరిని తొలగించిన హెడ్ కానిస్టేబుల్, బాధితుడికి అక్కడికక్కడే సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) అందించారు. కొద్దిసేపటికే బాధితుడిలో స్పందన కనిపించడంతో వెంటనే అంబులెన్స్ సాయంతో సమీప ఆసుపత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించడంతో అతని ప్రాణాలు దక్కాయి.

పోలీసు అధికారి చూపిన సమయస్ఫూర్తి లేకపోయి ఉంటే పరిస్థితి విషాదంగా మారేదని స్థానికులు చెబుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఒక్క నిమిషం కూడా ఎంత విలువైనదో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.

హెడ్ కానిస్టేబుల్ ఆదిమూలం శ్రీనివాస్ చేసిన సాహసోపేత చర్యలపై గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు ప్రశంసలు కురిపిస్తున్నారు. యూనిఫాం ధరించిన పోలీసులు కేవలం నేరాలను అరికట్టడమే కాకుండా, అవసరమైన సమయంలో ప్రాణాలను కాపాడే నిజమైన రక్షకులని ఈ ఘటన మరోసారి నిరూపించిందని కొనియాడుతున్నారు.

ప్రజల నుంచి వచ్చే ప్రతి అత్యవసర సమాచారాన్ని అత్యంత బాధ్యతగా తీసుకుని, క్షణాల్లో స్పందిస్తే ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చని ఈ సంఘటన స్పష్టం చేసింది. పోలీసుల అప్రమత్తత, సేవాభావం, మానవత్వానికి ఈ ఘటన నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us