నానమ్మను చూసేందుకు వచ్చి.. తిరిగిరాని లోకాలకు ముగ్గురు చిన్నారులు..
నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నానమ్మను పరామర్శించేందుకు వచ్చిన ముగ్గురు చిన్నారులు ముచ్చర్లపల్లిలోని వ్యవసాయ నీటి గుంతలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. ఆడుకుంటుండగా బంతి గుంతలో పడటంతో దానిని తీసేందుకు వెళ్లి ఈ దుర్ఘటన జరిగింది. ఓ చిన్నారిని రక్షించగా, మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నానమ్మ ఆరోగ్యం బాగోలేదని చూసేందుకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు నీటి గుంతలో పడి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టించింది. ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి హైదరాబాద్ లోని తుర్కయాంజల్ లో నివాసం ఉంటున్నారు. శ్రీకాంత్ రెడ్డి తల్లి అనారోగ్యంగా ఉండడంతో కుటుంబంతో సహా నిన్న స్వగ్రామం ముచ్చర్లపల్లికి వచ్చాడు.
ఆదివారం సెలవుదినం కావడంతో మధ్యాహ్నం తమ వ్యవసాయ పోలం వద్దకు పిల్లలతో సహా వెళ్లారు. వారితో పాటు శ్రీకాంత్ రెడ్డి అక్క కుటుంబం సైతం అక్కడికి వచ్చారు. పెద్దలు పొలాలను పరిశీలిస్తు మాట్లాడుకుంటుండగా పిల్లలు అందరూ అక్కడే బంతితో ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో బంతి వ్యవసాయం కోసం తీసిన నీటి గుంతో పడిపోయింది. నీటిలో పడిన బంతిని తీసుకువచ్చేందుకు ముగ్గురు చిన్నారులు శ్రీమాన్య రెడ్డి, శ్రీకృతి (12), స్నేహ(15), విద్యాధరణి రెడ్డి వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు నీటి గుంతలో మునుగుతుండడంతో పిల్లల అరుపులు కేకలు విని కుటుంబ సభ్యులు వారిని కాపాడే ప్రయత్న చేశారు.
విద్యాధరణి రెడ్డిని సురక్షితంగా కాపాడగా మిగతా ముగ్గురు చిన్నారులో నీట మునిగి మృత్యువాత పడ్డారు. శ్రీకాంత్ రెడ్డి ఇద్దరు పిల్లలు చనిపోగా, అక్క కూతురు సైతం ప్రాణాలు కోల్పోయింది. ఘటనతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారుల మరణ వార్తతో ముచ్చర్లపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




