మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్ నిర్మాణం..
మేడారం సమ్మక్క సారక్క జాతర 2026కు టెంపుల్ సిటీగా మారిపోయింది. అధునాతన గ్రానైట్ నిర్మాణాలు, విశాలమైన రోడ్లు, సెంటర్ లైటింగ్ తో మేడారం కొత్త శోభను సంతరించుకుంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ నెల 19న ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన ఈ గిరిజన జాతర భక్తులను ఆశ్చర్యపరచనుంది.

వనదేవతలు సమ్మక్క సారలమ్మలు కొలువుతీరిన మేడారం ఇప్పుడు పూర్తిగా సరి కొత్త రూపుదిద్దుకుంది.. ఆ పల్లె టెంపుల్ సిటీగా రూపాంతరం చెందింది. యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన గ్రానైట్ నిర్మాణాలు, రోడ్ల విస్తరణ, సెంటర్ లైటింగ్, అద్భుతమైన కూడళ్లు, శాశ్వత ప్రాతిపదికన జరుగుతున్న నిర్మాణాలతో మేడారం చూపరులను మైమరిపిస్తుంది.. భక్తులు నివ్వెర పోయేలా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నెల 19న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయమన్నారు..పూర్తి వివరాల్లోకి వెళితే…
2026 మేడారం మహాజాతర జనవరి 28 నుండి 31 వరకు జరగనుంది.. మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెల్లో సమ్మక్క సారక్క దేవతలతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజుల ప్రతిరూపాలు గద్దెల పైన కొలువుదీరే ఘడియలు ఆసన్నమవుతున్నాయి.. అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక మంత్రి సీతక్క రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రత్యేక చొరవతో మేడారం ఇప్పుడు కొత్త రూపొందించుకుంది.
తెలంగాణ కుంభమేళాగా ప్రత్యేక గుర్తింపు పొందిన మేడారం జాతర రెండేళ్లకోసారి జరుగుతుంది.. జాతర సమయంలో ఎంత రద్దీ ఉన్నాసరే.. తండోపతండాలుగా తరలివచ్చి భక్తులు సమ్మక్క సారక్క దేవతలను దర్శించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుంది.. తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతరకి ఆసియా ఖండంలోని ఒక ప్రత్యేకత ఉంది. ఇది దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధిగాంచింది..
అయితే ఈసారి జాతరకు వచ్చే భక్తులు మేడారంలో అడుగుపెట్టగానే వాహ్ అని నివ్వేరబోయేలా నిర్మాణాలు చేపట్టారు.. ఊరట్టం సర్కిల్ నుండి మొదలుకొని జంపనవాగు మీదుగా గద్దెల వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టారు.. సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేశారు.. మధ్య మధ్యలో ప్రత్యేక జంక్షన్స్ నిర్మాణం చేపట్టి అక్కడ అద్భుతమైన నిర్మాణాలతో ఆశ్చర్య పరుస్తున్నారు..ఇటు తాడ్వాయి వైపు నుండి వచ్చే భక్తులు కూడా అడుగడుగునా ఆశ్చర్యపోయేలా ఆదివాసి ఆచార సాంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్మాణాలు చేపట్టారు.. తాడ్వాయిలో నిర్మించిన స్వాగత తోరణం వద్ద ఆదివాసీల నృత్య సాంప్రదాయ చిత్రాలు అబ్బురపరుస్తున్నాయి..
ఇవన్నీ ఒకెత్తయితే గద్దెల ప్రాంగణం పూర్తిగా గ్రానైట్ తో కొత్త రూపుదిద్దుకుంది.. 8 ప్రధాన ద్వారాలు , వాటికి అమర్చిన 16 భారీ పిల్లర్స్ , వాటి పైన నిర్మించిన చిత్రలిపి అట్టే మనసును కట్టిపడేస్తుంది.. ఇక్కడ ఉపయోగించిన గ్రానైట్ పూర్తిగా ఆళ్లగడ్డలో సేకరించారు.. అక్కడి శిలలకు శిల్పాలతో కొత్త రూపం తెచ్చి అక్కడినుండి భారీ కంటైనర్ల ద్వారా ఇక్కడికి గ్రానైట్ తరలించారు.. సుమారు 2000 మంది కార్మికులు నిర్విరామంగా శ్రమించి మేడారంకు కొత్త రూపుదిద్దారు..
ఇక గద్దెల ప్రాంగణం ఇప్పటికే పూర్తిగా ఆధునికరించారు.. వరుస క్రమంలో సమ్మక్క, సారక్క పగిడిద్దరాజు , గోవిందరాజు గద్దెల నిర్మాణం పూర్తిగా గ్రానైట్ తో చేపట్టారు.. గద్దెల లోపలికి జాతర సమయంలో భక్తులు వెళ్లకుండా చుట్టూ రాతెండి గ్రిల్స్ తో నిర్మాణం చేపట్టారు.. చుట్టూ పచ్చని చెట్లు, ఆదివాసీలకు గొట్టు గోత్రాలకు సంబంధించిన మొక్కలు నాటారు.
వీడియో ఇక్కడ చూడండి..
గద్దెల ప్రాంగణం నిర్మాణంలో సుమారు 4వేల టన్నుల గ్రానైట్ ఉపయోగించారు.. ఈ గ్రానైట్ పైన ఆదివాసీల ఆచార సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఏడు వేలకు పైగా చిత్రలిపి చేసి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచేలా నిర్మాణాలు చేపట్టారు.. ఇప్పటికే గద్దెల ప్రాంగణంలో నిర్మాణాలు పూర్తి అయిపోయాయి.. ఈనెల 19వ తేదీన ఈ నిర్మాణాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి జాతరకు అంకురార్పణ చేయనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




