KTR: “కేసులకు భయపడం.. BRSకు పటిష్టమైన లీగల్ సెల్ ఉంది”
కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు కేటీఆర్. BRSను లేకుండా చేయడం ఎవరి వల్ల కాదని కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎప్పటివరకు అమలు చేస్తారో చెప్పాలన్నారు కడియం శ్రీహరి.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్కు పటిష్టమైన లీగల్ సెల్ ఉందని.. తప్పుడు కేసుల భాదితులకు పార్టీ లీగల్ సెల్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కేసులకు భయపడేది లేదని.. తప్పుడు కేసులను ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సీరియస్గా తీసుకుని పోరాడాలన్నారు. ఒక బీఆర్ఎస్ ఎంపీపీపై కేసు పెడితే మిగిలిన బీఆర్ఎస్ ఎంపీపీలు స్పందించాలన్నారు. ఎక్కడికక్కడ సమష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. కేసుల తీవ్రతను బట్టి రాష్ట్ర నాయకత్వం స్పందిస్తుందన్నారు కేటీఆర్.
మరోవైపు అసెంబ్లీ ఫలితాలతో ఢీలా పడ్డ శ్రేణులను ఉత్తేజపరిచే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ హైకమాండ్. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పక్కనపెట్టి… పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టి విజయం దిశగా పనిచేయాలని దిశానిర్దేశం చేస్తున్నారు అగ్ర నాయకులు. బీఆర్ఎస్ను ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదనే విషయం గుర్తుంచుకొని ముందుకు సాగాలన్నారు కేటీఆర్. ప్రజలను వంచించాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి సినిమా ఇంకా మొదలు కాలేదు, ఆసలు సినిమా ముందుందని హెచ్చరించారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ తన రక్తాన్ని రంగరించి.. చెమటను ధారపోసి వికాసం వైపు మళ్లించారని గుర్తుచేసారు. ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తే గట్టిగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు కేటీఆర్.
లోక్ సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్
లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా ముఖ్యనేతలతో ప్రతి రోజు సమావేశాలు జరగుతున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఈ సమీక్షలు కొనసాగుతున్నాయి. వరంగల్ లోక్సభ సెగ్మెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
చిన్న పొరపాట్ల వల్ల అధికారం కోల్పోయామన్నారు స్టేషన్ ఘన్పూర్ BRS ఎమ్మెల్యే కడియం శ్రీహరి. అన్ని అంశాలపై సమీక్ష చేసుకుని ముందుకు సాగుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను ఎప్పటివరకు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
MCHRDలో సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాల వారీగా కాంగ్రెస్ నేతలతో సమీక్ష చేయడం సరికాదన్నారు కడియం శ్రీహరి. గతంలో ప్రగతి భవన్లో పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నామని ఫిర్యాదు చేశారని, ఇప్పుడు మీరు ఎలా MCHRDలో పార్టీ సమావేశాలు పెడుతారని ప్రశ్నించారు.
రిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..