Krishna Water: ముదురుతున్న జలజగడం.. దమ్మెత్తిపోసుకుంటున్న తెలుగురాష్ట్రాల మంత్రులు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జలజగడం.. మరింత ముదురుతోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు.. అంతకు మించిన విమర్శలు చేసుకుంటూ.. పొలిటికల్ ఎసరు కాస్తున్నారు.
Updated on: Jun 28, 2021 | 8:23 PM

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జలజగడం.. మరింత ముదురుతోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు.. అంతకు మించిన విమర్శలు చేసుకుంటూ.. పొలిటికల్ ఎసరు కాస్తున్నారు. నిన్నటి వరకూ పరస్పర సహకారంతో ముందుకు సాగుతామన్న ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు.. ఇప్పుడు కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. మీరు దోచుకుంటున్నారంటే మీరేనంటూ ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు.

కృష్ణానదిపై రాయలసీమ ప్రాజెక్టు నిర్మాణం ఆపాల్సిందేనని తెలంగాణ పట్టుబడితే.. శ్రీశైలంలో నిర్ణీత నీటిమట్టం లేకపోయినా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని ఏపీ గగ్గోలుపెడుతోంది. ఉత్పత్తి నిలిపివేయాలంటూ కృష్ణా నదీ యాజమాన్యపు బోర్డుకు ఏపీ లేఖలు రాసింది.

Minister Anil Kumar Yadav


ఇదిలా కొనసాగుతుండగానే ఏపీ సీఎం వైఎస్ జగన్ చెల్లెలు.. వైఎస్ షర్మిల చేసిన ఓ ట్వీట్ హాట్ టాపిక్గా మారింది. తెలంగాణకు సంబంధించిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకునేది లేదని స్పష్టం చేశారు. దీని కోసం ఎవరితోనైనా.. ఎంతటి వారితో అయినా.. పోరాటానికి సిద్ధమన్నారు షర్మిల.

ఏపీ సీఎం జగన్కు స్నేహ హస్తం అందిస్తే తమ చెంప మీద కొడుతున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి అన్నారు. డెడ్ స్టోరేజీ నుంచి నీటిని తరలించాలనుకోవడం దుర్మార్గమన్నారు. తెలంగాణ ఉద్యమానికి భయపడి మొదలుపెట్టిన ప్రాజెక్టును చిత్తశుద్ధితో ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.

శ్రీశైలానికి ఎడమ వైపు తెలంగాణ... కుడి వైపు రాయలసీమ. రెండు వైపులా ఈ కృష్ణా నీళ్లే కీలకం. రెండు ప్రాంతాలకు తాగు, సాగునీటికి శ్రీశైలమే ఆధారం. వరదలు వచ్చినప్పుడు ఏ సమస్యా ఉండదు. ఎవరికి ఎంత కావాలన్నా వాడుకోవచ్చు. నీటి ప్రవాహలు తగ్గినప్పుడే అసలు సమస్య. అదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య అగ్గి రాజేస్తోంది.

ఈ వ్యవహారం కేంద్ర జలశక్తి శాఖ దగ్గరకు కూడా వెళ్లింది. NGT సీరియస్ అయింది. దీంతో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై సర్వేకు సిద్ధమవుతోంది కృష్ణా బోర్డు. ఈలోపు రెండు వైపులా మంత్రుల కామెంట్లు మరింత హీట్ను పెంచుతున్నాయి.
