Telangana: పైకి కుస్తీ.. లోలోపల దోస్తీ..! ఆ పార్టీల మధ్య రహస్య ఒప్పందం జరిగిందా..? ఎన్నికల వేళ దుమ్ముదుమారం..
తెలంగాణలో లోక్సభ ఎన్నికల వేళ పార్టీల మధ్య రహస్య ఒప్పందాలు జరిగాయా? పైకి కుస్తీ పడుతూనే లోలోపల దోస్తీ కట్టాయా? ఇదే విషయంపై టీవీ9 బిగ్ డిబేట్లో ఆసక్తికర చర్చ జరిగింది. బీఆర్ఎస్ ఆరోపణలకు కాంగ్రెస్, బీజేపీలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాయి. ఇంతకీ గులాబీ ముళ్లు గుచ్చుకున్నదెవరికి? మెచ్చుకోలు ఎవరికి? అనేది.. చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణలో లోక్సభ ఎన్నికల వేళ పార్టీల మధ్య రహస్య ఒప్పందాలు జరిగాయా? పైకి కుస్తీ పడుతూనే లోలోపల దోస్తీ కట్టాయా? ఇదే విషయంపై టీవీ9 బిగ్ డిబేట్లో ఆసక్తికర చర్చ జరిగింది. బీఆర్ఎస్ ఆరోపణలకు కాంగ్రెస్, బీజేపీలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాయి. ఇంతకీ గులాబీ ముళ్లు గుచ్చుకున్నదెవరికి? మెచ్చుకోలు ఎవరికి? అనేది.. చర్చనీయాంశంగా మారింది. అసలే ఎన్నికల సీజన్.. ఏ చిన్న అవకాశం దొరికినా క్యాష్ చేసుకునేందుకు పార్టీలు తహతహలాడుతున్నాయి. గల్లీలో ఉండే సమస్యల నుంచి ఢిల్లీ నుంచి రావాల్సిన నిధుల వరకు.. ప్రస్తావనలు, విమర్శలు, పంచ్ డైలాగ్లు పేలిపోతున్నాయి. ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టేలా చాకచాక్యంగా వ్యవహరిస్తున్నాయి.
ఎవరి ధీమా వారిదే..
తెలంగాణలో ప్రస్తుతం ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయంతో అధికారం చేపట్టిన కాంగ్రెస్.. లోక్సభ సమరంలోనూ సేమ్ సీన్ రిపీట్ చేయాలని భావిస్తోంది. బీఆర్ఎస్ మాత్రం ఎక్కడ పోగోట్టుకున్నామో అక్కడే రాబట్టుకోవాలని కంకణం కట్టుకుంది. ఎంపీ ఎన్నికల్లో గెలిస్తే పోయిన ఇమేజ్ తిరిగి వస్తుందని లెక్కలేసుకుంటోంది. అటు బీజేపీ మాత్రం మోదీ మ్యాజిక్తో డబుల్ డిజిట్ పక్కా అన్న ధీమాతో ఉంది. ఈ క్రమంలో టీవీ9 బిగ్ డిబేట్లో జరిగిన చర్చ.. రాజకీయంగా ఆసక్తి రేపింది. చర్చలో పాల్గొన్న బీఆర్ఎస్ నేత బాల్క సుమన్.. బీజేపీ-కాంగ్రెస్ మధ్య రహస్య ఒప్పందం జరిగిందని బాంబు పేల్చారు. అందులోభాగంగానే కాంగ్రెస్ బలహీనమైన ఎంపీ అభ్యర్థుల్ని పోటీలోకి దింపిందని.. ఆ స్థానాలేంటో కూడా రివీల్ చేశారు.
సుమన్ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ కొట్టిపడేశారు. బీజేపీ-కాంగ్రెస్ మధ్య ఒప్పందం ఉందని దేశంలో ఎవరితోనైనా అనిపించగలరా అని ప్రశ్నించారు.
బిగ్ డిబేట్లో కమలం కూడా కౌంటర్ ఎటాక్కి దిగింది. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బలంగా ఉన్న నేతలు.. పార్టీ మారగానే బలహీనంగా మారిపోయారా అని నిలదీశారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్.
వీక్ అభ్యర్థులు బరిలో ఉన్నారన్న వాదనలో నిజమెంత?
నిజాలు దేవుడెరుగు.. ఆరోపణలు, విమర్శలు మాత్రం ఎవరి స్టయిల్లో వాళ్లు ఇరగదీశారు. ఇంతకీ ఎవరి వాదనలో నిజముంది? వీక్ అభ్యర్థుల్ని బరిలోకి దింపారన్న వ్యాఖ్యల్లో వాస్తవమెంత? పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఎన్నికల స్టంటేనా? వేదిక ఎక్కడైనా, సందర్భం ఏదైనా ముక్కోణపు పోటీలో మైలేజ్ కోసం పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఫైనల్గా.. టీవీ9 బిగ్ డిబేట్లో జరిగిన చర్చ.. రాజకీయంగా సరికొత్త చర్చకు దారితీసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..