Hyderabad: ‘ఉచిత విద్యుత్ వైఎస్సార్ మానసపుత్రిక’.. దిగ్విజయ్ సింగ్ కీలక కామెంట్స్
ఉచిత విద్యుత్ YSR మానస పుత్రిక అన్నారు కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్సింగ్. హైదరాబాద్లో రైతే రాజైతే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన...వైఎస్సార్తో తనకు ఉన్న అనుంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పేద ప్రజలకోసం వైఎస్ఆర్ చేసిన సేవలను కాంగ్రెస్ నేతలు కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్ర రావు, మల్లు భట్టి విక్రమార్క, ఉండవల్లి అరుణ్ కుమార్, సిపిఐ నారాయణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి , పాలగుమ్మి సాయినాథ్, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి, కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దివంగత నేత, మాజీ సీఎం వైఎస్.రాజశేఖర్రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయనతో కలిసి పనిచేసిన నేతలు స్మరించుకున్నారు. వైఎస్ఆర్ మిత్రులు కేవీపీ, మాజీ మంత్రి రఘురవీరారెడ్డి కలిసి రాసిన రైతే రాజైతే పుస్తకావిష్కణ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ఆద్యంతం ఆసక్తికరంగా జరిగిన ఈ కార్యక్రమంలో కేవీపీ, రఘువీరా, జస్టిస్ సుదర్శన్రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు.
YS రాజశేఖర్రెడ్డితో తనకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్సింగ్. పార్టీ నిర్మాణంలో యుక్త వయస్సు నుంచే వైఎస్సార్ కీలకంగా పనిచేశారన్నారు. ఉచిత విద్యుత్ వైఎస్సార్ మానసపుత్రిక అని కొనియాడారు. ఇందిరమ్మ ఇళ్ళు వైఎస్సార్ చలువే అని, అవే విధానాలను ఏపీలో సీఎం జగన్కూడా ఇప్పుడు అమలు చేస్తున్నారన్నారు. YSR మరణించి ఉండకుంటే ఉంటే తెలుగు రాష్ట్రాలు మరోలా ఉండేవన్నారు. శ్రత్రువులు కూడా మెచ్చే గుణం వైఎస్సార్ది అన్నారాయన. నక్సలైట్లతో చర్చలు జరిపి జనజీవన స్రవంతిలోకి తీసుకురావడంలో వైఎస్సార్ కీలక భూమిక పోషించారన్నారు దిగ్విజయ్సింగ్. “ప్రజలకు కనీస అవసరాలను గుర్తించి అవి అమలయ్యేలా చేసేవారు YSR రాజశేఖర్రెడ్డి. వెనకబడిన, మైనార్టీ వర్గాలకు మేలు చేసేవారు. రైతులకు ఉచిత కరెంట్, పేదలకు ఆరోగ్యశ్రీ, ఫ్రీ అంబులెన్స్ సర్వీస్, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, మైనార్టీ రిజర్వేషన్ కల్పించారు. నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రాజశేఖర్రెడ్డి, ఎంతో చాకచక్యంగా, ధైర్యంగా పాలన కొనసాగించారు” అని దిగ్విజయ్సింగ్ వ్యాఖ్యానించారు.
వైఎస్సార్ మరణించినా ఆయనతో కేవీపీ జర్నీ కొనసాగుతూనే ఉందన్నారు మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి. రైతు రాజు కావడానికి ఏం చేయాలో వైఎస్సార్ అన్నీ చేశారన్నారు. కనీస మద్ధతు ధర ఎంతపెంచాలో ప్రతీ సంవత్సరం కేంద్ర సర్కార్కు లేఖ రాసే ఏకైక వ్యక్తి రాజశేఖర్రెడ్డేనని కొనియాడారు రఘువీరారెడ్డి. వైఎస్సార్ ఆశయాలతో ప్రతీ కార్యకర్త ముందుకెళ్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్దే అధికారమన్నారు కేవీపీ రామచంద్రరావు. మొత్తానికి రైతే రాజైతే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో వైఎస్ఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లి, కాంగ్రెస్ను తిరిగి అధికారంలోకి తేవాలని నేతలు సంకల్పించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.
