Telangana: తెలంగాణ ఆర్టీసీ బస్ కండక్టర్ ఆత్మహత్య.. బస్సులోనే ఉరివేసుకుని..
విధుల నిర్వహణలో ఉన్న తెలంగాణ ఆర్టీసీ బస్ కండక్టర్ బస్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో ఆదివారం (మార్చి 12) చోటు చేసుకుంది..
విధుల నిర్వహణలో ఉన్న తెలంగాణ ఆర్టీసీ బస్ కండక్టర్ బస్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో ఆదివారం (మార్చి 12) చోటు చేసుకుంది. పోలీలు తెలిపిన వివరాల ప్రకారం.. టీఎస్ఆర్టీసీ బస్ కండక్టర్ గార్లపాటి మహేందర్ రెడ్డి(55) అనారోగ్యం కారణంగా మార్చి 9 నుంచి 12వ తేదీ వరకు సెలవులో ఉన్నాడు. మార్చి 12 (ఆదివారం)వ తేదీన సెలవులో ఉన్నప్పటికీ ఉదయం 11 గంటలకు డిపోకు చేరుకుని డ్యూటీ వేయించుకున్నాడు. అనంతరం మహేందర్ ఎవరికీ కనిపించకుండా పోయాడు. తోటి సిబ్బంది ఫోన్ చేసినా స్పందించలేదు. ఆర్టీసీ సిబ్బంది డిపో ఆవరణలో గాలించగా.. పార్కింగ్ చేసి ఉన్న ఓ బస్సులో టవల్తో ఉరివేసుకుని విగత జీవిగా కనిపించాడు. వెంటనే ఆర్టీసీ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందికి దింపి పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మహేందర్ కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.
మృతుడికి భార్య అరుణ, విక్రమ్, వినయ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మహేందర్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మహేందర్ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యాజమాన్యం వేధింపుల కారణంగా విధి నిర్వహణలో ఉన్న మహేందర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని జాతీయ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పీ కమల్ రెడ్డి ఆరోపించారు. మహేందర్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, ఆయన కుటుంబానికి రూ.30 లక్షలు పరిహారం అందజేయాలని డిమాండ్ చేశాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.