Hyderabad MMTS: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వచ్చేవారం నుంచి పరుగులు పెట్టనున్న లోకల్ ట్రైన్..
Hyderabad MMTS train: కోవిడ్ వైరస్ వ్యాప్తి కొద్దిగా తగ్గుతుండటంతో ఎంఎంటీఎస్ రైళ్లు పరుగులు పెట్టేందుకు సిద్దవముతోంది. వచ్చేవారం నుంచి ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది.
కోవిడ్ వైరస్ వ్యాప్తి కొద్దిగా తగ్గుతుండటంతో ఎంఎంటీఎస్ రైళ్లు పరుగులు పెట్టేందుకు సిద్దవముతోంది. వచ్చేవారం నుంచి ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది. కోవిడ్ వైరస్ను అరికట్టడం కోసం విధించిన లాక్డౌన్ కారణంగా ప్రజారవాణాను సైతం నిలిపేసిన సంగతి తెలిసిందే. కానీ తర్వాత మెల్లగా ఆర్టీసీ బస్సు ప్రయాణాలు ప్రారంభం కాగా.. స్పెషల్ రైళ్లు తిరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు సేవలు సైతం అందుబాటులోకి వచ్చాయి. అయితే చిరు ఉద్యోగులు, సామాన్య ప్రజానీకం ఎక్కువగా ఉపయోగించే ఎంఎంటీఎస్ సేవలను ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర రైల్వే శాఖ. లోకల్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఎప్పుడు ప్రారంభిస్తుందనే విషయంలో స్పష్టత వచ్చింది.
ఇప్పటికే కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న ముంబైతోపాటు చెన్నై, బెంగళూరు నగరాల్లోనూ సబర్బన్ రైలు సేవలు మొదలయ్యాయి. అయితే హైదరాబాద్లో గత పది నెలలుగా నిలిచిపోయిన ఎంఎంటీఎస్ రైళ్లు పట్టాలెక్కబోతోంది. ఇక ఇతర నగరాల్లో ఇప్పటికే ఎంఎంటీఎస్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తుండటంతో భాగ్యనగరంలోనూ లోకల్ రైలు సేవలను అందుబాటులోకి తేస్తున్నట్లుగా రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రైల్వే శాఖ నిర్ణయంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
కోవిడ్ ప్రభావం లేకముందు రోజూ ఎంఎంటీఎస్ రైళ్లలో 1.6 లక్షల మంది ప్రయాణించేవారు. కనీస టికెట్ ధర రూ.5 ఉండగా.. గరిష్ట టికెట్ ధర రూ.15గా ఉంది. ఎంఎంటీఎస్ ద్వారా రైల్వేకు రోజుకు 9 లక్షల మేర ఆదాయం సమకూరేది. సికింద్రాబాద్ – లింగంపల్లి, హైదరాబాద్ (నాంపల్లి) – లింగంపల్లి, సికింద్రాబాద్ – ఫలక్నుమా మార్గాల్లో దక్షిణ మధ్య రైల్వే ఎంఎంటీఎస్ సర్వీసులను నడుపుతోంది.