Hyderabad: హైదరాబాద్ నడిబొడ్డున తియ్యటి విషం
మిఠాయిలు తినాలంటే ఇకపై ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. ఎందుకంటే తియ్యటివన్నీ స్వీట్లు కాదు. ఆ తియ్యదనం మాటున కాలకూట విషం దాగుంది. యస్..! ప్రజల అవసరాలను సొమ్ము చేసుకునేందుకు పన్నాగం పన్నిన అక్రమార్కులు.. కల్తీ పదార్థాలతో బురిడీ కొట్టిస్తున్నారు. హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన దాడుల్లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

హైదరాబాద్లో పలు స్వీట్ షాప్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి. కర్ణ ఆదేశాలతో 69 స్వీట్ షాప్స్ లో తనిఖీలు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఎక్స్ పైర్ అయిన ఫుడ్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ శివారు ప్రాంతాలే కాదు.. నగరం నడిబొడ్డున కూడా కల్తీ మాఫియా పడగ విప్పింది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నెలలు తరబడి మగ్గిన ముడి పదార్ధాలు, అపరిశుభ్ర వాతావరణం, ఫ్లేవర్ల కోసం రంగులు వాడుతూ.. అక్రమార్జన కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. కల్తీ, అపరిశుభ్ర వాతావరణలో మిఠాయిలు, కేక్లు తయారు చేసే కేంద్రాలపై తాజాగా అధికారులు దాడులు నిర్వహించారు. అక్కడ ఉన్న పరిస్థితులు చూసి అధికారులు సైతం ఆశ్చర్యపోయారు.
నాణ్యతా ప్రమాణాలపై నిర్లక్ష్యం వహిస్తుండటంతో 10 స్వీట్ షాపులు సీజ్ చేశారు. LB నగర్ సర్కిల్లో 3, RC పురం సర్కిల్లో 2 షాపులు సీజ్ చేశారు. కొత్తపేట, చార్మినార్, రామంతపూర్, శేరిలింగంపల్లి సర్కిల్, అల్వాల్లో ఒక్కో షాపుకు తాళం వేశారు. స్వీట్ షాపుల్లో అమ్మే వస్తువులకు ఎలాంటి లేబెల్, ఎక్స్ పైరీ డేట్ లేదని అధికారులు తెలిపారు. అలాగే కిచెన్ లో పని చేసే వారు హెడ్ కాప్స్, గ్లౌజ్, యాప్రాన్స్ వేసుకోకుండా పనిచేస్తున్నారని చెప్పారు. కిచెన్ లు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. FSSAI సర్టిఫికెట్స్ ఎక్స్ పైర్ అయినా రెన్యువల్ చేయించుకోకుండా స్వీట్ షాప్స్ నిర్వహిస్తున్నారు. ఇక నుంచి ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని స్వీట్ షాపులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు.




