Telangana: రైతులకు మరో గుడ్ న్యూస్.. రైతుభరోసా ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు.. అప్పటికల్లా డబ్బులు జమ..!
వన్ ఇయర్ సెలబ్రేషన్స్కు కాంగ్రెస్ సర్కార్ గ్రాండ్గా ఏర్పాట్లు చేస్తోందా?.. మరో భారీ హామీని నెరవేర్చి గుడ్ ఇంప్రెషన్ కొట్టేసేందుకు సిద్ధమవుతోందా?.. ఇప్పటికే రుణమాఫీతో రికార్డ్ సృష్టించిన రేవంత్ ప్రభుత్వం.. రైతులకు మళ్లీ శుభవార్త చెప్పబోతోందా?.. ఆ హామీ నెరవేర్చి విపక్షాల ఆరోపణలకు కూడా చెక్ పెట్టేందుకూ స్కెచ్ వేస్తోందా?.. ఇంతకీ.. వన్ ఇయర్ సెలబ్రేషన్స్ వేళ రైతులకు రేవంత్ సర్కార్ ఇచ్చే గిఫ్ట్ ఏంటి?..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తుండడంతో భారీ ప్రణాళికలకు సిద్ధమవుతోంది. ఈ నెల 14 నుంచి.. రేవంత్రెడ్డి సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. 26రోజుల పాటు భారీగా ఉత్సవాలు నిర్వహించి ఏడాదిగా ఏం చేశారు.. ఏం ఇచ్చారు.. అని పదేపదే ప్రశ్నిస్తున్నవాళ్లకు ధీటైన సమాధానం ఇచ్చేందుకు రెడీ అవుతోంది. దానిలో భాగంగానే.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మరో మహత్తర కార్యక్రమాన్ని కంప్లీట్ చేసి.. అందరి చూపు తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు సీఎం రేవంత్రెడ్డి. ఏడాది కాలంలో ఎన్నో పథకాలు అమలు చేశామని చెప్తున్న సీఎం రేవంత్.. ప్రధానమైన రైతు రుణమాఫీ కూడా నెరవేర్చామంటున్నారు. దాదాపు 22 లక్షల మంది రైతులకు 18 వేల కోట్ల రుణాలు మాఫీ చేసినట్లు వెల్లడించారు. మరో 13 వేల కోట్లు త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.
డిసెంబర్ చివరికి రైతుభరోసా కంప్లీట్ చేసేలా కసరత్తు
ఇక.. ఇంత చేసినా రైతుల విషయంలో ఓ అపవాదు వెంటాడుతోందని రేవంత్ ప్రభుత్వం గుర్తించింది. అదే రైతు భరోసా.. గత ప్రభుత్వం ఇచ్చిన 10వేల రైతు బంధును.. రైతుభరోసాగా హామీ ఇచ్చింది కాంగ్రెస్. అధికారంలోకి వస్తే 15వేలు ఇస్తామని చెప్పింది. కానీ.. ఏడాది గడిచినా ఇవ్వడంలేదని విపక్షాలు పెద్దయెత్తున ఆరోపణలు చేస్తున్నాయి. రైతులు కూడా వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. దాంతో.. ఏడాది పాలన పూర్తవుతున్న వేళ ఎలాగైనా రైతు భరోసా హామీని నెరవేర్చాలని భావిస్తోంది రేవంత్ సర్కార్. దీనికి సంబంధించి కసరత్తు ప్రారంభించి.. రైతు భరోసా నిధుల సర్దుబాటుకు ఆర్థిక శాఖను కూడా ఆదేశించారు సీఎం రేవంత్రెడ్డి. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా.. ఒక ఎకరా నుంచి మొదలు పెట్టి.. డిసెంబర్ చివరి నాటికి రైతుభరోసా కంప్లీట్ చేయాలని నిర్ణయించారు.
ఏడెనిమిది ఎకరాల వరకు రైతు భరోసా ఇచ్చే చాన్స్
రైతు భరోసా పక్కాగా అమలు చేసేందుకు డిసైడ్ అయిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కఠినమైన గైడ్లైన్స్ రూపొందిస్తోంది. ఇప్పటికే కేబినెట్ సబ్కమిటీలోనూ రైతు భరోసా మార్గదర్శకాలపై చర్చించారు. కేవలం సాగులో ఉన్న భూములకే రైతు భరోసా ఇవ్వాలని చూస్తోంది. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. త్వరలోనే సీఎం రేవంత్రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో రకరకాల విజ్ఞప్తులు రాగా.. ఫైనల్గా ఏడెనిమిది ఎకరాల వరకు రైతు భరోసా ఇచ్చే చాన్స్ ఉంది. ఈ లెక్కన తెలంగాణలో సాగు భూమి 1.39కోట్ల ఎకరాలు ఉండగా.. సుమారు 7వేల కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేస్తోంది. ప్రతి 10రోజులకు 1500కోట్ల నుంచి 2వేల కోట్ల వరకూ రైతు భరోసా పంపిణీకి కసరత్తు చేస్తోంది. మొత్తం 45 రోజుల్లో కనీసం 7వేల కోట్లు రైతు ఖాతాల్లో జమ చేయాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. మొత్తంగా.. ఏడాది పండుగకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రాండ్గా ఏర్పాట్లు చేస్తోంది. అదే సమయంలో రైతు భరోసాను కంప్లీట్ చేసి.. అన్నదాతల కళ్లలో ఆనందం నింపడంతోపాటు.. విపక్షాల నోళ్లకు తాళం వెయ్యాలని చూస్తోంది. ఫలితంగా.. రైతు రుణమాఫీ విషయంలో మిస్ అయిన మైలేజ్ను రైతుభరోసాతో రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
