AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INDW vs SLW: ప్రపంచ రికార్డుతో చెలరేగిన దీప్తి శర్మ.. తొలి టీమిండియా ప్లేయర్ గా సరికొత్త చరిత్ర..

India women vs Sri lanka women: భారత్ వర్సెస్ శ్రీలంక మహిళల జట్ల మధ్య తిరువనంతపురంలో జరిగిన మూడవ టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ముఖ్యంగా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ, పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ తమ బౌలింగ్‌తో లంక జట్టును గడగడలాడించారు. ఈ మ్యాచ్‌లో దీప్తి శర్మ సృష్టించిన సరికొత్త ప్రపంచ రికార్డు ఇప్పుడు క్రికెట్ లోకంలో హాట్ టాపిక్‌గా మారింది.

INDW vs SLW: ప్రపంచ రికార్డుతో చెలరేగిన దీప్తి శర్మ.. తొలి టీమిండియా ప్లేయర్ గా సరికొత్త చరిత్ర..
Deepti Sharma Record
Venkata Chari
|

Updated on: Dec 26, 2025 | 9:32 PM

Share

టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (Deepti Sharma) తన కెరీర్‌లో మరో అరుదైన మైలురాయిని అందుకుంది. శ్రీలంకతో శుక్రవారం జరిగిన మూడవ టీ20 మ్యాచ్‌లో ఆమె అద్భుతమైన బౌలింగ్‌తో చరిత్ర సృష్టించింది. కేవలం 18 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీయడం ద్వారా, అంతర్జాతీయ టీ20ల్లో 150 వికెట్ల మార్కును అందుకున్న మొట్టమొదటి భారత ప్లేయర్‌గా నిలిచింది.

ప్రపంచ రికార్డు సమం..

ఈ మ్యాచ్‌లో 3 వికెట్లు తీయడంతో దీప్తి శర్మ మొత్తం వికెట్ల సంఖ్య 151కి చేరింది. తద్వారా ఆస్ట్రేలియా పేసర్ మేగాన్ షట్ (151 వికెట్లు) పేరిట ఉన్న ‘మహిళల టీ20ల్లో అత్యధిక వికెట్లు’ అనే ప్రపంచ రికార్డును దీప్తి సమం చేసింది. అంతేకాకుండా, అంతర్జాతీయ టీ20ల్లో 1000 పరుగులు, 150 వికెట్లు తీసిన ఏకైక క్రికెటర్‌గా (పురుషుల క్రికెట్‌లో కూడా ఎవరికీ ఈ రికార్డు లేదు) సరికొత్త చరిత్ర లిఖించింది.

రేణుకా సింగ్ నిప్పులు చెరిగే బౌలింగ్..

మరోవైపు, భారత పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ (Renuka Singh Thakur) ఈ మ్యాచ్‌లో లంక టాప్ ఆర్డర్‌ను దెబ్బతీసింది. గత కొన్ని మ్యాచ్‌లుగా ఆశించిన స్థాయిలో రాణించని రేణుకా, ఈ మ్యాచ్‌లో తిరిగి ఫామ్‌లోకి వచ్చింది. కేవలం 21 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి శ్రీలంక బ్యాటింగ్ వెన్నెముకను విరిచింది. ఆమె వేసిన స్వింగ్ బంతులకు లంక బ్యాటర్ల దగ్గర సమాధానం లేకపోయింది.

తక్కువ స్కోరుకే లంక పరిమితం..

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు, భారత బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 112 పరుగులు మాత్రమే చేయగలిగింది. లంక బ్యాటర్లలో ఇమేషా దులాని (27), హసిని పెరీరా (25) మాత్రమే కాస్త ప్రతిఘటించారు. కెప్టెన్ చామరి ఆటపట్టు (3)ను దీప్తి శర్మ త్వరగానే పెవిలియన్ పంపడంతో లంక కోలుకోలేకపోయింది.

ప్రస్తుతం దీప్తి శర్మ ఉన్న ఫామ్ చూస్తుంటే, వచ్చే మ్యాచ్‌ల్లో మేగాన్ షట్ రికార్డును అధిగమించి ప్రపంచంలోనే నంబర్ వన్ టీ20 బౌలర్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే వన్డే ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన దీప్తి, ఈ ఏడాది ఐసీసీ అవార్డుల రేసులోనూ ముందంజలో ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..