TRS Dissent: గులాబీ తోటలో అసంతృప్తి సెగలు.. పాలమూరులో కేసీఆర్.. ఖమ్మం గుమ్మంలో జూపల్లి.. మతలబు అదేనా!

గులాబీ తోటలో అసంతృప్తి సెగలు కక్కుతోందా..? ఖమ్మం గుమ్మంలో గులాబీకి మళ్లీ ఎదురుగాలి వీస్తోందా..? తాజా పరిణామాలు గమనిస్తే అవుననే సమాధానమే వినిపిస్తోంది.

TRS Dissent: గులాబీ తోటలో అసంతృప్తి సెగలు.. పాలమూరులో కేసీఆర్.. ఖమ్మం గుమ్మంలో జూపల్లి.. మతలబు అదేనా!
Thummala Jupally
Follow us

|

Updated on: Mar 09, 2022 | 8:44 AM

Jupally Meets Thummala: గులాబీ తోటలో అసంతృప్తి సెగలు కక్కుతోందా..? ఖమ్మం(Khammam) గుమ్మంలో గులాబీకి మళ్లీ ఎదురుగాలి వీస్తోందా..? తాజా పరిణామాలు గమనిస్తే అవుననే సమాధానమే వినిపిస్తోంది. పాలమూరులో గులాబీ బాస్ కేసీఆర్(KCR) పర్యటిస్తుంటే.. ఖమ్మంలో ఆ పార్టీ ముఖ్యనేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావు(Jupally Krishna Rao).. మరో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao)తో కలిసి రహాస్య మంతనాలు జరిపారు. అయితే, పార్టీ అధినేత పర్యటన రోజే ఖమ్మం టూర్ వెనుక మతలబ్ ఏంటి.. అసంతృప్త గులాబి నేతల తో భేటీ వెనుక మర్మం ఏంటి…ఈ నెలలోనే జూపల్లి బృందం భవిష్యత్ కార్యాచరణ పై ప్రకటన చేయబోతున్నారా అంటే అవుననే అనిపిస్తుంది.

ఖమ్మం టీఆర్‌ఎస్‌లో లుకలుకలు మొదలైనట్టే కనిపిస్తోంది. టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతల సమావేశం పొలిటికల్‌ సర్కిళ్లలో హాట్‌టాపిక్‌గా మారింది. పార్టీ సీనియర్‌ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేని శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావుల భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా రాజకీయాలపై చర్చించిన నేతలు.. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈక్రమంలోనే సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారంటూ కొంతకాలంగా విస్తృత ప్రచారం నడుస్తోంది. అందుకే ఆయన ఖమ్మం జిల్లా రాజకీయాల్లో సైలెంట్ అయ్యారన్న వాదన ఉంది. ఖమ్మం నుంచి మంత్రి పువ్వాడ అజయ్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేరికలతో ఆధిపత్య పోరు నడుస్తోందనే టాక్ నడిచింది.

మరోవైపు పాలమూరు టీఆర్ఎస్ ముఖ్యనేత మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఖమ్మం కహానిపై ఇప్పుడు సార్వత్ర ఆసక్తి నెలకొంది.కొద్దీ రోజులుగా పార్టీలో జూపల్లి కృష్ణారావు అసంతృప్తిగా ఉన్నమాట తెలిసిందే.. అయితే ఒక వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు పర్యటన లో ఉంటే హాజరు కావాల్సిన జూపల్లి ఖమ్మంలో ప్రత్యక్షమవ్వడం ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కొద్దిరోజులుగా జూపల్లి పార్టీ మారతారా అనే ప్రచారం కూడా జరుగుతుంది. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా జూపల్లి పనిచేశారన్న ఆరోపణలు వినిపించాయి.. ఇదిలావుంటే ఆయన వెన్నంటే ఉన్న నాయకులు, కార్యకర్తలు కూడా ఆయనను కాంగ్రెస్‌ గూటికి చేరాలని గట్టిగా ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది.

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కొంతకాలంగా సైలెంట్‌గా ఉంటున్నారు. పార్టీలో తగిన గుర్తింపు దక్కడం లేదన్న భావనలో ఉన్నారాయన. ఇటీవలే.. ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు పొంగులేటి. దీంతో ఆయన టీఆర్ఎస్‌ను వీడనున్నారా అన్న ప్రచారం సాగింది. టీఆర్‌ఎస్‌లో తనకు ప్రాధాన్యం దక్కడం లేదని.. ఇదే విషయాన్ని జగన్‌తోనూ ప్రస్తావించినట్టు తెలుస్తోంది. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్‌లో చేరారు

ఖమ్మం పర్యటనలో జూపల్లి కృష్ణారావు భేటీ అయిన నేతల వివరాలు చూస్తే పక్కా పొలిటికల్ మీట్ అనేది కన్ఫామ్ అయినట్టు తెలుస్తోంది. పార్టీ మారుతారా.. మారితే ఏ పార్టీలో చేరతారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ భేటీల తరువాత కొంతమంది తన అనుచరులతో ఈ నెల 15 తరువాత భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని హింట్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్‌కు వచ్చిన జూపల్లి తిరిగి సొంత గూటికి వెళ్తారా లేదా కమలంతో చేతులు కలుపుతారా అనేది కొద్దీ రోజుల్లోనే తేటతెల్లం కాబోతోంది. మొత్తంగా.. ఈ ముగ్గురు కీలక నేతల నెక్ట్స్‌ స్టెప్‌ ఎలా ఉంటుందన్నది ఆసక్తి రేపుతోంది.

— శ్రీధర్ ప్రసాద్, టీవీ 9 ప్రతినిధి, హైదరాబాద్.

Read Also…  

News Watch LIVE: నిరుద్యోగులూ… 10 గంటలకు టీవీ చూడండి..! మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..(వీడియో)