AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరుణుడి ఉగ్రరూపం.. తండ్రీకొడుకులతో సహా వరదలో కొట్టుకుపోయిన కారు!

కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండలో బుధవారం అత్యధికంగా 43.1 సెం.మీ వర్షం కురిసింది. ఇక నిర్మల్‌ జిల్లా అక్కాపూర్‌లో 32.3 సెం.మీ, మెదక్‌ జిల్లా సర్దానలో 30.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలో జిల్లాలోని దోమకొండ మండలం సంగమేశ్వర్ ఎడ్లకట్ట వాగు సమీపంలో వరదలో చిక్కుకొని ఓ కారు కొట్టుకుపోయింది. కారులో ఉన్న తండ్రీకొడుకులు వాగులోని వరద నీటిలో కొట్టుకుపోయారు..

వరుణుడి ఉగ్రరూపం.. తండ్రీకొడుకులతో సహా వరదలో కొట్టుకుపోయిన కారు!
Car Washed Away In Kamareddy District
Srilakshmi C
|

Updated on: Aug 28, 2025 | 8:03 AM

Share

హైదరాబాద్, ఆగస్ట్‌ 28: కామారెడ్డి జిల్లాపై వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. బుధవారం ఒక్కరోజే కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండలో అత్యధికంగా 43.1 సెం.మీ వర్షం కురిసింది. ఇక నిర్మల్‌ జిల్లా అక్కాపూర్‌లో 32.3 సెం.మీ, మెదక్‌ జిల్లా సర్దానలో 30.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలో జిల్లాలోని దోమకొండ మండలం సంగమేశ్వర్ ఎడ్లకట్ట వాగు సమీపంలో వరదలో చిక్కుకొని ఓ కారు కొట్టుకుపోయింది. కారులో ఉన్న తండ్రీకొడుకులు వాగులోని వరద నీటిలో కొట్టుకుపోయారు.

దోమకొండకు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ మేక చిన్న హరిశంకర్, ఆయన కుమారుడు మహేశ్‌ కారులో మేనల్లుడి అంత్యక్రియల కోసం బయల్దేరారు. ఈ క్రమంలో వీరికారు వాగులో చిక్కుకుపోయింది. దీంతో తండ్రీకొడుకులు కారుపై కూర్చొని సాయం చేయాలంటూ ఎంతగా అరిచి గగ్గోలు పెట్టారు. గమనించిన సంగమేశ్వర్ గ్రామస్థులు జేసీబీ సాయంతో వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. నీటి ప్రవాహంలో తండ్రీ కొడుకులతో సహా కారు కళ్లముందే కొట్టుకుపోయింది. అయితే ఆశ్చర్యంగా వారు ఓ చెట్టును పట్టుకొని ప్రాణాలు కాపాడుకోగలిగారు. దాదాపు 9 గంటలపాటు చెట్టు కొమ్మ ఆసరాతో అలాగే ఉండిపోయారు. అనంతరం వరద ఉద్ధృతి తగ్గడంతో వ్యవసాయ భూముల నుంచి పాక్కుంటూ బయటపడ్డారు. దీంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.

మరోవైపు రాజంపేట మండల కేంద్రంలో వర్షానికి గోడ కూలి ఓ యువ వైద్యుడు మృతి చెందాడు. రాజంపేటకు చెందిన వినయ్ (28) గుండారం పల్లె దవాఖానాలో వైద్యుడిగా పని చేస్తున్నాడు. భారీ వర్షానికి దేవుని చెరువు కట్ట తెగడంతో వరదనీరు వినయ్‌ ఇంట్లోకి ప్రవేశించింది. నీటిని బయటకు మళ్లించేందుకు గడ్డపారతో గోడకు రంధ్రం చేసేందుకు యత్నించాడు. కానీ అంతలో గోడ మొత్తం కూలడంతో వినయ్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. రాజంపేట మండలంలోని 3 తండాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బీబీపేట మండలంలో 9 మంది యువకులు చెరువు కట్టపై ఇరుక్కు పోయారు. కామారెడ్డి జిల్లా తిమ్మారెడ్డిలోని కల్యాణి వాగు బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతున్న ఆరుగురు కార్మికులు వరదలో చిక్కుకున్నారు. ఈ వరద కారణంగా కామారెడ్డి- భిక్కనూర్‌ సమీపంలో రైలు పట్టాల కింద గండిపడి పడటంతో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us