పెళ్లంటే 3 ముళ్లు.. ఏడడుగులే కాదు! చర్నకోలతో మూడు దెబ్బలు కూడా..
పెళ్లంటే.. ఆకాశమంత పచ్చని పందిళ్లు, మామిడి తోరణాలు, తలంబ్రాలు, మంగళ వాయిద్యాల నడుమ.. అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసుకుని చేసుకునే సంబరం. ఇక పందిట్లో మూడు ముళ్లు, ఏడు అడుగులు మొత్తం కలిపి పురోహితుల వేదమంత్రాల సాక్షిగా వధువు మెడలో తాళి కట్టడంతో పెళ్లి తంతు..

పెళ్లంటే.. అదో పండగ. రెండు జంటల కలయిక, రెండు కుటుంబాల అనుబంధం. ఆకాశమంత పచ్చని పందిళ్లు, మామిడి తోరణాలు, తలంబ్రాలు, మంగళ వాయిద్యాల నడుమ.. అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసుకుని చేసుకునే సంబరం. ఇక పందిట్లో మూడు ముళ్లు, ఏడు అడుగులు మొత్తం కలిపి పురోహితుల వేదమంత్రాల సాక్షిగా వధువు మెడలో తాళి కట్టడంతో పెళ్లి తంతు పూర్తవుతుంది. ఆనక విందు భోజనాలు, పెట్టుపోతలు వంటి తతంగాలు జరిగిపోతాయి. అయితే వైఎస్సార్ కడప జిల్లాలోని బూచుపల్లె వంశీయుల పెళ్లి మాత్రం ఈ మొత్తం తతంగంతోపాటు చర్నకోలతో పెళ్లి కుమారుడికి కాసిన్ని దెబ్బలు కూడా కట్నంగా ఇస్తారట. అదేంటీ అనుకుంటున్నారా..? అయితే మీరీ విషయం తెలుసుకోవాల్సిందే..
ఇక్కడి బూచుపల్లె వంశీయుల పెళ్లిలో వరుడిని చర్నాకోలుతో మూడు దెబ్బలు కొట్టిన తర్వాతే వివాహం పూర్తయినట్లు భావిస్తారట. పెళ్లి పీటలపై వధువు మెడలో వరుడు తాళి కట్టిన తర్వాత అతడిని కుటుంబ సభ్యులు చర్నకోలతో మూడు దెబ్బలు వెస్తారట. ఈ కొట్టే ఆచారం వీరి వంశంలో తరతరాలుగా వస్తుంది మరీ..
అసలీ ఆచారం ఎలా మొదలైందంటే..
వందల ఏళ్ల క్రితం బూచుపల్లె వంశీయులు గంగమ్మ ఆలయం నుంచి ఓ పెట్టెను ఇంటికి తీసుకొచ్చారు. ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో ఐదు చర్నకోలాలు కనిపించాయి. వెంటనే ఆ వంశీలు ఆలయంలోకి వెళ్లి గంగమ్మను తప్పు జరిగిందని, క్షమించమని వేడుకున్నారు. దీంతో గంగమ్మ ప్రత్యక్షమై.. మీ వంశీయుల వివాహ సమయాల్లో వరుడికి చర్నకోలతో మూడు దెబ్బలు కొట్టాలని చెప్పిందట. దీంతో అప్పటి నుంచి ఆ ఆచారాన్ని వారి వంశంలో జరిగే ప్రతి పెళ్లిలోనూ కొనసాగిస్తున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలోని భద్రంపల్లె, తొండూరు, ఇనగలూరు, లోమడ, బూచుపల్లె, బోడివారిపల్లె, మల్లేల, అగడూరు, సంతకొవ్వూరు గ్రామాల పరిధిలో బూచుపల్లె వంశీయుల కుటుంబాలు ఉన్నాయి. ఈ ఊర్లలో దాదాపు వెయ్యికి పైగా ఈ వంశీయుల కుటుంబాలు ఉన్నాయి. వీరంతా పెళ్లిళ్ల సమయంలో నేటికీ ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




