Andhra: ఏపీలో వచ్చే 3 రోజులు పిడుగులతో వర్షాలు.. ప్రజలకు అలెర్ట్..
ఏపీలో రానున్న మూడు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండకూడదని స్పష్టం చేసింది. ఏపీ లేెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇప్పుడు తెలుసుకుందాం...

ఆంధ్రప్రదేశ్ తీరం, పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి సగటున 3.1కిమీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. తమిళనాడు మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ద్రోణి విస్తరించి ఉందన్నారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు పడేందుకు అవకాశం ఉందని వెల్లడించారు.
రైతాంగం అప్రమత్తంగా ఉండి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మినుము, మిరప, పసుపు ఆరబెట్టిన ఇతర పంటలు తడవకుండా జాగ్రత్త పరుచుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉరుములతో కూడిన వర్షాలు పడే సమయంలో చెట్ల క్రింద, పొలాల్లో ఉండరాదన్నారు. ఇంట్లో ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులను వాడటం తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.
రానున్న మూడు రోజులు వాతావరణం క్రింద విధంగా ఉండనున్నట్లు ఏపిఎస్డిఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు
శుక్రవారం(20-03-26) : రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
శనివారం(21-03-26) : శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఆదివారం(22-03-26): శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కాగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండరాదు.
Also Read: వేసవిలో ఉదయాన్నే ఒక కప్పు.. రోజంతా బాడీ కూల్.. కూల్..
