Telangana: అక్రమ సంబంధం కోసం ఎంతకు తెగించాడు.. ప్రియురాలి భర్తను చంపేందుకు సుపారీ.. కట్ చేస్తే
ప్రియురాలి భర్తను హత్య చేసేందుకు సుపారి ఇచ్చాడు ప్రియుడు... వివాహేతర సంబంధం నేపథ్యంలో.. ఆమె భర్తను హత్య చేసేందుకు స్కెచ్ గీశాడు. ఇందుకోసం సుపారీ గ్యాంగ్తో 20 లక్షలకు డీల్ కుదుర్చుకుని...అడ్వాన్స్ కింద 5 లక్షలు ఇచ్చాడు. చెప్పిన సమయానికి మిగిలిన నగదు ఇవ్వక పోవడంతో నిందితులు హత్య చేయకుండా వదిలి పెట్టారు. అయితే ఈ ప్లాన్ గుట్టు రట్టవ్వడంతో.. ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.

వివాహేతర సంబంధం నేపథ్యంలో తన ప్రియురాలి భర్తను హత్య చేయించేందుకు సుపారీ ఇచ్చాడు ఆ వ్యక్తి. ఐదుగురు కలిసి ఈ మర్డర్కు స్కెచ్ వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. హత్యకు రూ.20 లక్షల సుపారీ ఇస్తానని, అందులో అడ్వాన్స్ రూ.ఐదు లక్షలు ఇచ్చినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఖమ్మం ఖానాపురం హవేలి పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేసి, రిమాండుకు తరలించారు.
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం సువర్ణపురం గ్రామానికి చెందిన తోట ధర్మ… తనకు కొందరు కిడ్నాప్ చేసి.. డబ్బు తీసుకుని వదిలి పెట్టారని.. ప్రాణహాని ఉందంటూ ఇచ్చిన ఫిర్యాదుతో హత్యాయత్నం కుట్రను చేధించారు ఖానాపురం హవేలీ పోలీసులు. ఇన్వెస్టిగేషన్ చేసి హత్య కుట్ర నిజమే అని తేల్చారు. నిందితుల నుంచి మారణాయుధాలు ఆయుధాలు, ఎయిర్ గన్, 90 వేల నగదు, 5 సెల్ ఫోన్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు.
సువర్ణపురం గ్రామానికి చెందన తోట ధర్మ అనే వ్యక్తి భార్యతో అదే గ్రామానికి చెందిన కొండూరి రామంజనేయులు అలియాస్ రాము అనే వ్యక్తికి మధ్య వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో మహిళ భర్త ధర్మకు ఈ అక్రమ సంబంధం విషయం తెలియడంతో భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో ప్రియురాలికి, తనకు మధ్య అడ్డుగా ఉన్న ధర్మను అడ్డు తొలగించాలని కొండూరి రామంజనేయులు డిసైడయ్యాడు. ఖమ్మం రూరల్ మండలం బారుగూడెం గ్రామానికి చెందిన దంతాల వెంకటనారాయణను సంప్రదించి హత్య విషయమై వివరించాడు. వెంకట్ తన స్నేహితుడు, రౌడీషీటర్ అయిన పగడాల విజయకుమార్ అలియాస్ చంటిని పరిచయం చేశాడు. హత్యకు రూ.20 లక్షలు సుపారీగా ఒప్పుకొని, మొదటగా రూ.ఐదు లక్షలు అడ్వాన్స్ తీసుకున్నారు. ఈ క్రమంలో మార్చి 12న ఖమ్మం నగరంలోని ధంసలాపురం వద్ద సదరు మహిళ భర్త ధర్మను కిడ్నాప్ చేశారు.
మిగతా డబ్బు కోసం సుపారీ గ్యాంగ్ రామంజనేయులను సంప్రదించగా… స్పందించకపోవడంతో హత్య చేయకుండా ఆగిపోయారు. ధర్మను బెదిరించి రూ.1,50,000 నగదు, బంగారు గొలుసు తీసుకొని వదిలేశారు. వారి చెర నుంచి తప్పించుకున్న ధర్మ ఏప్రిల్ 11న ఖమ్మం అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, నగర ఏసీపీ రమణమూర్తి పర్యవేక్షణలో విచారణ చేపట్టారు. విచారణలో నిందితుల బాగోతం బట్టబయలైంది. దీంతో ఈ కేసుతో సంబంధం ఉన్న ఐదుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. తనకు ఇప్పటికీ ప్రాణహాని ఉందని పోలీసులు రక్షణ కల్పించాలని ధర్మ కోరుతున్నాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..